శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్‌

29 May, 2022 16:31 IST|Sakshi

సాక్షి, తిరుపతి: శ్రీకాళహస్తి ఫిన్‌కేర్‌ బ్యాంక్ చోరీ కేసులో భారీ ట్విస్ట్‌ చోటుచేసుకుంది. దోపిడీపై పిర్యాదు ఇచ్చిన బ్యాంక్ మేనేజర్ స్రవంతినే అసలు దొంగగా పోలీసులు నిర్ధారించారు.  కేసుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ముందు నుంచే ఇంటి దొంగల ప్రాతపై అనుమానం కలిగింది.  స్రవంతి బ్యాంకులో గిల్టు నగలు తాకట్టు పెట్టి డబ్బు కాజేసినట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆడిట్‌లో వ్యవహారం బయటపడుతందని దొంగతనం డ్రామా ఆడినట్లు తేల్చారు. ఇందుకు చెన్నైకి చెందిన ముగ్గురు యువకులతో కాంట్రాక్టు కుదుర్చుకొని బ్యాంకు దోపిడికి  ప్లాన్‌ వేసినట్లు తెలిపారు. 

స్రవంతి ప్లాన్‌ ప్రకారం దుండగులు బ్యాంక్‌ లాకర్‌ నుంచి 67 ప్యాకెట్లలోని దాదాపు రెండు కేజీల బంగారం, 5 క్షల రుపాలయు నగదు ఎత్తుకెళ్లారు. తన చేతులు కట్టేసి అరవకుండా నోటిలో గుడ్డనొక్కి కత్తితో బెదిరించి చోరీ చేశారని స్రవంతి పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది. అయితే ముందు నుంచే స్రవంతిపై అనుమానపడ్డ పోలీసులు ఆమె నుంచే అసలు నిజాన్ని రాబట్టారు. బ్యాంకులో దొంగలు పడి దోచుకెళ్లారని ఖాతాదారులను, పోలీసులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయింది.

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడేందుకు స్రవంతి బ్యాంక్‌కు కన్నం వేసినట్లు పోలీసులు తెలిపారు. స్రవంతి నుంచి దోపిడి సొత్తు రికవరీ చేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కాగా స్రవంతి గత నాలుగేళ్లుగా ఫిన్‌కేర్‌ బ్యాంక్‌లో బ్రాంచ్‌ మేనేజర్‌గా అప్రైజర్‌గా కొనసాగుతోంది. సోమవారం స్రవంతితో పాటు చోరీకి పాల్పడ్డ దుండగులను అరెస్టు చేసి మీడియా ముందు హాజరుపరచనున్నారు.
చదవండి: ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి..

మరిన్ని వార్తలు