బస్సు ప్రమాదంపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా

20 Aug, 2023 21:25 IST|Sakshi

సాక్షి, అమరావతి: అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అల్లూరి జిల్లా, అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా కలెక్టర్లు, ఆయా జిల్లాల పోలీసు యంత్రాంగానికి సీఎం ఆదేశాలు జారీ చేశారు.

బాధిత కుటుంబాలకు తోడుగా నిలవాలంటూ అధికారులను సీఎం ఆదేశించారు. ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దృష్టిసారించాలని సీఎం పేర్కొన్నారు. 

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా
బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.

కాగా, పాడేరు ఘాట్‌ రోడ్డులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. 100 అడుగుల లోయలో ఆర్టీసీ బస్సు పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. చెట్టు కొమ్మను తప్పించబోయి లోయలో పడింది.

ఘాట్‌ రోడ్డు వ్యూ పాయింట్‌ దగ్గర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. చోడవరం నుంచి పాడేరు వెళ్తుండగా ఘటన జరిగింది.
చదవండి: మార్గదర్శి  మోసాలు.. సంచలనాలు మరిన్ని వెలుగులోకి

మరిన్ని వార్తలు