నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు: బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌

25 Nov, 2020 11:58 IST|Sakshi

తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన జాన్‌ కుమార్‌  సాను

న్యూ ఢిల్లీ: ప్రముఖ గాయకుడు కుమార్‌ సాను కొడుకు జాన్‌ కుమార్‌ సాను ఈ వారం బిగ్‌బాస్‌ 14 నుంచి ఎలిమినేట్‌ అయ్యాడు. ఈ సందర్భంగా జాన్‌ మాట్లాడుతూ.. ‘నాన్న మమ్మల్ని పట్టించుకోలేదు. అమ్మ ఒంటి చేత్తో మమ్మల్ని పెంచి పెద్ద చేసింది’ అని తెలిపాడు. ఈ వ్యాఖ్యలపై కుమార్‌ సాను స్పందించాడు. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కుమార్‌ సాను మాట్లాడుతూ.. ‘జాన్‌ నా గురించి చేసిన వ్యాఖ్యలు నన్ను ఎంతో బాధపెట్టాయి. నేను నా మొదటి భార్య, జాన్‌ తల్లి రీటా భట్టాచార్య నుంచి విడాకులు తీసుకున్నాను. ఆ సమయంలో రీటా జీ అడిగిన వాటిని నేను ఆమెకు ఇచ్చాను. వాటిల్లో నేను మొదటి సారి కొనుకున్న బంగ్లా కూడా ఉంది. నేను వారికి ఏం ఇవ్వలేదనడం పూర్తిగా అబద్దం’ అన్నారు . (బిగ్‌బాస్‌: ఈ షోకు నువ్వు అన‌ర్హురాలివి)

కుమార్‌ సాను మాట్లాడుతూ.. ‘విడాకుల సమయానికి నా ముగ్గురు పిల్లలు చిన్న వారు కాబట్లి వారు తల్లి దగ్గరే ఉండాలని కోర్టు తీర్పునిచ్చింది. ఒంటరిగా వారిని పెంచినందుకు రీటాజీని ప్రశంసిస్తున్నాను. విడాకుల అనంతరం కూడా నేను పిల్లల్ని కలిసేవాడిని. అయితే నిబంధనల వల్ల ఎక్కువ సమయం వారితో గడపలేకపోయాను. రీటాతో విడాకుల అనంతరం నేను మరో పెళ్లి చేసుకున్నాను. ఇండియా నుంచి వెళ్లిపోయాను. ఎందుకంటే అప్పుడు ఇక్కడ ముంబైలో నాకు ఎక్కువ పని దొరికేది కాదు. కానీ, ఇండియాకి వస్తే జెస్సీ, జీకో, జానూలను కలిసేవాడిని.. వారితో కలిసి డిన్నర్‌కు వెళ్లేవాడిని. ఇక ఎదుగుతున్న కొద్ది వారు కూడా బిజీ అయ్యారు. కలవడం తగ్గిపోయింది. కానీ నాతో అవసరం ఉంది అని చెప్తే.. ఒకవేళ అప్పుడు నేను ముంబైలో ఉంటే తప్పక వారిని కలిసేవాడిని. అయితే ఎక్కువగా ఫోన్‌లో మట్లాడుకునే వాళ్లం’ అని తెలిపారు కుమార్‌ సాను. ఇక వృత్తిరీత్యా ప్రపంచం అంతా తిరుగుతుండటంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోయానన్నారు ఆయన. రెండో భార్య సలోని, ఇద్దరు కుమార్తెలతో కూడా తాను ఎక్కువ సమయం గడపలేకపోయానని తెలిపారు.

మరిన్ని వార్తలు