FactCheck: మాటలు కాదు... మీ రాతలతోనే చేటు

2 Dec, 2023 05:01 IST|Sakshi

పేదల్లో చీలిక తెచ్చి తెలుగుదేశానికి లబ్ధి చేకూర్చేందుకు ‘ఈనాడు’ ప్రయాస

అందుకే ఎస్సీలకు అదనంగా ఏం చేశారంటూ కుట్రపూరిత కథనాలు

 దీనిపై ఒకరిద్దరిచేత మాట్లాడించి వికృతానందం పొందుతున్న ఎల్లో మీడియా

ఎస్సీలకు లబ్ధి విషయంలో బాబు ప్రభుత్వంతో ఇపుడు పోలికే లేదు

దళితులు శుభ్రంగా ఉండరని, ఎస్సీలుగా పుట్టాలని ఎవరనుకుంటారని అన్నది చంద్రబాబే

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియాన్ని, దళితులకిస్తున్న ఇళ్లను అడ్డుకున్నదీ బాబే

అప్పట్లో పెన్షన్‌ కేవలం నెలకు రూ.1,000.. ఇపుడది 3 వేలకు చేరువలో...

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీలకు లబ్ధి రూ.8,844 కోట్లే

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటివరకు రూ.40,440 కోట్ల ఖర్చు

ఎస్టీలకు జరిగిన మేలు చూసుకున్నా అప్పటికన్నా ఆరు రెట్లు ఎక్కువ

ఇవేవీ చెప్పకుండా దిగజారుడు రాతలతో పేదల్లో చీలిక తెచ్చేందుకు రామోజీ కుట్ర  

సాక్షి, అమరావతి: ఇదెక్కడి కుట్ర రామోజీ? పేదలంతా వైఎస్‌ జగన్‌ పక్షాన నిలుస్తున్నారనే భయంతో వారిలో విభజన తెచ్చేందుకు కులాల పేరిట రెచ్చగొట్టడం అమానుషం కాదూ? ఎస్సీలను రకరకాలుగా తూలనాడి, వారిని కట్టు బానిసల్లా చూసిన చంద్రబాబు నాయుడికి వత్తాసుగా మరీ ఇంతలా దిగజారి రాయాలా? దళితులు శుభ్రంగా ఉండరని.. అసలు దళితుల్లో పుట్టాలని ఎవరైనా ఎందుకు కోరుకుంటారని రకరకాల మాటలు మాట్లాడిన చంద్రబాబును ఎవరైనా మరిచిపోగలరా?

పేదల్లో అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలేనని భావించి... వారి కోసం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నెలవారీ పింఛన్‌ను వెయ్యి రూపాయల నుంచి రూ.3వేలకు పెంచుతూ వస్తున్న మాట నిజం కాదా? పింఛన్లు అందుకుంటున్న వారి సంఖ్య ఏ మేరకు పెరిగిందో కనిపించటం లేదా? వైఎస్సార్‌ చేయూత సహా ఇప్పుడు ఎస్సీలకు, ఇతర పేదలకు అందుతున్న పథకం చంద్రబాబు హయాంలో ఒక్కటైనా ఉందా? అసలు పేదల్ని వారి పేదరికం నుంచి బయటపడేసేందుకు బాబు హయాంలో ఒక్క అడుగైనా పడిందా?

ఇపుడు ఆ ప్రయత్నం సంపూర్ణంగా జరుగుతుంటే ఒక్కనాడు కూడా కనీసం ప్రశంసించకుండా... పైపెచ్చు వాళ్లలో విభజన తెస్తూ... మాకు అందరికంటే ఎక్కువేం చేశారు? అని ఒకరిద్దరితో అనిపిస్తూ... అదే దళితుల మాటగా రెచ్చిపోయి మీ ఎల్లో ఛానెళ్లలో ప్రసారం చేస్తూ పైశాచికానందం పొందుతున్న మాట నిజం కాదా? దాన్నే మీరు కూడా అచ్చువేస్తూ అబద్ధాలను నిజం చెయ్యాలనుకుంటే సాధ్యమయ్యే పనే అనుకుంటున్నారా? అసలు ఎస్సీలకు, ఇతర బలహీన వర్గాలకు ఈ ప్రభుత్వ హయాంలో జరిగిన సంక్షేమాన్ని మీరు వేరే ఏ ప్రభుత్వంతోనైనా పోల్చగలరా? ఇంకా ఎన్నాళ్లీ అబద్ధాలు? 

దళితులు, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుంటే ఓర్వలేరు!. ఇంగ్లిష్‌ మీడియం ద్వారా మాతృభాషను దెబ్బతీస్తున్నారంటూ పెడబొబ్బలు పెడతారు. మీ పిల్లలు, మీ చంద్రబాబు పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలోనే చదువుతారు. మీ మంత్రులేమో ఇంగ్లీషు మీడియం స్కూళ్లు నడు­పుతారు. కానీ బడుగుల పిల్లలకు ఇంగ్లీషు మీడి­యం వద్దంటూ కోర్టుల్లో మీ వందిమాగధుల చేత పిటిషన్లు వేయించటం నిజం కాదా? ఎందుకంటే బడుగుల పిల్లలు బాగా చదువుకుని మీ పెత్తందార్ల పక్కన దర్జాగా కూర్చుంటానే కదా మీ భయం?

ఇళ్లు లేని బడుగు, బలహీనవర్గాలకు ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇస్తుంటే కోర్టులకు వెళ్లి అడ్డుకున్నది మీరు కాదా? ఒకో ఇంటి ద్వారా దాదాపు రూ.15 లక్షల విలువైన ఆస్తిని సమకూర్చిన ప్రభుత్వాన్ని పేదలంతా నెత్తిన పెట్టుకుంటుంటే మీరు మాత్రం ఇలా విమర్శలు గుప్పిస్తుండటాన్ని ఏమనుకోవాలి? అమరావతిలో మీ పక్కన బడుగు, బలహీనవర్గాల వారుంటే సామాజిక సమతౌల్యం దెబ్బతింటుందని నిస్సిగ్గుగా కోర్టులో చెప్పుకున్నది నిజం కాదా? ఈ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అసైన్డ్‌ భూములపై యాజమాన్య హక్కులు కల్పిస్తూ బడుగు, బలహీనవర్గాలకు మేలు చేసింది.

మీకు కనీసం అలాంటి ఆలోచన కూడా రాలేదు కదా? ఇవేమీ చెయ్యకున్నా చంద్రబాబును దళితుల పాలిట దేవుడిగా ప్రచారం చేస్తున్న మీ పచ్చమీడియాను అసలు నమ్మే వారెవరైనా ఉన్నారా?ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మల అభ్యున్నతి కోసం అర్హతలున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం ఏటా రూ.18,750 ఇస్తోంది. బాబు హయాంలో ఇదెప్పుడైనా చూశారా? ఓవైపు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో రాష్ట్రం శ్రీలంకలా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోదంటూ గగ్గోలు పెట్టేదీ మరోవైపు చంద్రబాబు ఫ్రీగా బెంజికార్లు ఇస్తామంటుంటే.. అది సాధ్యమేనంటూ డప్పు కొట్టేదీ మీరే. దీన్నేమనుకోవాలి? ‘మాటలే స్వీటు.. చేతలు చేటు’ అంటూ శుక్రవారం ‘ఈనాడు’ వండి వార్చిన దుర్మార్గపు కథనంలో అసలు నిజమేదైనా ఉందా? ఇదిగో చూద్దాం...

కుల కార్పొరేషన్ల నిర్వీర్యం ఎక్కడ?
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసిందని ఈనాడు విషం కక్కింది. వాస్తవానికి టీడీపీ హయాంలో ఒకటే కార్పొరేషన్‌గా ఉన్న ఎస్సీ కార్పొరేషన్‌ను జగన్‌ ప్రభుత్వం మూడు కార్పొరేషన్లుగా మార్చింది. మాల కార్పొరేషన్, మాదిగ కార్పొరేషన్, రెల్లి కార్పొరేషన్‌గా విడదీసింది. వీటిద్వారా ఎస్సీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది. టీడీపీ హయాంలో ఒకటే కార్పొరేషన్‌ కాగా... దీనిద్వారా లబ్ధి కలిగింది అతికొద్ది మందికి. కానీ ఇపుడు సంతృప్త స్థాయిలో... అంటే అర్హతలున్న ప్రతి ఒక్కరికీ పథకాలు అందుతున్నాయి. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే నగదు జమవుతోంది. పచ్చ దండుకు మింగుడు పడనిది ఇదే.                       

పింఛన్‌ వ్యయం 227 శాతం అధికం..
చంద్రబాబు ప్రభుత్వం కేవలం 8,66,835 మంది ఎస్సీలకు నెలకు రూ.వెయ్యి చొప్పున మొత్తం రూ.4,415 కోట్లు, 3,01,242 మంది ఎస్టీలకు రూ.1,373 కోట్లు మాత్రమే ఇచ్చింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు 12,15,030 ఎస్సీలు (గత ప్రభుత్వం కంటే 18.41 శాతం ఎక్కువ)కు నెలకు రూ.2,750 చొప్పున మొత్తం రూ.14,418 కోట్లు (గత ప్రభుత్వం కంటే 227 శాతం అధిక మొత్తం) అందించింది. అలాగే ఎస్టీలకు 3,94,753 మంది (గతం కంటే ఆరు శాతం ఎక్కువ)కు రూ.4,694 కోట్లు (గతం కంటే 241 శాతం అధికం) ఇచ్చారు. 

దేశంలోనే మొదటి స్థానం
ఎస్సీ కాంపొనెంట్‌ అమల్లో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. దేశంలోని 20 రాష్ట్రాల్లో ఎస్సీ కాంపొనెంట్‌ కింద చేసిన ఖర్చు కన్నా ఒక్క ఆంధ్రప్రదేశ్‌లో చేసిన ఖర్చే అధికంగా ఉండటం విశేషం. ఎస్సీ కాంపొనెంట్‌ ద్వారా దేశవ్యాప్తంగా 12.41లక్షల స్వయంసహాయక సంఘాలు ఏర్పాటైతే, ఒక్క మన రాష్ట్రంలోనే 8.54 లక్షల సంఘాలు ఏర్పాటయ్యాయి.

భూమి కొనుగోలు పథకం ఎత్తివేసింది ఎవరు?
వాస్తవం:
గత టీడీపీ ప్రభుత్వం భూమి కొనుగోలు పథకానికి ఎంతమేర భూమి సేకరించిందనే వివరాలే లేవు. దీన్నిబట్టే ఈ పథకాన్ని ఎవరు ఎత్తేశారో తెలుస్తుంది. దశాబ్దాల క్రితం భూమి కొనుగోలు కోసం ఎస్సీ కార్పొరేషన్ల నుంచి రుణాలు తీసుకున్న ఎస్సీల భూమి తనఖాలో ఉండిపోయింది. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అలాంటి రుణాలన్నింటినీ రద్దుచేసి, వారికి ఆ భూములపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది. ఎస్సీల జీవితాల్లో ఇదో మైలురాయి.

ఈ ప్రభుత్వ మేలుతో 14,223 దళిత మహిళలకు 16,213 ఎకరాలపై పూర్తి యాజమాన్య హక్కులు లభించాయి. మరో 3,57,085 మంది ఎస్సీలకు, 1,20,477 మంది ఎస్టీలకు సైతం అసైన్డ్‌ భూములపై పూర్తి హక్కులు లభించాయి. ఇళ్ల స్థలాల పంపిణీ, ఇంటి నిర్మాణాలకు గత ప్రభుత్వం ఒక్క సెంటు భూమిని కూడా కొనలేదు. కానీ ప్రస్తుత ప్రభుత్వం పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు బాసటగా నిలిచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం సుమారు 31 లక్షలకుపైగా ఇళ్లపట్టాలు ఇస్తే అందులో 6,36,732 మంది లబ్ధిదారులు ఎస్సీ అక్కచెల్లెమ్మలే. అంటే లబ్దిదారుల్లో 20.7 శాతం.

తద్వారా ఆయా కుటుంబాలకు జగన్‌ ప్రభుత్వం రూ.10,949 కోట్ల లబ్ధి చేకూర్చింది. అంతేకాకుండా వారి కోసం చేస్తున్న 4,18,646 ఇళ్ల నిర్మాణ రూపంలో మరో రూ.10,949 కోట్ల మేర కూడా లబ్ధి చేకూరుతోంది. ఇక 1,41,496 మంది ఎస్టీ అక్కచెల్లెమ్మలు (మొత్తం లబ్ధిదారుల్లో 4.6 శాతం) ఉన్నారు. చరిత్రలో ఏ ప్రభుత్వం ఈ స్థాయిలో ఎస్సీ, ఎస్టీలకు అండగా నిలబడలేదు. ఎస్సీలకు 12,816 ఎకరాలు, ఎస్టీలకు 5,978 ఎకరాల అసైన్డ్‌ భూములపై ఈ ప్రభుత్వం పూర్తి యాజమాన్య హక్కులు కల్పించింది.

హాస్టళ్లకూ నాడు – నేడు..
ఈనాడు తన కథనంలో ‘హాస్టళ్లు సంక్షోభ వసతి కేంద్రాలు’గా ఉన్నాయంటూ అబద్ధాలను అచ్చేసింది. వాస్తవానికి రాష్ట్ర విభజన తర్వాత 168 సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. వీటికి టీడీపీ ప్రభుత్వం మరో 21 స్కూళ్లను మాత్రమే అదనంగా చేర్చగలిగింది. ఇందులో కూడా 15 స్కూళ్లను 2019 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు మాత్రమే... అదీ కాగితాలపైనే ప్రకటించింది. ఈ ప్రభుత్వం వచ్చాక సోషల్‌ వెల్ఫేర్‌ స్కూళ్లలో మరమ్మతుల కోసం ఇప్పటికే 64.33 కోట్లు ఖర్చు చేసింది. 39 సివిల్‌ వర్కుల కోసం మరో రూ.1౩౩.90 కోట్లు ఖర్చు పెట్టింది. దీంతో ఈ భవనాలన్నీ నిర్వహణలోకి వచ్చాయి. అలాగే 177 స్కూళ్లలో నాడు–నేడు పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది, ఇందుకు రూ.318 కోట్లు ఖర్చు చేయనుంది.  

నాణ్యమైన విద్య అందుతోంది ఇప్పుడే..
‘నాణ్యమైన విద్యకు తిలోదకాలు’ ఇచ్చారంటూ ఈనాడు మరో అబద్ధాన్ని పేర్చింది. వాస్తవానికి ఈ ప్రభుత్వం విద్యను అత్యంత ప్రాధాన్యంగా గుర్తించింది. నాడు–నేడు పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను సర్వ సదుపాయాలతో తీర్చిదిద్దింది. జగనన్న విద్యా కానుక, జగనన్న గోరుముద్ద, జగనన్న అమ్మ ఒడి వంటి పథకాలను అందిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్‌ఈ, ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టింది. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందజేస్తోంది.

ఈ పథకాల వల్ల అత్యధిక శాతం లబ్ధి పొందుతోంది.. బడుగు, బలహీనవర్గాల పిల్లలే. టోఫెల్‌ లాంటి ఉన్నతాదాయ వర్గాల పిల్లలకే పరిమితమైన వాటిని కూడా ప్రభుత్వం బడుగు, బలహీనవర్గాల పిల్లలకు అందుబాటులోకి తెచ్చింది. ఇటీవలే ప్రభుత్వం సివిల్‌ సర్వీసెస్‌ ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ క్రమంలో మెయిన్స్‌కు అర్హత సాధిస్తే రూ.లక్ష , ఇంటర్వ్యూలకు క్వాలిఫై అయినవారికి అదనంగా రూ.50 వేల చొప్పున ప్రోత్సాహకాలను ప్రకటించింది.

పిల్లలంతా బడిలో ఉండాలనే ఏకైక ధ్యేయంతో జగనన్న అమ్మఒడి కింద ఇప్పటివరకు 8,84,131 మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.15 వేల చొప్పున రూ.5,335.7 కోట్లు అందించింది. అలాగే 2,86,379 ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.1,714.75 కోట్లు జమ చేసింది. జగనన్న వసతి దీవెన ద్వారా 5.06 లక్షల మందికిపైగా ఎస్సీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.834 కోట్లు నేరుగా వేసింది.

83 వేల మంది ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.135. కోట్లను జమ చేసింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.5.4 లక్షల మంది ఎస్సీ విద్యార్థుల తల్లులకు రూ.2,081 కోట్లు అందించింది. అలాగే 1.11 లక్షల మంది ఎస్టీ విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.346 కోట్లు జమ చేసింది. ఈ మొత్తాలన్నీ అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమయ్యాయి.  

మరింత మెరుగ్గా విదేశీ విద్యా దీవెన
గత ప్రభుత్వం అమలు చేసిన విద్యోన్నతి పథకం రద్దైందని ఈనాడు గగ్గోలు పెట్టింది. కానీ గత ప్రభుత్వం హయాంలో ఈ పథకంలో జరిగిన లోపాలను, అవినీతిని, అక్రమాలను గుర్తించి ఆ స్థానంలో జగనన్న విదేశీ విద్యా దీవెన పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రతిభ ఉన్న విద్యార్థులందరికీ సమాన అవకాశాలు దక్కేలా, ప్రతిష్టాత్మక కాలేజీల్లో సీటు సాధించిన వారికి పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లించేలా పథకాన్ని సమున్నతంగా తీర్చిదిద్ది అమలు చేస్తోంది.

21 కోర్సులలో క్యూఎస్‌ ర్యాంకింగ్‌ లేదా టైమ్స్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ర్యాంక్‌ల ప్రకారం టాప్‌ 50లో నిలిచిన విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్ధులకు గరిష్టంగా రూ.1.25 కోట్లు లేదా 100 శాతం ట్యూషన్‌ ఫీజును ప్రభుత్వం చెల్లిస్తోంది. మిగిలిన వర్గాలకు రూ.కోటి లేదా అసలు ట్యూషన్‌ ఫీజు (ఏది తక్కువ అయితే అది) చెల్లిస్తున్నారు. 

స్వయం ఉపాధి పథకాల కింద 
► 
టీడీపీ ప్రభుత్వ హయాంలో 2,02,414 మందికి రూ.2,726 కోట్లు
►  ఈ ప్రభుత్వం హయాంలో ఇప్పటివరకు వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీల్లో 23,17,558 మందికి రూ.7,075.29 కోట్లు. ఎస్టీలకు 4,72,018 మందికి రూ.1,392 కోట్లు లబ్ధి చేకూరింది.
►  ఎస్సీ లబ్ధిదారుల స్థిరమైన జీవనోపాధి, ఆర్థిక అభ్యున్నతి కోసం పౌర సరఫరాల సంస్థ ద్వారా 2020–21లో రాష్ట్ర ప్రభుత్వం రూ.133.67 కోట్లతో 2,300 ఫోర్‌ వీలర్‌ మినీ ట్రక్‌ మొబైల్‌ డిస్పెన్సరీ యూనిట్‌ వాహనాలను ప్రజా పంపిణీ వ్యవస్థ డోర్‌ డెలివరీ కోసం అందించింది. జాతీయ ఎస్సీ కులాల ఆర్థికాభివృద్ధి సంస్థ (ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ) ద్వారా స్వయం ఉపాధి పథకం కింద రూ.63.20 కోట్లతో 1,038 యూనిట్లను అమలు చేసింది. 

>
మరిన్ని వార్తలు