పుకార్లతో ‘వాస్తవాల’ తయారీ

23 Apr, 2016 00:45 IST|Sakshi
ఉద్యానవనంలో మహమ్మద్ షా చిత్రం

జాతిహితం
 
రంగీలా నుంచి రాజీవ్ వరకూ, మన్మోహన్ నుంచి నేటి మోదీ వరకు ఢిల్లీ దర్బారు సంస్కృతి భారత అధికారిక నిర్మాణాలలో వ్యవస్థాపరమైన కొనసాగింపును కాపాడింది. నన్నడిగితే ఏ ప్రభుత్వమైనా ఆరు నెలలు అధికారంలో ఉండేసరికి ‘‘ఒక’’ ప్రభుత్వంగా మారిపోతుంది. గుసగుసలపై ఆధారపడి నడిచే రాజధాని నగరాల శక్తి అలాంటిది. కాకపోతే  ఆ గుసగుసలాడేవారు మారుతుంటారంతే. పుకార్లే సమాచారమైన చోట, కథలను మోసుకొచ్చే వారే చివరికి నిజమైన అధికారాన్ని నెరపుతారు, చరిత్రను సృష్టిస్తారు.
 
మొఘల్ చక్రవర్తి మహమ్మద్ షా రంగీలా కాలంలో ఢిల్లీ దర్బారులోని అత్యంత విలువైన నెమలి సింహాసనాన్ని, కోహినూర్ వజ్రాన్ని పర్షియాకు చెందిన దండయాత్రికుడు నాదిర్ షా కొల్లగొట్టుకుపోయాడు. మహమ్మద్ షా (1710-48) గురించి ఆలోచనాపరులైన చరిత్రకారులెవరైనాగానీ ఆయన కళలను, సంగీతాన్ని, పండితులను పోషించేవాడని చెబుతారు. నిత్యోల్లాస పురుషుడినంటూ తనకు తానే ‘సదా రంగీలా’ (ఎప్పటికీ ఉల్లాసంగా/సకల వర్ణశోభితంగా) అనే బిరుదును ధరించాడు. కానీ ఆయన ప్రతిష్ట మాత్రం సుఖలోలుడైన భ్రష్ట సోమరి చక్రవర్తిగానే పాత ఢిల్లీ గోడలపై చెక్కి కని పిస్తుంది. నాదిర్ షా ఢిల్లీ దిశగా దండెత్తి వస్తుండగా... ఆయన రాజధాని లోని హిజ్రాలనందరినీ పోగుచేసి నాదిర్‌తో పోరాటానికి పంపాడని  మౌఖిక గాథలు చెబుతాయి. అది నిజమేనా? అని ఆ కాలానికి చెందిన చరిత్రకారుడు విలియం డార్లింపుల్‌ను సంప్రదించాను.

ఈ కథనానికి ఎలాంటి చారిత్రక ఆధారమూ లేదని ఆయన తెలిపారు. పైగా ‘‘రంగీలా గురించి చెప్పేదాని కంటే కూడా అతడు రాజకీయంగా చాలా ఎక్కువగా విజయవంతమ య్యాడు’’ అని ఆయన అన్నారు. మహమ్మద్ షా వాస్తవానికి శక్తివంతులైన కమాండర్ల నేతృత్వంలో బలమైన సైన్యాన్ని నిర్మించాడు. నాదిర్ షాకు వ్యతిరేకంగా కర్నాల్ వద్ద ఆ సైన్యం యుద్ధం సాగించాయి. అయితే, చిత్తుగా ఓడిపోయాయి (దగ్గర్లోనే పానిపట్ పట్టణంలో ఉంది). కాకపోతే, తన తలతోపాటూ, తన ముఖ్య సేనా నాయకులందరి తలలను నరికి నాదిర్ షా పుర్రెల పర్వతాన్ని తయారు చేయనివ్వకుండా అతనికి లొంగిపోయాడు. చివరికి తన అమూల్య సంపదలన్నిటినీ కోల్పోయాడు. అలాంటి చెప్పు కోదగిన పాలకుడు ఆయన ఎన్నడూ యుద్ధానికి పంపని హిజ్రాల కారణం గానే గుర్తుండిపోయాడు. ఆ కథను పదేపదే చెప్పగా చెప్పగా చివరికి వాస్త వంగా మారిపోయింది. అస్తమించిన సామ్రాజ్యాల రాజధానులు పనిచేసే తీరు ఇదే. ఢిల్లీ అలాంటి వాటిలో అత్యంత పురాతనమైనది.

‘సంబంధాల’ కోసం వేట
వాషింగ్టన్ ఎలా పని చేస్తుందో చెబుతూ ‘న్యూయార్క్ టైమ్స్’ సీనియర్ పాత్రికేయుడు మార్క్ లీబోవిచ్ 2013లో ‘‘దిస్ టౌన్’’ను వెలువరించాడు. అధికార కేంద్రమైన ఆ నగరమూ, అందులోని అనుసంధానాల వ్యవస్థలు ఎలా పనిచేస్తాయనేదాన్ని ఆయన మొరటుగానూ సరదాగానూ, వాస్తవిక దృష్టితోనూ వర్ణించాడు. అమెరికన్లు ‘‘ఇన్‌సైడ్ ద బెల్ట్‌వే’’ అన్నా, మనం ‘‘ల్యూటియన్లు’’ అన్నా, మొఘలాయిలు ఢిల్లీ అన్నా ఒకటే... తెరవెనుక అధికార కేంద్రాల వ్యవహారాలే.

కెన్నడీ సెంటర్‌లో అత్యంత శక్తివంతుడైన ఒక వ్యక్తి అంత్యక్రియల గురించి చెప్పిన లీబోవిచ్ పుస్తకంలోని ఈ భాగం గుర్తుండిపోతుంది. ‘‘వాషింగ్టన్‌లో జరుగుతున్న అతి ముఖ్యమైన ఈ సాగ నంపే తంతు సంబంధాలను నెలకొల్పుకోవడానికి గొప్ప అవకాశాన్ని కలుగ జేస్తుంది’’ అంటూ ఆ చనిపోయిన ప్రత్యర్థులు, మిత్రులూ అంతా అలాంటి సమయంలో సంబంధాలను విస్తరింపజేసుకోవడం కోసం విపరీతంగా ప్రయాసపడతారు, సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకునే వ్యాపారం జోరుగా సాగు తుంది. అధికారం, లాభాల బేరసారాలకు పనికొచ్చే కరెన్సీగా సమాచారాన్ని వాడతారు.

ఆ తర్వాత ఆయన మీడియా-పరిశ్రమల సమ్మేళనం గురించి చెప్పుకొస్తాడు. వాషింగ్టన్ లేదా మరే ఇతర గొప్ప పురాతన నగరంలాగే ల్యూటియన్ ఢిల్లీలోనూ పుకార్లు, వదంతుల మీద ఆధారపడే దర్బారు సాగుతుంటుంది. కాకపోతే ఇక్కడ మీడియా-పరిశ్రమల సమ్మేళం మరింత ఆసక్తికరంగా ఉంటుందంటాను. నేను నీ వీపు గోకుతాను, నువ్వు నా వీపు గోకు... ఈలోగా ఇద్దరం ఒకరి గ్లాసు వైన్‌లో మరొకరం విషం కలుపుకుందాం అనే నీతిపై ఆధారపడే సాగుతుంది.

కథలను మోసేవారే  చక్రం తిప్పేది
నా స్నేహితురాలు తవ్లీన్‌సింగ్ తన ‘‘దర్బార్’’ పుస్తకంలో సరిగ్గా ఇదే విష యాన్ని చెప్పడానికి ప్రయత్నించారు. ఆ పుస్తకానికి ఆమె ఆ పేరు పెట్టడంలో ఆశ్చర్యం లేదు. ఇక తవ్లీన్ తాజా పుస్తకం ‘‘ద బ్రోకెన్ ట్రిస్ట్’’లో ఆమె తన వాదనను మరిన్ని వర్తమాన ‘‘కథనాల’’తో కొనసాగించారు. అవన్నీ మళ్లీమళ్లీ చెప్పగా చెప్పగా, కొంత కాలానికి వాస్తవంగా మారిపోతాయి. రంగీలా నుంచి రాజీవ్ వరకూ, మన్మోహన్ నుంచి నేటి మోదీ వరకు ఢిల్లీ దర్బారు సంస్కృతి భారత అధికారిక నిర్మాణాలలో వ్యవస్థాపరమైన కొన సాగింపును కాపాడింది.

నా దృష్టిలోనైతే ఏ ప్రభుత్వమైనాగానీ ఆరు నెలలు అధికారంలో ఉండేసరికి ‘‘ఒక’’ ప్రభుత్వంగా, ఏ పాలకుడైనా ‘‘ఒక’’ పాలకునిగా మారిపోతారు. గుసగుసలపై ఆధారపడి నడిచే రాజధాని నగరాల శక్తి అలాంటిది. కాకపోతే  ఆ గుసగుసలాడేవారు మారుతుంటారంతే. అయితే, గుసగుసలు, వదంతులు, పుకార్లు బాగా అమ్ముడుకాగల సరుకు. పాశ్చాత్య తరహా రోజువారీ దుస్తుల్లో వచ్చిన ప్రకాశ్ జవ్‌దేకర్‌ను మరింత సాధారణమైన దుస్తులు ధరించి రమ్మని ఎయిర్‌పోర్టుకు తిప్పి పంపేశారన్న గుసగుస గుర్తుకొచ్చిందా? లేదా, అయితే రాజ్‌నాథ్‌సింగ్ తన ‘‘కుమారునికి అవినీతి కార్యకలాపాలు కట్టిపెట్టేయమని చెప్పిన’’ విషయమైనా గుర్తుకొ చ్చిందా? మళ్లీమళ్లీ తిరిగి చెప్పగా అవి ‘‘వాస్తవాలు’’గా మారిపోలేదా? గుసగుసలకున్న మహత్తరమైన శక్తిని తెలుసుకోవాలంటే.. ఔరంగజేబు తర్వాతి కాలపు విజయవంతమైన మొఘల్ చక్రవర్తులంతా తాగుబోతులు, అవినీతిపరులైన మూర్ఖులుగా మారిపోయిన వైనాన్ని చూడండి. పుకార్లే సమాచారమైన చోట, కథలను మోసుకొచ్చే వారే చివరికి నిజమైన అధికా రాన్ని నెరపుతారు, చరిత్రను సృష్టిస్తారు.
 
‘‘అందుబాటు’’ అనే తన మౌలిక సాధనాన్నే అనుమానాస్పదంగా చూసే ఈ వాతావరణంలో ఒక రాజకీయ పాత్రికేయురాలు ఎలా పని చేయాలి? ఒక పద్ధతి మీరు మీ కలుగులోకి తిరోగమించి, అక్కడ జమకూడి ఉండే మీకు ఆమోదయోగ్యులు, మీ మిత్రులు, కుటుంబ సభ్యులు, మీ కుక్కలు, పిల్లులతో కలసి ఈ ప్రపంచం తీరును తిట్టిపోయడం. లేదా బయటకు వెళ్లి ఎదుర్కోవడం. మీరు పరిహసించే ఈ ప్రపంచంలో మీరు కూడా భాగం కాదా? అని తనను పదే పదే అడుగుతుంటారని లీబోవిచ్ అన్నారు. 

ఈ విషయంలో ఆయన తన తప్పును అంగీకరించారు. అయితే ఆయన దాన్ని ‘‘ఈ నీటిని ఎవరు కనిపెట్టారు? నాకు తెలియదు, అయినా అప్పుడు నేను చేపను కాను’’ అని, అటు పిమ్మట ‘‘నేనూ’’ ఒక చేపనే అని అంగీకరిస్తాడు. నేను దీన్ని కబడ్డీగా పోలుస్తాను.  ఢిల్లీ లేదా వాషింగ్టన్ డీసీ దర్బారు లోపలా, దాని చుట్టూ సాగే రాజకీయ జర్నలిజంలో మీరు కబడ్డీ ఆటలో లాగా అవతలి పక్షం కోర్టులోకి వెళ్లి, వారిని వేధించి, ఎవరో ఒకర్ని అంటుకుని, పాయింట్లు సంపాదించి పట్టుబడకుండా తిరిగిరావాలి. ఇదంతా మీరు ఊపిరి బిగబట్టే చేయాల్సి ఉంటుంది. అది తేలికేమీ కాదు, అలా అని అసాధ్యమూ కాదు, సరదా అయినది కూడా.
 
ఇప్పటి కొత్త పరిస్థితిలో లీబోవిచ్ చేప కావడం అనైతికం  అవుతుంది. మీరు అత్యంత వివేకవంతమైన మీ ఎలుక కలుగులోకి దూరి దాక్కోవడమే చేస్తారు. విభజన రేఖను దాటి, చెడ్డ వ్యక్తిని తాకి, చెక్కుచెదరకుండా తిరిగి రావాలని విశ్వసించడం ఇప్పుడు ఫ్యాషనేమీ కాదు. రెండేళ్ల క్రితం, యువ పాత్రికేయుడు... మీరు రాజ్యసభ సీటు కోసం ప్రయత్నిస్తున్నారు కదా, మీకు సహాయం చేస్తున్నవారు ఎవరు? అని అడిగాడు. చురుగ్గా, విజయవంతంగా పనిచేస్తున్న ఒక పాత్రికేయుడు రాజ్యసభకు ఎందుకు వెళ్లాలి? అందుకేమీ ఇంతకంటే ఎక్కువ వేతనమూ రాదు, అతని అభిప్రాయాలను వెలిబుచ్చ డానికి ఇంతకంటే విశాలమైన వేదికనూ అది కల్పించదనేది నా వాదన. ఒక ప్రపంచ సుప్రసిద్ధ కళాశాల డిగ్రీని అందుకున్న రిపోర్టర్ సైతం ఒక పాత్రికే యుని జీవితంలోకెల్లా మకుటాయమానమైనది. రాజ్యసభకు నామినేషన్ పొందడమేనని భావించడం నాకు చికాకు కలిగించింది.
 
చేయని యుద్ధానికి శౌర్య పతకం
ఈ వారం మొద ట్లో తవ్లీన్ ‘‘ట్రిస్ట్’’ ఆవిష్కరణకు వెళ్లినప్పుడు.. ఒకరు నన్ను పట్టుకుని ‘‘అంటే మీరు తవ్లీన్ కాలమ్‌ను ఆపాలని సోనియా మీ మీద ఒత్తిడి తెచ్చారన్న మాట (అప్పట్లో నేను ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు సంపాద కుణ్ణి).. సుబన్ దుబే కూడా మిమ్మల్ని బెదిరించాడే... అయితే మీరేమీ లొంగలేదు, చివరకు రాజీనామా చేసేశారనుకోండి... వగైరా, వగైరా.’’ ఇదంతా ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది? నేను ఇంటికి వెళ్లి తవ్లీన్ పుస్తకంలోని ఇండెక్స్‌ను చూస్తే తొమ్మిది పేజీలలో నా పేరు ఉంది. అయితే ఆ సందర్భాలన్నీ, చాలా వరకు మన్ననా పూర్వకమైనవే. వాటిలో సోనియా, మా మాజీ సంపాదకుడు సుమన్ దుబేలు నాపై ఆమె కాలమ్‌ను ఆపేయాలని ఒత్తిడి తేవడం, నేను వాటిని తిప్పికొట్టడం కూడా ఉంది. కాకపోతే లేనిది ఒక్కటే... అసలు అలాంటిది ఏమీ జరగలేదనేదే. అయితే నేను తవ్లీన్‌తోనూ, ఇతరులతోనూ కూడా ఒక విషయం చెప్పాను.

సోనియా నివాసానికి క్రమం తప్పకుండా వెళ్లి వచ్చేవారంతా ఆమె కాలమ్ కాల్పినికమైనదిగా, పునరావృతంగా, ఉంటుం దని వ్యాఖ్యానించేవారు. ఆమె రెచ్చగొట్టే విధంగా రాస్తారు, ప్రభుత్వ వ్యతి రేక(గాంధీ కుటుంబానికి)మైన, విశ్వసనీయమైన పాఠకులు ఆమెకు పెద్ద సంఖ్యలో ఉన్నారు. నా పట్ల సానుభూతిని చూపిన దుబాసీకి వీటిలో ఏదీ లేదు. అతను ‘‘మీది నిజమైన సాహసోపేత జర్నలిజం సార్’’ అన్నాడు.
 
అసలెన్నడూ యుద్ధం చేయకుండానే మీకు శౌర్య పతకాన్ని ప్రదానం చేస్తుంటే ఎలా ఉంటుందో నాకూ అలాగే అనిపించింది. ఇంతకూ నేను తవ్లీన్‌కు థాంక్స్ చెప్పాలో, నో థాంక్స్ చెప్పాలో తేల్చుకోవాల్సి ఉంది.  లేదా నేనెన్నడూ చేయని ఆ యుద్ధ చరిత్రను మొత్తంగా కనిపెట్టి తీరాలి. అది మహ్మద్ షా రంగీలా కాలంలో అయితే సులువుగా అయ్యేది.

వ్యాసకర్త: శేఖర్ గుప్తా
twitter@shekargupta

మరిన్ని వార్తలు