విద్యా వ్యవస్థపై వాళ్లవి తప్పుడు రాతలు: సీఎం జగన్‌

3 Nov, 2022 18:54 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బ తినేలా యెల్లో మీడియా వ్యతిరేక రాతలు రాస్తోందని, కానీ, వాస్తవాన్ని వివరించి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, అధికారులకు సూచించారు. గురువారం విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు.

విప్లవాత్మక సంస్కరణలు
నాణ్యమైన విద్యకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం జగన్‌ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా  బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్‌ ఇస్తున్నాం. ఇందులో భాగంగా స్కూల్‌ బ్యాగు, బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలు, నోట్‌ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీ  ఉంటున్నాయి. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్‌ ప్రారంభించే తొలిరోజే అందిస్తున్నాం. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో స్కూల్‌ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి. మనం ఆ విధానంలో మార్పు తెచ్చాం. మనం స్కూల్‌ ప్రారంభించిన తొలిరోజు పాఠ్యపుస్తకాలు  ఇతర మెటీరియల్‌ అందిస్తున్నాం, ఇది గతానికి ఇప్పటికీ ఉన్న పెద్ద తేడా అని వివరించారు. 

తప్పుడు రాతలతో..
ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాతలు రాస్తోందని అధికారులు ఈ సందర్భంగా.. సీఎం జగన్‌కు వివరించారు. సెకెండ్‌ సెమిస్టర్‌ ప్రారంభం అయినా.. ఇంకా పుస్తకాలు అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను అధికారులు ఖండించారు. డిసెంబరులో సెకెండ్‌ సెమిస్టర్‌  ప్రారంభం అవుతుందని, అలాంటిది ఇప్పుడే పుస్తకాలు అందలేదని రాయడం కచ్చితంగా తప్పుదోవ పట్టించడమేనని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్లో రెండో సెమిస్టర్‌ ప్రారంభం అవుతుందన్న విషయాన్ని అకడమిక్‌ క్యాలెండర్‌లో పేర్కొన్నామని, ఈ విషయం తెలిసీ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాశారన్నారు.

జగన్‌కు వాళ్లు వ్యతిరేకం కాబట్టే..
వాస్తవాలను ఇలా వక్రీకరించడంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లలనైతిక స్థైర్యం దెబ్బతినేలా ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక వార్తలు రాస్తున్నారని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు. ఇంగ్లిషు మీడియంకు, ప్రభుత్వ విద్యారంగానికి వారు వ్యతిరేకం కాబట్టే.. ఇలాంటి తప్పుడు వార్తలు  రాసి ప్రచారం చేస్తున్నారన్నారాయన. ‘‘పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య అందడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంకా మొదలు కాక ముందే రెండో సెమిస్టర్‌ ప్రారంభం అయిందని వార్తలు రాయడంలో ఉద్దేశం ఇదే. డిసెంబరులో సెకెండ్‌ సెమిస్టర్‌ ప్రారంభం అవుతుందని అకడమిక్‌ క్యాలెండర్‌లో ఉంటే...  ఆ విషయం రాయలేదు.  రాజకీయంగా జగన్‌ను ఇబ్బందిపెట్టాలి కాబట్టే, ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ  సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారిలో స్థైర్యం దెబ్బతినేలా నిరంతరం కథనాలు రాస్తున్నారు.

రామోజీరావుకు, ఈనాడుకు జగన్మోహన్‌రెడ్డి అంటే ఇష్టం లేదు.. అంత మాత్రాన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం తప్పు. ఇలా తప్పుడు వార్తలు రాయకూడదు. మన ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వచ్చాం. పుస్తకాల్లో జోడించిన అదనపు సమాచారం వల్ల, బైలింగువల్‌ కాన్సెప్ట్‌ వల్ల టెక్ట్స్‌బుక్‌ సైజు పెరిగింది.  బైలింగువల్‌ టెక్ట్‌బుక్స్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషు ఉంటుంది.. దీంతో సాధారణంగానే టెక్ట్స్‌బుక్‌ సైజు పెరుగుతుంది. దీంతో టెక్ట్స్‌ బుక్‌ను సెమిస్టర్‌ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. దీన్ని వక్రీకరించి, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు వార్తలు రాస్తున్నారు.

పటిష్టంగా సబ్జెక్ట్‌ టీచర్ల కాన్సెప్ట్‌
గతంలో క్లాస్‌ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్‌ టీచర్‌ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నామని సీఎం జగన్‌ పేర్కొన్నారు. ‘‘గతంలో పాఠ్యాంశాలు అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్‌ బోధించే పరిస్థితి లేదు. అందుకే సబ్జెక్టు టీచర్‌ కాన్సెప్ట్‌ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చాం’’ అని పేర్కొన్నారు. మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్‌ టీచర్స్‌ కాన్సెప్ట్‌ సమర్ధవంతగా అమలు చేయాలి. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. 

స్లో బట్‌ బెటర్‌ రిజల్ట్‌
45వేల స్కూళ్లను బాగుచేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా దురదృష్టవశాత్తూ వ్యతిరేక వార్తలతో, వ్యతిరేక రాజకీయాలతో మనం చేసే మంచిని జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల స్వార్ధ రాజకీయాలకోసం ఇదంతా చేస్తున్నారు. వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం వీటన్నింటితో యుద్ధం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా, పక్కాగా చేపట్టాలన్న సీఎం. మనం అధికారంలోకి రాకముందు 2018–19లో ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్ధులు ఉండేవారు. ప్రస్తుతం 42 లక్షల మంది ఉన్నారు.  కోవిడ్‌ టైంలో కూడా మనం ఈ సంఖ్య చేరుకున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న ఈ సంస్కరణలు ఫలితాలు క్రమంగా వస్తున్నాయి. ప్రస్తుతం నాడు - నేడు 15వేల స్కూళ్లలో జరిగింది. ఈ యేడు సుమారు మరో 22 వేల స్కూళ్లలోనూ, ఆ తర్వాత సంవత్సరం మిగిలిన స్కూళ్లలోనూ జరుగుతుంది. ఇది దశలవారీగా జరిగే ప్రక్రియ. దీనికి మరో 3–4 సంవత్సరాలు పడుతుంది. ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెరుగుతుంది. ప్రభుత్వం ఈ పనులు చేపట్టి.. పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించింది. నాడు–నేడు లో చివరి ప్రక్రియ డిజిటలైజేషన్‌ ఆఫ్‌ క్లాస్‌ రూమ్స్‌. అది జరిగితే నాడు నేడు పూర్తయినట్లు అని సీఎం జగన్‌ తెలిపారు. ఇంకా..  

డిజిటలైజేషన్‌ ప్రక్రియలో స్కూల్లో ఉన్న  ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్‌ కావాలి. 
► ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేదపిల్లలకు మంచి భవిష్యత్‌ అందించాలన్నదే మన లక్ష్యం.
► అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది.. పేదరికం నుంచి బయటపడతారు. కేవలం విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
► విద్యారంగంలో చేపడుతున్న ఈ మార్పులు విషయంలో రాజీ పడొద్దు.
► విద్యారంగంలో పెడుతున్న ఖర్చు  మానవవనరుల మీద పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కింద భావించాలి. ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయాల్సిన పనిలేదు.

► గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలి.
► ఎస్‌ఎంఎఫ్, టీఎంఎఫ్‌ నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి.

 సీబీఎస్‌ఈ సిలబస్‌కు సంబంధించి ఇప్పటివరకు 1000 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ వచ్చిందని తెలిపిన అధికారులు.
► నాడు–నేడు చేపట్టిన ప్రతి స్కూలుకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉండాలి. ఈ దిశగా మరింత కృషి చేయాలన్నారు సీఎం జగన్‌.

గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు
► బైజూస్‌ కంటెంట్‌ను పాఠ్యప్రణాళికలో పొందుపరుస్తున్నాం.
► ఆఫ్‌ లైన్‌లోనూ ట్యాబులు వినియోగించుకునేందుకు వీలుగా అందులో కంటెంట్‌ను ప్రీలోడ్‌ చేస్తున్నాం. 
► ఏప్రిల్‌ 2023లోగా తరగతి గదుల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్స్‌ను  ఏర్పాటు చేస్తామని, కార్యాచరణ  రూపొందించామని వెల్లడి.
► మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్‌ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం.
► అలాగే మెనూలో కూడా మార్పులు చేర్పులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నాం.
► గుడ్లు పాడైపోకుండా పాటించాల్సిన పద్ధతులపై ఎస్‌ఓపీ కూడా తయారుచేశాం.
► వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్‌ ప్రకారం విద్యాకానుక కింద వస్తువుల కొనుగోలు కొనసాగుతోంది.
► ఫేజ్‌– 2 కింద 22,344 స్కూళ్లో నాడు – నేడు పనులు కొనసాగుతున్నాయి.
► బైజూస్‌ కంటెంట్‌ను ఇతర విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వారి తల్లిదండ్రుల స్మార్ట్‌ ఫోన్లలోకి లోడ్‌ చేసే ప్రక్రియనూ ముందుకు తీసుకెళ్తున్నాం.

► 2024–25లో సీబీఎస్‌ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మరింత తోడుగా నిలవడానికి బోధనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ సూచించారు.

► 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్న అధికారులు.
 
► అధికారులకు ప్రశంసలు...
పాఠశాల విద్యా పనితీరు సూచికల్లో అద్భుత పనితీరు కనపర్చింది ఏపీ. పర్‌ఫార్మెన్స్‌ గ్రేడింగ్‌ ఇండెక్స్‌(పీజీఐ)లో అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో చేరింది. దీంతో అధికారులను అభినందించారు సీఎం జగన్‌. కేంద్ర విద్యాశాఖపరిధిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2020–21 గానూ పనితీరు గ్రేడింగ్‌ సూచీ(పీజీఐ) విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా పాఠశాల విద్యావ్యవస్ధను విశ్లేషించేందుకు ఇది ఒక సాక్ష్యాధారిత ప్రత్యేక సూచీగా నిలుస్తుంది. మొత్తం 70 ఇండికేటర్ల ప్రాతిపదికన 1000 పాయింట్లను నిర్ణయించారు. వీటని ఫలితాలు, పాలనా యాజమాన్యం అనే రెండు కేటగిరీలుగా విభజించారు. వీటిని మరలా అభ్యాస ఫలితాలు, లభ్యత, మౌలిక సదుపాయాలు, ఈక్విటీ, పాలన ప్రక్రియకు సంబంధించిన 5 డొమైన్లుగా విభజించి పాయింట్లు కేటాయిస్తారు. 

ఇందులో 950 పాయింట్లు సాధించిన రాష్ట్రం లెవల్‌ –1లో ఉంటుంది. ఈ లెవల్‌ - 1 జాబితాలోలో ఏ రాష్ట్రమూ లేదు. 901 నుంచి 950 మధ్య స్కోరు సాధించిన లెవల్‌ - 2 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ నిల్చింది. విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, విప్లవాత్మక మార్పుల ఫలితంగా రాష్ట్రం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. తొలిసారిగా లెవల్‌-2 కు చేరుకుంది ఏపీ. గతంలో ఎప్పుడూ ఈ స్ధాయికి చేరుకోలేదు.

మరిన్ని వార్తలు