కోర్టు సిబ్బందిని కొట్టిన సీఐపై విచారణ

7 May, 2023 09:35 IST|Sakshi

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్‌ కమిషనర్, అతనికి సహాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులను అనంతపురం జిల్లా హిందూపురం వన్‌టౌన్‌ సీఐ ఇస్మాయిల్‌ కొట్టిన ఘటనను హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌)గా మలిచింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం రేంజ్‌ డీఐజీ, జిల్లా ఎస్పీ, సీఐ ఇస్మాయిల్‌ తదితరులను ప్రతివాదులుగా చేర్చింది. ఈ వ్యాజ్యంపై సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరపనుంది.

విచారణ కోసం వెళ్లగా.. హిందూపురానికి చెందిన దేవాంగం గిరీష్‌ అనే వ్యక్తి­ని అక్కడ పోలీసులు అక్రమంగా నిర్బంధించా­రంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హిందూపురం ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు సదరు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి వాస్తవాలను పరి­శీలించి నివేదిక ఇచ్చేందుకు న్యాయవాది ఉదయ్‌­సిం­హారెడ్డిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా నియమించింది. గిరీష్‌ అక్రమ నిర్బం­ధంలో ఉంటే తీసుకురావా­లని అడ్వొకేట్‌ కమిషనర్‌కు స్పష్టం చేసింది. 2022 అక్టోబర్‌ 21న ఉదయ్‌సింహారెడ్డి హిందూపురం వన్‌టౌన్‌ పోలీస్‌స్టేష­న్‌కు వెళ్లారు. అతనికి సహాయకులుగా కోర్టు సిబ్బంది, గిరీష్‌ తరఫు న్యా­య­వాది, అతని కుటుంబ సభ్యులు వెళ్లారు. గిరీష్‌ పోలీసుల నిర్భంధంలో ఉన్నా­రని, అతన్ని పోలీసులు కొట్టినట్టు అడ్వొకేట్‌ కమి­షనర్‌ గుర్తించారు.

అతనికి తక్షణమే చికిత్స అవసరమని, కోర్టుముందు హాజరుపరిచేందుకు తనవెంట పంపాలని ఇన్‌స్పెక్టర్‌ను ఉదయ్‌సింహారెడ్డి కోరా­రు. ఇందుకు నిరాకరించిన ఇస్మాయిల్, అడ్వొకేట్‌ కమిషనర్‌తో పాటు అతని వెంట ఉన్న వారిపై చేయి చేసుకున్నారు. దీనిపై ప్రిన్సి­పల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి సదరు ఇన్‌స్పెక్టర్‌ను వివరణ కోరారు. అయితే, సంతృప్తికరమైన సమాధానం ఇవ్వకపోవడంతో జడ్జి ఈ విషయాన్ని డీఐజీ దృష్టికి తీసుకొచ్చారు. అంతేకాక ఈ విషయాన్ని జిల్లా జడ్జి, హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. జిల్లా జడ్జి సైతం హైకోర్టుకు ఓ నివేదిక పంపారు.

ఈ సమయంలో అనంతపురం జిల్లా అడ్మినిస్ట్రేటివ్‌ జడ్జిగా ఉన్న హై­కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవా­న­ంద్‌ దీనిపై డీజీపీ వివరణ కోరాలని రిజిస్ట్రీని ఆదేశించారు. ఇది చాలా తీవ్రమైన వ్యవహారమని, ఇందులో న్యాయవ్యవస్థ ప్రతిష్ట ముడిపడి ఉన్నందున దీనిని సుమో­టో పిల్‌గా పరిగణించాలని, తగిన ఉత్తర్వుల నిమి­త్తం సీజే ముందుంచాలని జస్టిస్‌ దేవా­నంద్‌ రిజిస్ట్రీని ఆ­దేశించారు. ఆ తరువాత డీజీపీ స్పందిస్తూ.. బా­ధ్యుౖ­లెన పోలీసులకు శిక్ష విధించామని, రెండేళ్ల పా­టు ఇంక్రిమెంట్‌ను నిలుపుదల చేశామని కోర్టుకు నివేదించారు. జిల్లా జడ్జి నివేది­కను పరిశీలించిన హై­కోర్టు దీనిని సుమోటోగా పిల్‌గా పరిగణించాలని నిర్ణ­యించింది. ఆ మేరకు రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేసింది.

(చదవండి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఏపీకి వర్ష సూచన)

మరిన్ని వార్తలు