ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ సైట్లను నిషేధించండి..

29 Oct, 2020 02:59 IST|Sakshi

కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు సీఎం వైఎస్‌ జగన్‌ లేఖ

సాక్షి, అమరావతి : పలువురికి సామాజిక వ్యసనంగా మారిన ఆన్‌లైన్‌ గేమింగ్, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ వెబ్‌సైట్లు, యాప్‌లను ఏపీలో బ్లాక్‌ చేసేలా ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లను ఆదేశించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, లా మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ను కోరారు. ఈ మేరకు ఆయనకు లేఖ రాశారు. అందులోని ముఖ్యంశాలు ఇలా ఉన్నాయి. ‘గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌ గ్రూపులు యువతను సులభంగా ఆకట్టుకుని వారిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వీటి వల్ల డబ్బులు కోల్పోయిన వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

ఈ కారణంగా మేము ఏపీ గేమింగ్‌ యాక్ట్‌–1974లో ఆన్‌లైన్‌ గేమింగ్, ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్, ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లను ఒక నేరంగా పేర్కొంటూ ‘ఏపీ ఆర్డినెన్స్‌–2020’ తెచ్చాం. దాన్ని 2020 సెప్టెంబర్‌ 25న నోటిఫై చేశాం. ఈ చట్ట సవరణ ముఖ్య ఉద్దేశం ఆన్‌లైన్‌ గేమింగ్, బెట్టింగ్‌లను నిషేధించడమే. వీటిని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్ల సహాయం లేకుండా నిలుపుదల చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ వ్యవహారంలో మీరు జోక్యం చేసుకోవాలని కోరుతున్నాను’ అని సీఎం వైఎస్‌ జగన్‌ కోరారు. నిషేధించాల్సిన 132 వెబ్‌సైట్ల వివరాలను లేఖకు జత చేశారు. (రైతులకు 10 రోజుల్లోగా పేమెంట్‌ అందేలా చూడాలి)   

మరిన్ని వార్తలు