ఉద్యోగం పోయిందనే బాధతో.. 4 వేల అడుగుల ఎత్తు నుంచి దూకి!

13 Dec, 2023 07:26 IST|Sakshi
రాణిజరి జలపాతం పాయింట్‌.. ఇక్కడి నుంచే దూకింది. టెక్కీ భరత్‌ (ఫైల్‌)

బెంగళూరు టెక్కీ మిస్సింగ్‌ కేసు విషాదాంతం

యశవంతపుర: మిస్సింగ్‌ అయిన నగర టెక్కీ కథ విషాదంతామైంది. చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా రాణిజరి జలపాతం వద్ద బెంగళూరు టెక్కీ భరత్‌ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. కొండ నుంచి నాలుగు వేల అడుగుల దిగువన మృతదేహాన్ని గుర్తించి అతికష్టంపై తాళ్ల సాయంతో వెలికితీశారు. ఆపై 14 కిలోమీటర్లు దూరం దట్టమైన అడవులు, లోయలను కాలినడకన దాటుకుంటూ తరలించారు.

ఉద్యోగం పోయిందనే బాధతో..
ఈ నెల 6న భరత్‌ చిక్కమగళూరు రాణిజరి జలపాతం వద్దకు వెళ్లి మొబైల్‌ఫోన్‌, బైక్‌, ఐడీ కార్డు, బట్టలను గుట్టపై విడిచి కనిపించకుండాపోయాడు. బెంగళూరులో టెక్కీగా పనిచేసే భరత్‌.. కంపెనీ ఉద్యోగం నుంచి తీసేయడంతో విరక్తి చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడు. మూడు రోజులైనా జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు చిక్కమగళూరుకు చేరుకొని బణకల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు మొబైల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా రాణిజరి వద్ద ఉన్నట్లు గుర్తించి గాలింపు చేపట్టారు. 25 మంది పోలీసు సిబ్బంది గాలింపులో పాల్గొన్నారు. అంత పై నుంచి భరత్‌ దూకడంతో మృతదేహం ఛిద్రమై, ఈ వారంరోజుల్లో కుళ్లిపోయింది. కుమారుడు ఇక లేడని తెలిసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.

ముఖ్య గమని​క:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com

ఇదిచదవండి:ల్యాబ్‌ టెక్నీషియన్‌ క్రూరత్వం?

>
మరిన్ని వార్తలు