ప్రభుత్వ బడికి ఫ్యూచర్‌ స్కిల్స్‌

19 Dec, 2023 05:18 IST|Sakshi

హైస్కూళ్లలో బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌

వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష ద్వారా ఎంపిక

నెలకు రూ.12 వేల స్టైఫండ్‌ ఇచ్చేందుకు ప్రతిపాదన

పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులకు ఆధునిక సాంకేతికత వినియోగంపై శిక్షణ

జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల్లో ఓవైపు నైపుణ్యాభివృద్ధిని పెంపొందిసూ్తనే.. మరోవైపు వారిని ‘ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌’గా వినియోగించుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, బీఎస్సీ కంప్యూటర్‌ సైన్స్‌ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు అవకాశం ఇవ్వ­నున్నారు.

వీరికి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్న్‌­షిప్‌కు అవకాశం కల్పిస్తూ నెలకు రూ.12 వేల స్టైఫండ్‌ ఇవ్వాలని అధికారులు తాత్కాలికంగా ప్రతి­పాదించారు. ఆయా కోర్సులు అభ్యసిస్తున్నవారితో హైస్కూళ్ల విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఆధునిక సాంకేతిక వినియోగంపై శిక్షణ అందించనున్నారు. ఈ మేరకు ఏడాది పొడవునా ప్రభుత్వ పాఠశాలల్లో ‘ఫ్యూచర్‌ స్కిల్‌ ఎక్స్‌పర్ట్స్‌’ సేవలు అందేలా పాఠశాల విద్యాశాఖతో కలిసి ఉన్నత విద్యా మండలి సంయుక్త కార్యాచరణ సిద్ధం చేస్తోంది.

ముఖ్యంగా కంప్యూటర్‌ సైన్స్‌ విద్యార్థులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఆ తర్వాత అవసరాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ (ఈసీఈ), మెకానికల్‌ బ్రాంచ్‌ విద్యార్థులను పరిశీలిస్తారు. ఇంటర్న్‌షిప్‌కు వచ్చే దరఖాస్తులను బట్టి రాత పరీక్ష నిర్వహించి ఎంపిక చేయాలని ఉన్నత విద్యా మండలి భావిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను జనవరి నుంచి అమలు చేసేలా కసరత్తు చేస్తోంది.

వర్చువల్‌ విధానంలో మరో ఇంటర్న్‌షిప్‌..
రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ హైస్కూల్‌ను సమీపంలోని ఇంజనీరింగ్‌ కళాశాలతో జత చేయనున్నారు. ఇప్పటికే కళాశాలల మ్యాపింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది. హైస్కూల్‌లో ఇంటర్న్‌గా చేసూ్తనే వర్చువల్‌ విధానంలో కూడా మరో ఇంటర్న్‌షిప్‌ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నారు. భవిష్యత్తులో బోధన రంగంలో రాణించాలనుకునే వారికి, జాబ్‌ మార్కెట్‌ ఓరియెంటెడ్‌ కోర్సులు నేర్చుకోవాలనుకునే వారికి రెండు విధాల ఇంటర్న్‌షిప్‌ ఉపయోగపడనుంది. వాస్తవానికి విద్యార్థి దశలోనే ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాన్ని సాధించడానికి ప్రభుత్వం ఉన్నత విద్యలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ప్రతి విద్యార్థి తమ కోర్సు చివరి ఏడాదిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇప్పటికే ఏటీఎల్‌ మెంటార్‌షిప్‌..
‘ఉన్నత విద్యలో కమ్యూనిటీ సర్వీస్‌’ ప్రాజెక్టు కింద ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇప్పటికే హైస్కూల్‌ బాటపడుతున్నారు. రెండు నెలల ఈ ప్రాజెక్టులో భాగంగా హైస్కూళ్లలో ‘అటల్‌ టింకరింగ్‌ ల్యాబ్‌్స (ఏటీఎల్‌)’కు మెంటార్‌షిప్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలోనే 577 
హైస్కూళ్లలో ఏటీఎల్స్‌ను ఏర్పాటు చేసింది.

కానీ, గత టీడీపీ ప్రభుత్వం వాటిని నిరుపయోగంగా వదిలేసింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ‘ఏటీఎల్‌’ అవసరాన్ని గుర్తించి వినియోగంలోకి తెచ్చింది. ఇందులో భాగంగానే ఆయా హైస్కూళ్లను ఇంజనీరింగ్‌ కాలేజీలతో మ్యాపింగ్‌ చేస్తోంది. వివిధ బ్రాంచ్‌ల విద్యార్థుల సహాయంతో ‘ఏటీఎల్‌’కు జీవం పోస్తోంది. ఐక్యరాజ్యసవిుతికి చెందిన యునిసెఫ్‌తో కలిసి పనిచేస్తున్న పూణే సంస్థ.. విజ్ఞాన్‌ ఆశ్రమ్‌కు చెందిన ­సోర్స్‌ పర్సన్స్‌తో ఎంపిక చేసిన ఇంజనీరింగ్‌ విద్యార్థులకు శిక్షణ ఇచ్చి మరీ ఏటీఎల్‌ ద్వారా పాఠశాల విద్యార్థులను నూతన ఆవిష్కరణల వైపు నడిపిస్తోంది. 

ఈ కోర్సుల్లోనే శిక్షణ..
ఫ్యూచర్‌ స్కిల్‌ ప్రోగ్రామ్‌లో భాగంగా వి­ద్యా­ర్థులకు ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింకింగ్స్‌ (ఐ­వో­టీ), ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషీన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, వర్చువల్‌ రియాలిటీ (వీఆర్‌), ఆగ్మెంటెడ్‌ రియాలిటీ (ఏఆర్‌), మెటావర్స్‌/వెబ్‌ 3.0, 3డీ మోడలింగ్‌ అండ్‌ ప్రింటింగ్, క్లౌడ్‌ కంప్యూటింగ్, సైబర్‌ సెక్యూరిటీ, బిగ్‌ డేటా/డేటా ఎనలిస్ట్, రోబోటిక్స్‌లో బేసిక్స్‌ బోధించనున్నారు.

ఇందులో భాగంగానే ప్రత్యేక పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్‌)ను సైతం రూపొందిస్తున్నారు. దీని ద్వా­­రా ఇంజనీరింగ్‌ విద్యార్థుల సహాయంతో బేసిక్స్‌ నేర్పిసూ్తనే.. పాఠశాల ఉపాధ్యాయులకు డిజిటల్‌ పరికరాలపై విద్యా బో­ధన, హైçస్యూల్‌ విద్యార్థులకు ట్యాబ్స్‌ విని­యోగంపై శిక్షణ ఇవ్వనున్నారు. అలాగే కొ­త్త కంటెంట్‌ ఇన్‌స్టాల్‌ చేసి అందించనున్నారు. 

చదువుతో పాటే సంపాదన
దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర విద్యార్థులు చదువుతో పాటే సంపాదించనున్నారు. ప్రభుత్వ హైస్కూళ్లలో స్టైఫండ్‌తో కూడిన ఇంటర్న్‌షిప్‌ ఓ గొప్ప మార్పునకు నాంది. అందుబాటులోని మానవ వనరుల సమర్థవంత వినియోగానికి ఇదొక ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యావ్యవస్థలో చేపట్టిన విప్లవాత్మక మార్పులతోనే ప్రభుత్వ బడుల్లో డిజిటల్‌ లిటరసీ పెరుగుతోంది.

పేదింటి విద్యార్థులు స్మార్ట్‌ ప్యానల్స్‌­పై పాఠాలు వింటున్నారు. ట్యాబ్‌ల్లో పాఠాలు చదువుతున్నారు. వీటి ద్వారా మ­రింత నాణ్యమైన సాంకేతిక పాఠాలను నేర్పించేందుకు ఇంజనీరింగ్‌ విద్యార్థులను హైస్కూళ్లలో ఇంటర్న్‌షిప్‌నకు ఆహ్వానిస్తున్నాం. తద్వారా పాఠశాలల్లోని కంప్యూటర్‌ ల్యాబ్స్, ఏటీఎల్స్‌ పూర్తిస్థాయిలో పనిచేస్తాయి.  – ఆచార్య హేమచంద్రారెడ్డి, చైర్మన్, ఉన్నత విద్యా మండలి 

>
మరిన్ని వార్తలు