ఇవి రేషన్‌ బియ్యమేనా?

12 Jul, 2018 09:04 IST|Sakshi
రేషన్‌బియ్యంలో పురుగులు  

నవాబుపేట: ప్రభుత్వం పేద ప్రజల కోసం రూపాయికే కిలో రేషన్‌ బియ్యం పథకం ప్రవేశపెట్టింది. కాని ఈ నెల ప్రజలకు పురుగులు, మట్టితో నిండిన బియ్యం పంపిణీ చేశారు. దీంతో ప్రజలు ఆ బియ్యాన్ని తీనాలంటేనే జంకుతున్నారు.  వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల సరఫరా చేసినా బియ్యం పందికొక్కులు తినగా మిగిలిన బియ్యంగా ఉన్నాయి. ప్రభుత్వమే ఇలాంటి బియ్యం సరఫరా చేస్తుందా, లేక గోదాంలో ఏమైనా తారుమారు అవుతున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది.

గత రెండు రోజులుగా మండలంలోని 44 రేషన్‌ షాపుల్లో రేషన్‌ బియ్యాన్ని డీలర్లు విక్రయిస్తున్నారు. దాదాపు అన్ని షాపుల్లో విక్రయిస్తున్న రేషన్‌ బియ్యంలో నల్లటి పురుగులు, దుమ్ముధూళితో అధ్వానంగా ఉన్నాయి. బియ్యం ఇలా ఉన్నాయని పలువురు రేషన్‌ డీలర్లను ప్రశ్నించగా తమకు తెలియదని గోదాం నుంచి వచ్చిన బియ్యాన్నే తాము విక్రయిస్తున్నట్లు చెప్పారు. చేసేదేమీ లేక ప్రజలు అధ్వానంగా ఉన్న బియ్యాన్ని తీసుకెళ్లారు.  

అధికారుల దృష్టికి తీసుకెళ్తా

రేషన్‌ బియ్యంలో పూర్తిగా పురుగులు, దుమ్ముధూళి ఉండటంతో ఆ బియ్యాన్ని ప్రజలు తినలేని పరిస్థితి నెలకొంది. అధ్వానంగా ఉన్న బియ్యం సరఫరా చేస్తే తాము ఎలా తినాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ శ్రీనివాస్‌ను వివరణ కోరగా బియ్యంలో పురుగులు వచ్చాయని చాలా గ్రామాల నుంచి తమకు ఫిర్యాదులు వచ్చాయని, ఈ విషయాన్ని ఉన్నతాధికారులు, సివిల్‌సప్లయి అధికారులకు లేక రాస్తున్నట్లు ఆయన తెలిపారు.

మరిన్ని వార్తలు