పేద విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన: సీఎం జగన్‌

20 Dec, 2023 13:58 IST|Sakshi

సాక్షి, అమరావతి: జగనన్న విదేశీ విద్యాదీవెన, సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు రూ. 41.59 కోట్లను.. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి జమచేశారు. వీరిలో సివిల్‌ సర్వీసెస్‌ ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదే విధంగా 95 మందిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. చదువుకునేందుకు పేద విద్యార్ధులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్ధుల కల నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.

పేద, మధ్యతరగతి, వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్‌ పేర్కొన్నారు. విదేశీ విద్యాదీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్‌ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్‌ పాసైతే లక్ష, మెయిన్స్‌కు క్వాలిఫై అయితే లక్షన్నర ఇస్తున్నామని తెలిపారు. రూ. 8 లక్షల వార్షికాదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. 

చదవండి: Dec 20th: AP పొలిటికల్‌ అప్‌డేట్స్‌

జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకాల నిధులు విడుదల సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్ కామెంట్స్.. ‘ అన్ని జిల్లాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్న కలెక్టర్లు, పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు, ప్రజా ప్రతినిధులు, విదేశీ దీవెన పొందుతూ అక్కడ చదువుతూ వీసీల్లో పాల్గొంటున్న వారందరికీ అభినందనలు. రాష్ట్రంలో ఎవరికైనా కష్టపడి చదివితే మంచి యూనివర్సిటీల్లో సీటు వస్తే ఫీజులు ఎంతైనా మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు, మన తల్లిదండ్రులకు, మనకు ఎటువంటి అప్పు చేయాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం తోడుగా ఉంటుంది, జగనన్న తోడుగా ఉంటాడన్న భరోసా ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నాం.

టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లోగానీ, లేదా క్యూఎస్ ర్యాకింగ్స్‌లో  గానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు.. వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి ఎంటైర్ ఫీజు చెల్లిస్తున్నాం.  ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు సంబంధించిన వారికి రూ.కోటీ 25 లక్షల దాకా, మిగిలిన వారికి రూ.కోటి దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోంది. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయి. వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు రూ.9.5 కోట్లు ఇస్తున్నాం

ఇదొక్కటే కాకుండా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఇప్పటి దాకా చదువుతున్న 408 మంది పిల్లలకు, ఈ సీజన్ లో ఫీజులు చెల్లించాల్సిన 390 మందికి వాళ్ల ఫీజు కలుపుకుంటే రూ.41.59 కోట్లు ఇస్తున్నాం. దాదాపుగా రూ.107 కోట్లు 408 మంది పిల్లల కోసం ఈ పథకం పెట్టినప్పటి నుంచి ఖర్చు చేస్తున్నాం. ఈ పథకం ఎంత సంతృప్తినిస్తుందంటే.. ఇదొక యాస్పిరేషన్. మిమ్మల్ని చూసి మిగిలిన వాళ్లు స్పూర్తి పొంది, టాప్ కాలేజీలలో సీట్లు తెచ్చుకొని మీ తలరాతలు మారడానికి ఉపయోగపడాలి.

 ఎక్కడో ఒక చోట కెరీర్‌లో  గొప్పగా ఎదిగిన తర్వాత.. ఈ తరహా సాయం రాష్ట్ర ప్రభుత్వం మీకు అందించిందో.. అది ఎక్కడో ఒక చోట మన రాష్ట్రానికి కూడా కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలగాలి. మంచి సీఈవోలుగా పెద్ద పేరు తెచ్చుకుంటే రాష్ట్రాన్ని గుర్తు పెట్టుకొని మన పిల్లలకు మీరు మంచి చేయాలన్నదే మా తాపత్రయం, నా కోరిక. ఈ ఫీజులు ఆశ్చర్యకరం అనిపించేలా ఉన్నాయి. 

►కార్నిగిమెలన్‌ యూనివర్సిటీలో రూప అనే చెల్లెమ్మకు 89 లక్షలు కంప్యూటర్ సైన్స్
► సాంబశివ అనే తమ్ముడికి న్యూయార్క్ లో కంప్యూటర్ సైన్స్ 89 లక్షలు..
►కొలంబియా యూనివర్సిటీలో ప్రకీర్త్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. 75.87 లక్షలు ఫీజు
►వాషింగ్టన్ యూనివర్సిటీ సెయింట్ లూయిస్ లో శ్రేయ 70 లక్షలు ఫీజు
► యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్ లో మరియంకు సీటు వచ్చింది 67.50 లక్షలు ఫీజు.. ఇలా 51 మంది పేర్లు ఉన్నాయి.

►సీటు వచ్చినా కూడా అక్కడికి వెళ్లి చదవడానికి ధైర్యం సరిపోని విధంగా ఈ నంబర్స్ ఉన్నాయి. 
► ఫీజులు కట్టడానికి ఎంత అప్పులు, ఎక్కడ చేయాలి, ఎలా రీ పే చేయాలనే సంశయం ప్రతి తల్లిదండ్రికీ కలిగే పరిస్థితి.
► అటువంటి పరిస్థితి మార్చడానికి టాప్ కాలేజీలో సీటు వస్తే ప్రభుత్వం మీకు అన్ని రకాలుగా తోడుగా ఉంటుందన్న నమ్మకం, భరోసా కల్పిస్తూ, శాచురేషన్ పద్ధతిలో, ప్రతి ఒక్కరికీ మీరు స్పూర్తి అయ్యేలా అడుగులు పడుతున్నాయి.
►ఈ 408 మందిలో ఎవరైనా కూడా వార్షికాదాయం రూ.8 లక్షల్లోపు ఉన్న ప్రతి కుటుంబానికీ ఇదొక బూన్ కింద, దేవుడిచ్చిన గొప్ప అవకాశం కింద సహాయ, సహకారాలు అందుతున్నాయి. తోడుగా ఉండే కార్యక్రమం ప్రభుత్వం తరఫున జరుగుతోంది.

►ఎకనమికల్లీ బ్యాక్వర్డ్ సెక్షన్ నుంచి 45 శాతం ఉంటే, మిగిలిన 55 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అందరి పిల్లలు ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేసి, ఎక్కువ మంది ఉత్తీర్ణులై మన రాష్ట్రం పేరును, వాళ్ల కుటుంబాలను ఈ స్థాయి నుంచి ఇంకో మెట్టు స్థాయిలోకి తీసుకుపోయేలా రావాలని, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలని, మీ వల్ల రాష్ట్రానికి కూడా ఆశీర్వాదం రావాలని ఆశీస్తున్నా.

► మన దేశంలో ఎక్కడైనా ఉత్తీర్ణత సాధించిన వాళ్లు, మన రాష్ట్రంలో ఐఏఎస్ లు కావాలనుకుంటారు. 
►ఇక్కడ కూడా ఒక స్పూర్తినిచ్చే కథలు రావాలని తపన, తాపత్రయంతో, ఆరాటంతో దీనికి సంబంధించి ఈరోజు మరో కార్యక్రమం ప్రారంభిస్తున్నాం. 
►ఎవరైనా ప్రిలిమ్స్ పాస్ అయితే రూ.లక్ష ఇచ్చేట్టుగా, మెయిన్స్‌కు ఎలివేట్ అయితే దానికి రూ.50 వేలు.. మొత్తంగా లక్షన్నర ఇచ్చేట్టుగా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతుంది. 
►ఈ రకంగా చేయడం వల్ల ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. 
►చదువులు మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తాయని అడుగులు వేగంగా అడుగులు వేస్తున్నాం. 
►చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. 

►ఈ రెండో కార్యక్రమం ద్వారా 95 మంది పిల్లలు నా తమ్ముళ్లు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్లకు రూ.లక్ష ఇస్తున్నాం. 
►11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ కి పోయిన వాళ్లకు రూ.50 వేలు ఇస్తున్నాం
► గవర్నమెంట్‌లో శాచురేషన్, ట్రాన్స్‌పరెన్సీ పదాలు మీ అందరి ముందు ఉంచుతున్నా.
►అర్హత ఉంటే ఎవరికైనా మంచి జరిగిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పే కార్యక్రమాలు ఇవి.
► ఎక్కడా రికమెండేషన్లు పని చేయవు, ఎవరి చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. 
► అప్లికేషన్ పెట్టుకుంటే చాలు నేరుగా మనందరి ప్రభుత్వంలో మంచి జరుగుతుందని భరోసా ఇస్తున్నా. 

►గతంలో ఇదే విదేశీ విద్యా దీవెన గత ప్రభుత్వాలు కొద్దో గొప్పో చేయాలని ప్రారంభించినవి.
►ఫీజులు 60, 70 లక్షలు కనపడుతున్నాయి. రూ.10 లక్షలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్న పరిస్థితులు. 
►ఇలా చేస్తే ఏ ఒక్కరికీ కూడా మంచి జరగదు. అప్పులపాలయ్యే పరిస్థితి ఎప్పటికీ మారదు. 
► ఎప్పుడూ బతుకులు మారవు. ఏదో చేశాం అంటే చేశాం అన్నట్లు నడిచిన కార్యక్రమాలవి.
►* దాదాపు 3,326 మందికి 2016-17కు సంబంధించి రూ.318 కోట్లు బకాయిలుగా వదిలేశారు. యూనివర్సిటీల ఎంపికలోనూ పారదర్శకత లేదు. 

►ఎల్లయ్య.. పుల్లయ్య కాలేజీల్లో సీట్లు వచ్చినా రికమెండేషన్లు పెట్టుకొని కొంతమంది మాత్రమే పొందేవారు. 
►అర్హత అన్నది ఒక క్వాలిఫికేషన్ మాత్రమే అర్హత. పొలిటికల్ జోక్యం, కరప్షన్, లంచాలు లేవు. 
►ఎవరికైనా టాప్ 50 కాలేజీలు 21 ఫ్యాకల్టీలు 350 కాలేజీల్లో ఎవరికి సీటు వచ్చినా కోటీ 25 లక్షల దాకా లిమిట్ పెట్టి చేశాం. 
► ఇవన్నీ ఎందుకు చేస్తున్నామంటే మన పిల్లలు పోటీ ప్రపంచంలో ఎదగాలి. లీడర్స్‌గా ఎదగాలి. 
► మీరు రాష్ట్రానికి ఏదో ఒకరోజు మంచి చేసే అవకాశం, పరిస్థితి రావాలి. మీ స్టోరీలు స్పూర్తిగా నిలవాలి. 
►ఇవన్నీ జరగాలని మనసారా కోరుకుంటూ.. మీ అందరికీ మనస్పూర్తిగా ఆల్ ది వెరీ బెస్ట్. 
►నిధులు విడుదల చేసే కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం’ అని సీఎం జగన్‌ తన ప్రసంగాన్ని ముగించారు.

జగనన్న విదేశీ విద్యాదీవెన ద్వారా.. ప్రపంచంలోని టాప్‌–320కి పైగా అత్యుత్తమ కళాశాలల్లో ఉచితంగా చదువుకునేందుకు ఏపీ విద్యార్థులకు జగన్‌ ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. ఇక గడిచిన 10 నెలల్లో కేవలం ‘జగనన్న విదేశీ విద్యాదీవెన’ కింద 408 మంది విద్యార్థులకు ప్రభుత్వం రూ.107.08 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించింది. ఇతర వివరాల కోసం https:// jnanabhumi.ap.gov.in ను చూడవచ్చు.

>
మరిన్ని వార్తలు