ఆపరేషన్‌ చేసి.. తాబేలుకు ప్రాణం పోశారు

26 Mar, 2023 02:14 IST|Sakshi

అనకాపల్లి: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాబేలుకు ఆపరేషన్‌ చేసి ఓ వైద్యాధికారి జీవం పోశారు. స్థానిక యువకులు సకాలంలో స్పందించడంతో ఒక మూగ జీవి ప్రాణం నిలబడింది. వివరాలు.. వడ్డాది పెద్దేరు నదిలో తాబేళ్లు సంచరిస్తూ ఉంటాయి. శనివారం తాబేలు ఒకటి గుడ్లు పెట్టడానికి ఒడ్డుకు వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు దానిపై దాడి చేశాయి.

తీవ్రంగా గాయపడ్డ తాబేలు పేగులు బయటకు వచ్చేయడంతో విలవిల్లాడింది. ఈ విషయం గమనించిన స్ధానిక యువకులు దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ పశువైద్యాధికారి శివకుమార్‌కు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన వైద్యుడు తాబేలును ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించారు. ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలైన మూగజీవికి ఆపరేషన్‌ చేసి ఆదుకున్నందుకు వైద్యు డు శివకుమార్‌ను స్థానికులు అభినందించారు. 

మరిన్ని వార్తలు