అమలాపురం ఘటన.. కేసుల ఉపసంహరణపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

28 Mar, 2023 22:26 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: అమలాపురం ఘటనలతో ఏర్పడిన సామాజిక విభేదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వివిధ సామాజిక వర్గాలు మధ్య శాంతి, సామరస్యపూర్వక వాతావరణాన్ని బలపరిచే దిశగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవ చూపారు. క్యాంపు కార్యాలయంలో కోనసీమ నేతలు, సామాజికవర్గాల నాయకులతో సీఎం మంగళవారం సమావేశమయ్యారు. అమలాపురం ఘటనలో నమోదైన కేసులు ఉపసంహరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలిపారు. సీఎం జగన్ నిర్ణయంపై కోనసీమ నాయకులు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఏమన్నారంటే..
► తరతరాలుగా మీరంతా అదే ప్రాంతంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు
► అక్కడే పుట్టి.. అక్కడే పెరిగి… జీవిత చరమాంకం వరకూ అక్కడే ఉంటున్నారు
► రేపు అయినా.. అక్కడే పుట్టాలి.. అక్కడే పెరగాలి.. అక్కడే జీవితాల్ని ముగించాలి
► అందుకే భావోద్వేగాల మధ్య కొన్ని ఘటనలు జరిగినప్పుడు… వాటిని మరిచిపోయి… మునుపటిలా కలిసిమెలిసి జీవించాలి. లేకపోతే భవిష్యత్తు దెబ్బతింటుంది
► దీన్ని ఇలా లాగుతూ పోతే.. మనుషుల మధ్య దూరం పెరుగుతుంది
► దీనివల్ల నష్టపోయేది మనమే… అందుకే అందరం కలిసి ఉండాలి, ఆప్యాయతతో మెలగాలి


► చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు, అపోహలు ఉన్నా పక్కనపెట్టి ఆప్యాయంగా మాట్లాడుకుందాం,
తప్పులు భూతద్దంలో చూసుకోకుండా ఒకరికొకరు కలిసిపోదాం
► అందరం కలిసికట్టుగా ఒక్కటవుదాం, మిమల్ని ఒకటి చేయడం కోసం ఈ ప్రయత్నమంతా చేస్తున్నాం
► అందరికీ పార్టీలు చూడకుండా శాచురేషన్‌ బేసిస్‌ మీద పథకాలు అన్నీ ఇస్తున్నాం
► వలంటీర్‌లకు తోడుగా గృహ సారథులు కూడా ఉంటారు.. వ్యవస్ధలో పారదర్శకంగా ఉండాలనే ఈ నిర్ణయం
► అర్హత ఉన్న వారికి ఏ పథకమైనా అందని పరిస్థితి ఉండకూడదనేది మన విధానం
► కులం చూడకుండా, మతం చూడకుండా ఎవరికి అర్హత ఉంటే వారికి అన్నీ ఇస్తున్నాం. 
► పార్టీలు చూడకుండా జరగాల్సిన మంచి చేస్తున్నాం. 
► రూ. 2 లక్షల కోట్ల డీబీటీ దేశ చరిత్రలో ఎన్నడూ చూడలేదు. రూపాయి లంచం లేకుండా ఈ స్ధాయిలో ఎప్పుడూ జరగలేదు
► టీడీపీ హాయంలో నా పాదయాత్రలో లోన్‌ ల గురించి ప్రస్తావన వచ్చింది. అప్పుడు లోన్‌ ల కోసం లంచం ఇవ్వాల్సిన పరిస్ధితి. అవికూడా అక్కడక్కడా అరకొర అందేవి
► ఇప్పుడు ప్రతి ఇంటికీ సంక్షేమాన్ని అందిస్తున్నాం. లంచాలు లేని ఇంత మంచి వ్యవస్ధను తీసుకొచ్చాం
► మంచి చేసే విషయంలో ఏం చూడకుండా చేస్తున్నాం. ఇలాంటి వ్యవస్థ ఉంటేనే సమాజానికి మంచి జరుగుతుంది
► ఏ కారణం చేతనైనా ఎవరైనా మిస్‌ అయితే వారిని చేయి పట్టుకుని నడిపించడానికి కార్పొరేషన్లు కూడా ఏర్పాటుచేశాం
► ఇది మంచి పరిణామం, దేవుడి దయ వల్ల ఈ నిర్ణయం తీసుకున్నాం
► మీరంతా మనస్ఫూర్తిగా ముందుకు వచ్చారు. మంచి వాతావరణం ఉండాలని మనసారా కోరుకుంటున్నాను.

మరిన్ని వార్తలు