బడుగుల పెన్నిధి రాజశేఖరుడు

8 Jul, 2014 02:52 IST|Sakshi
బడుగుల పెన్నిధి రాజశేఖరుడు

* పేదల కోసం ఎన్నో పథకాలు
* 108, ఆరోగ్యశ్రీతో ప్రాణాలకు ఊపిరి
* విద్యార్థులకు వరం ఫీజు రీయింబర్స్‌మెంట్
* పింఛన్ల పెంపుతో వృద్ధులు...  
* వితంతువుల్లో ఆత్మస్థైర్యం
* నేడు వైఎస్ జయంతి
సాక్షి, మహబూబ్‌నగర్: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికున్నంత కాలం పేదలు, బడుగుల సంక్షేమం గురించే ఆలోచించేవారు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రవేశపెట్టిన పథకాలతో జిల్లాలోని పేదలకు ఎంతో ఊరట కలిగింది. ప్రధానంగా 108, ఆరోగ్యశ్రీ ద్వారా వేలాదిమంది ప్రాణాలు కాపాడుకోగలిగారు. పింఛన్లతో వృద్ధులు.. వితంతువుల్లో ఆత్మస్థైర్యం పెరిగింది.

 వైఎస్ ముఖ్యమంత్రిగా కొనసాగిన 2004-2009 కాలంలో జిల్లాలో ఆరోగ్యశ్రీ పథకాన్ని జిల్లాలో 32,432మంది వినియోగించుకోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం పొందారు. వైఎస్ రాకముందు జిల్లాలో వివిధ రకాల పింఛన్లు 60వేలు మాత్రమే ఉండేవి. వైఎస్ వాటిని 3లక్షల 52వేల 298మందికి పెంచారు. అదేవిధంగా 96వేల 445 మహిళా గ్రూపులకు పావలా వడ్డీకింద రుణాలు అందించారు. వీటితో పాటు అనేక పథకాల ద్వారా జిల్లాలో వేలాది మంది లబ్ధి పొందారు.
 
వైఎస్ మానస పుత్రిక 108
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మానసపుత్రిక 108. ప్రమాదం ఎలాంటిదైనా జిల్లాలో ఫోన్ చేసిన 20 నిమిషాల వ్యవధిలోనే సంఘటన స్థలంలో వాలిపోతుంది. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో 19 నిమిషాలు, గ్రామీణ ప్రాంతాల్లో 24, గిరిజన ప్రాంతాల్లో 26 నిమిషాల వ్యవధిలో అంబులెన్స్ అక్కడకు చేరుతుంది.

బాధితులకు తగిన ప్రాథమిక చికిత్స అందించి, పూర్తిస్థాయి వైద్యం కోసం సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్తుంది. జిల్లాలో మొత్తం 33 అంబులెన్స్ వాహనాలు వివిధ పట్టణాల నుంచి సేవలందిస్తున్నాయి. ఆగస్టు 15, 2005న ప్రారంభమైన ఈ సేవలు దాదాపు తొమ్మిదేళ్లుగా నిర్విరామంగా కొనసాగిస్తోంది. లక్షలాది మంది ప్రాణాలను నిలబెడుతోంది.
 
ఈ ఏడాది జూన్‌లోనే మహబూబ్‌నగర్ జిల్లాలో దాదాపు 3,842మంది బాధితులను ఆసుపత్రులకు చేర్చి ఆదుకుంది. ఇందులో గర్భిణీ స్త్రీలు 1229 కాగా, రోడ్డు ప్రమాదాలు 452 తదితర కేసులున్నాయి. వీటితో పాటు వేలాది మంది వృద్ధులు, వితంతువులకు పింఛన్‌లతో పాటు పింఛన్ మొత్తాన్ని పెంచి ప్రతినెలా వారికి అందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ ఉన్నత విద్యకు తోడ్పాటునందిస్తే... ఆరోగ్యశ్రీ ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఆయన మరణించిన తర్వాత పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నీ ఒక్కొక్కటిగా నిర్వీర్యమవుతున్నాయని జిల్లావాసులు ఆందోళన చెందుతున్నారు

>
మరిన్ని వార్తలు