‘డిపాజిట్‌’ అంటే.. 

15 Nov, 2018 14:59 IST|Sakshi

సదాశివపేట రూరల్‌(సంగారెడ్డి): ఎన్నికల్లో పోటీ చేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం కొన్ని అర్హతలు నిర్దేశించింది. అభ్యర్థుల నుంచి నామినేషన్‌ రుసుం వసూలు చేస్తుంది. నిర్దేశిత ఓట్లు వచ్చిన వారికి ఆ రుసుం తిరిగి చెల్లిస్తారు. ఆ మొత్తాన్ని డిపాజిట్‌ అని పిలుస్తారు.

శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్‌ తో పాటుగా జనరల్, బీసీ కేటగిరీకి చెందిన అభ్యర్థులు రూ. 10 వేలు, ఎస్సీ, ఎస్టీలు రూ. 5 వేల చొప్పున నామినేషన్‌ రుసుం(డిపాజిట్‌) చెల్లించాల్సి ఉంటుంది.

ఫలితాల అనంతరం అభ్యర్థికి కనీస ఓట్లు వస్తేనే డిపాజిట్‌(నామినేషన్‌ రుసుం) తిరిగి ఇస్తారు. 

డిపాజిట్‌ రావాలంటే పోలై, చెల్లిన ఓట్లలో కనీసం 1/6వంతు(16.66)ఓట్లు పొందాలి. అంటే నూటికి దాదాపుగా 17ఓట్లు పొందాలి.

బీ–ఫారం, ఏ ఫారం  అంటే.. 
ఎన్నికల సమయంలో తరుచుగా ఏ ఫారం,బీ ఫారం పేర్లు వింటుంటాం. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల గుర్తులు అభ్యర్థులకు రావాలంటే ఇవి అవసరం. అవేమిటో.. ఎలా ఇస్తారో తెలుసుకోండి.

ఏ ఫారం  అంటే.. 
పార్టీ తన అభ్యర్థిగా ఎవరినైతే ఎంపిక చేస్తుందో.. వారికీ ’బీ’ఫారం అందిస్తారు..... బీ ఫారం అందించే వ్యక్తికి ముందుగా ఇచ్చేది ’ఏ’ ఫారం. ఎవరినైతే పార్టీ ఎంపిక చేసి ‘ఏ’ ఫారం అందిస్తుందో వారికి మాత్రమే తర్వాత బీ ఫారం అందిస్తారు. ‘ఏ’ ఫారం అందుకున్న పార్టీ అభ్యర్థి ముందుగా తనకు లభించిన ’ఏ’ ఫారం ను ఎన్నికల అధికారులకు అందిస్తారు.

’బీ’ ఫారం... 
గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు తమ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు వీరేనని ఇచ్చేదే ‘బీ’ఫారం. నామినేషన్‌ వేసే సమయంలో ఎన్నికల అధికారులకు ఈ ఫారాన్ని దాఖలు చేస్తే పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును సదరు అభ్యర్థికి కేటాయిస్తారు. పార్టీ అధ్యక్షుడు, ప్రత్యేకంగా నియమించిన ప్రతినిధుల ద్వారా ఈ ఫారాన్ని అందిస్తారు. 

మరిన్ని వార్తలు