కుల గణనపై సీఎం జగన్‌ సంకల్పానికి సలాం 

23 Nov, 2023 05:49 IST|Sakshi

కులగణన ఒక చరిత్రాత్మక కార్యక్రమం 

వందేళ్ల కలను సాకారం చేస్తున్న నాయకుడు సీఎం జగన్‌ 

బడుగు, బలహీనవర్గాలకు ఆయనే బలం, బలగం 

అందుకే అందరి మద్దతు ఆయనకే  

బీసీల వ్యతిరేకి చంద్రబాబు 

బీసీల తోక కత్తిరిస్తానన్నాడు..మత్స్యకారుల తోలు తీస్తానన్నాడు 

కులగణనపై టీడీపీ విమర్శల్లో అర్థం లేదు 

రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య  

సాక్షి, అమరావతి: ‘కుల గణన’ ఒక చరిత్రాత్మక కార్యక్రమమని, ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని ఎంతో ధైర్యంగా చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పానికి ఎవరైనా సలాం చెప్పక తప్పదని రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య చెప్పారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ రంగాల్లో పేదవర్గాలకు  మేలు కలిగించడంలో కులగణన కీలకమని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఇది ఆదర్శవంతమైన కార్యక్రమమని అన్నారు. ఆయన బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. బీసీలు సీఎంలుగా ఉన్న రాష్ట్రాల్లోనూ కులాల లెక్కలు తీసేందుకు సాహసం చేయలేదన్నారు. ప్రధాని మోదీ బీసీ వర్గానికే చెందినా బీసీ లెక్కలు తీయించే ఆలోచన చేయలేదని అన్నారు. ఆ ధైర్యం ఒక్క సీఎం జగన్కే ఉందన్నారు.

కులాల లెక్కలు తీసి, బలహీన వర్గాలకు విద్య, వైద్యంతో పాటు అన్ని రకాలుగా మెరుగైన సంక్షేమం అందించేందుకు శ్రీకారం చుట్టారని తెలిపారు. జనాభా దామాషా ప్రకారం ఆయా కులాల వారికి అవకాశాలు దక్కేందుకు సీఎం జగన్‌  బాటలు వేస్తున్నారు. 100 ఏళ్ల తర్వాత ఇక్కడ జరుగుతున్న కులగణన బీసీలకే కాకుండా మిగతా కులాల వారికీ మేలు చేస్తుందని తెలిపారు. అందుకే రాష్ట్రంలోని బీసీ సంఘాలు, ఇతర ఉప కుల సంఘాల వారంతా సీఎం జగన్‌ ఔన్నత్యాన్ని కొనియాడుతున్నారని, ఆయనకు  కృతజ్ఞతలు చెబుతున్నారని చెప్పారు. బడుగు, బలహీనవర్గాలకు సీఎం జగనే బలం, బలగం అని తెలిపారు.

 అందుకే రాష్ట్రవ్యాప్తంగా అందరూ సీఎం జగన్‌కు మద్దతుగా నిలుస్తున్నారని చెప్పారు. కుల గణన గిట్టని కొందరు విపక్ష నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, టీడీపీ నేతల మాయమాటల్ని, అసత్య ప్రచారాలను ఎవరూ నమ్మే పరిస్థితిలో లేరని తెలిపారు. చంద్రబాబు బీసీల వ్యతిరేకి అని ధ్వజమెత్తారు. బీసీల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ.. మంత్రివర్గంలో ఆ వర్గాలకు  బొటా»ొటీ పదవులిచ్చేదన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యసభ సభ్యుల్లో అసలు బీసీలే లేరని చెప్పారు. జడ్జిలుగా బీసీలు పనికి రారని కేంద్రానికి లేఖ రాసిన ఘనుడు చంద్రబాబని అన్నారు. బీసీల తోకలు కత్తిరిస్తానని, మత్స్యకారుల తోలు తీస్తానని అహంకారంతో హుంకరించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. 

సామాజిక సాధికార యాత్రలకు విశేష స్పందన 
పేద కుటుంబాలు సొంత ఇంట్లో ఉండాలని సీఎం జగన్‌ 32 లక్షల ఇళ్ళ స్థలాలు ఇస్తే, అందులో మెజార్టీ బీసీలకే వచ్చాయని తెలిపారు. పదవులు, ఉద్యోగాల్లో 83 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ యువతకే ఇచ్చారని చెప్పారు. వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా 2.30 లక్షల ఉద్యోగాలివ్వగా, అందులో 80శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలవారేనన్నారు.

బీసీలకు శాశ్వత కమిషన్‌ ఏర్పాటు చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు నామినేటెడ్‌ పదవుల్లో 50 శాతం రిజర్వేషన్, 139 బీసీ కులాలను గుర్తించి 56 బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారన్నారు. అందుకే సీఎం జగన్‌ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీ్టల పక్షపాతి అని స్పష్టంగా చెప్పగలుగుతున్నామని తెలిపారు. అందువల్లే సీఎం జగన్‌ ఈ వర్గాలకు చేసిన మేలును వివరిస్తూ చేస్తున్న సామాజిక సాధికార యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని వివరించారు.  

మరిన్ని వార్తలు