ల్యాబ్‌ టెక్నీషియన్‌ క్రూరత్వం?

13 Dec, 2023 06:45 IST|Sakshi
భర్త దర్శన్‌తో శ్వేత (ఫైల్‌)

విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి భార్య హత్య!

యశవంతపుర: అత్తింటిలో వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన చిక్కమగళూరు జిల్లా మూడిగెరె తాలూకా దేవవృందంలో జరిగింది. వివరాలు... మూడేళ్ల క్రితం శ్వేత (31), దర్శన్‌ వివాహం జరిగింది. బాగా కట్నకానుకలు ఇచ్చారు. దర్శన్‌ బెంగళూరులో ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులేవు.

నాలుగు రోజుల క్రితం ఇద్దరు బెంగళూరు నుంచి దేవవృందంకు చేరుకున్నారు. సోమవారం రాత్రి శ్వేత అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శ్వేతకు గుండెపోటు వచ్చి చనిపోయిందని దర్శన్‌ అత్తమామలకు సమాచారం ఇచ్చాడు. అత్తమామలు వచ్చేలోపు దర్శన్‌ కుటుంబం శ్వేతకు అంత్యక్రియలకు సిద్ధం చేశారు.

అంత్యక్రియలను అడ్డుకున్న బంధువులు
అంత్యక్రియలు ఎందుకు అంత త్వరగా ముగించాలని చూస్తున్నారని మృతురాలి బంధువులు ప్రశ్నించటంతో దర్శన్‌ కుటుంబంలో భయం నెలకొంది. దీంతో మృతురాలి తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. ఆమెకు విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించాలని పట్టుబట్టి ఆస్పత్రికి తరలించారు. దర్శన్‌ అక్రమ సంబంధం మోజులో పడి శ్వేతను అడ్డు తొలగించటానికి ఇంజక్షన్‌ ఇచ్చి హత్య చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు శ్వేత మృతదేహాన్ని చిక్కమగళూరు మల్లేగౌడ జిల్లా ఆస్పత్రికి తరలించారు. గోణిబీడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు