మళ్లీ ఉద్యోగుల సమరం.. మార్పు ఖాయం?

20 Dec, 2023 12:26 IST|Sakshi

ప్రైవేట్‌ ఉద్యోగాలు చేసేవారు మెరుగైన అవకాశం కనిపిస్తే చాలు..మరో ఆలోచన లేకుండా పనిచేస్తున్న సంస్థకు రాజీనామా చేయాలనుకుంటారు. సరైన నైపుణ్యాలు లేనివారికి ఉద్యోగంపోతే మళ్లీ కొత్త కొలువు సంపాదించడం కొంత​ కష్టంగా ఉంటుంది. అయితే నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రం ఉద్యోగం పోతుందేమోననే భయాలుండవు.

2024లో ఇలా మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలు మారేవారి సంఖ్య పెరుగుతుందనే సంకేతాలు ఎక్కువయ్యాయి. ప్రస్తుత సంవత్సరం మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఈ ఏడాదంతా ద్రవ్యోల్బణ భయాలు వెంటాడడంతో ఉద్యోగాలు మారాలనుకున్నవారు కొంత వెనకడుగేశారు. కానీ వచ్చే ఏడాదిలో ఇలాంటి పరిస్థితులుండవని భావిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా 28 శాతం మంది ఉద్యోగులు తమ ప్రస్తుత యజమాన్యంలోని ఉద్యోగాలను విడిచిపెట్టాలని, ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్నారు. వీరు కొత్త అవకాశాల కోసం వెతుకున్నట్లు తాజాగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) సర్వేలో వెల్లడైంది. దాంతో యాజమాన్యాలు తమ ఉద్యోగులు ఏం కోరుకుంటున్నారో దానికి ప్రాధాన్య​ం ఇవ్వడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది. 

బీసీజీ ఇండియా, ఆస్ట్రేలియా, జపాన్, యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీతో సహా మరో 8 దేశాల్లో 11,000 మంది నుంచి సేకరించిన సర్వే సమాచారం ప్రకారం ఈ వివరాలను వెల్లడించారు. వీరిలో సగం మంది పని గంటలు, వేతన చెల్లింపులు, ఇతర బెనిఫిట్స్ కోసం ఉద్యోగాలు మారుతున్నట్లు చెప్పారు. మరికొందరు తమకు ఇష్టమైన పనికోసం, సరైన సపోర్ట్ కోసం మారుతున్నట్లు పేర్కొన్నారు. అసలు ఉద్యోగం మారటానికి ప్రధానం కారణం ఏమిటని ప్రశ్నించగా ఎక్కువ మంది ఉద్యోగులు యాజమాన్య ఫంక్షనల్ విషయాలను ప్రస్థావించినట్లు వెల్లడైంది.

ఇదీ చదవండి: ఈ ఏడాది ఈమె టాప్‌.. తర్వాతే అంబానీ, అదానీ.. కానీ..

ఉద్యోగులకు వారి మేనేజర్‌ కీలకంగా వ్యవహరిస్తారు. పనిపై అసంతృప్తిగా ఉన్న ఉద్యోగులతో పోలిస్తే సంతృప్తిగా ఉన్నవారు ఉద్యోగం మారడానికి ఎక్కువ ఆసక్తి చూపరని సర్వేలో తేలింది. అనుకూలంగా ఉన్న మేనేజర్ల వల్ల చాలావరకు అట్రిషన్‌(ఉద్యోగ మార్పు) తగ్గిందని సర్వేలో వెల్లడైంది.

>
మరిన్ని వార్తలు