సంధ్య ఆక్వా డ్రగ్స్‌ కేసు: సీబీఐ మరో కీలక నిర్ణయం

25 Mar, 2024 11:26 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: విశాఖ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సీబీఐ నోటీసులు పంపించింది. 

వివరాల ప్రకారం.. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్‌ కేసుపై సీబీఐ విచారణను వేగవంతం చేసింది. కేసు విచారణలో భాగంగా సీబీఐ తాజాగా సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది. కంపెనీకి సంబంధించి పూర్తి స్థాయిలో డేటా కావాలని నోటీసుల్లో సీబీఐ పేర్కొంది. 

ఇదే సమయంలో ఏపీలో పలువురు ఆ‍క్వా బిజినెస్‌ ప్రతినిధులను కూడా సీబీఐ అధికారులు ప్రశ్నించనున్నారు. పెద్ద మొత్తంలో ఈస్ట్‌ ఆర్డర్‌ చేసుకోవడంలో ఆంతర్యమేంటనే దానిపై ప్రశ్నలు సంధించనున్నట్టు సమాచారం. మరోవైపు.. సీబీఐ అడిగిన ప్రశ్నలకు సంధ్య ఆక్వా ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 

‘సంధ్యా’ యాజమాన్యంపై ప్రశ్నల వర్షం 
తమ సంస్థ తీసుకొచ్చిన డ్రైఈస్ట్‌లో డ్రగ్స్‌ ఎలా వచ్చాయో తమకు తెలియదని సంధ్యా ఆక్వా సంస్థ చెబుతోంది. ఈ వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సీబీఐ విచారణ వేగవంతం చేసింది. ఇటీవల మరికొన్ని బ్యాగు­ల్ని పరీక్షించగా.. 70 శాతం డ్రైఈస్ట్‌ బ్యాగుల్లో డ్రగ్స్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో.. సంధ్యా ఆక్వా యాజమాన్యాన్ని సీబీఐ విచారిస్తోంది. ఎప్పటి నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. బ్రెజిల్‌ నుంచి ఫీడ్‌ని ఎప్పుడు బుక్‌ చేశారు.. అక్కడి నుంచి తెప్పించుకోడానికి గల కారణాలేంటి.. విశాఖ పోర్ట్‌నే ఎందుకు ఎంచుకున్నారు. ఇంత భారీగా తెప్పించుకున్న సరుకును నిర్ణీత వ్యవధిలో ఎలా విక్రయిస్తారు? తదితర విషయాలపై ప్రశ్నించినట్లు సమాచారం. 

ఇదిలా ఉండగా.. సంధ్య ఆక్వా యాజమాన్యం కాల్ డేటాపై సీబీఐ దృష్టి సారించింది. అలాగే, విశాఖ పోర్టులో కస్టమ్స్ కార్యకలాపాలపై కూడా ఫోకస్ పెట్టింది. డ్రగ్ కంటైనర్ తనిఖీలకు వచ్చిన సీబీఐకి తొలుత ఆశించిన సహకారం లభించలేదని సమాచారం. పోర్ట్ నుంచి సీఎఫ్‌ఎస్‌కు వెళ్లే కంటైనర్‌ల తనిఖీలకు అనుసరించే విధానంపై సీబీఐ ఆరా తీస్తోంది. కస్టమ్స్ పనితీరులో లోపాలు నిర్ధారణ జరిగితే ప్రత్యేకంగా ప్రస్తావించే అవకాశం ఉంది.
 

Election 2024

మరిన్ని వార్తలు