నాలుగో ఏడాదీ ‘వైఎస్సార్‌ నేతన్న నేస్తం’ 

25 Aug, 2022 03:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: వరుసగా నాలుగో ఏడాదీ నేతన్న కుటుంబాలకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. గురువారం కృష్ణా జిల్లా పెడనలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయాన్ని జమ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు 4వ విడతగా రూ.193.31 కోట్లను జమ చేస్తారు. 

► అర్హులై ఉండి సొంత మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24,000 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక సాయాన్ని అందచేస్తోంది. నేడు అందిస్తున్న సాయంతో కలిపి అర్హుడైన ప్రతి నేతన్నకు అందించిన మొత్తం సాయం రూ.96,000. ఇప్పటివరకూ నేరుగా నేతన్నలకు ఈ పథకం ద్వారా అందించిన మొత్తం సాయం రూ.776.13 కోట్లు.  
► వైఎస్సార్‌ నేతన్న నేస్తం కింద రూ.776.13 కోట్లు, నేతన్నల పెన్షన్‌ కోసం రూ.879.8 కోట్లు, ఆప్కోకు చెల్లించిన రూ.393.3 కోట్లతో కలిపి మూడేళ్లలో నేతన్నల సంక్షేమం కోసం వెచ్చించిన మొత్తం రూ.2,049.2 కోట్లు. 
► చేనేత కార్మికులు ప్రభుత్వం అందించే ఆర్థిక సాయంతో మగ్గాలను డబుల్‌ జాకార్డ్, జాకార్డ్‌ లిఫ్టింగ్‌ మెషిన్‌ తదితర ఆధునిక పరికరాలతో అప్‌గ్రేడ్‌ చేసుకుని కొత్త డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలను ఉత్పత్తి చేయడం వల్ల 2018–19లో కేవలం రూ.4,680 మాత్రమే ఉన్న నెలవారీ ఆదాయం పథకం అమలు తర్వాత మూడు రెట్లు పెరిగి రూ. 15,000కు చేరింది. 
► గత సర్కారు బకాయి పెట్టిన రూ.103 కోట్లుసహా రూ.393.30 కోట్లను ఆప్కోకు అందచేసింది. 
► ఆప్కో వస్త్రాలకు ఆన్‌లైన్‌ ద్వారా అంతర్జాతీయ మార్కెటింగ్‌ కల్పించి నేతన్నల ఆదాయం పెంచేందుకు ఈ–కామర్స్‌ సంస్థలైన అమెజాన్, మింత్ర, ఫ్లిప్‌కార్ట్, గోకూప్, లూమ్‌ఫోక్స్, లాంటి దిగ్గజాలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.  

మరిన్ని వార్తలు