సీఎం జగన్‌ను కలిసిన ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌

29 Aug, 2022 17:13 IST|Sakshi

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఒబెరాయ్‌ గ్రూప్‌ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఆపరేటింగ్‌ అధికారి రాజారామన్‌ శంకర్‌ భేటీ అయ్యారు. సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం జగన్‌ను  రాజారామన్‌ కలిశారు.  ఈ మేరకు ఏపీలో ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటల్స్‌ ప్రణాళికలు గురించి సీఎం జగన్‌కు వివరించారు.

ఏపీలో ఒబెరాయ్‌ ప్రాజెక్ట్‌లకు అవసరమైన అనుమతులన్నీ సింగిల్‌ విండో విధానంలో ఇవ్వాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు. రాష్ట్రంలో దాదాపు రూ. 1,500 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఒబెరాయ్‌ గ్రూప్‌ ముందుకొచ్చింది. అన్ని హోటల్స్‌ కూడా 7 స్టార్‌ సౌకర్యాలతో విల్లాల మోడల్‌లో రూపకల్పన చేయనుంది ఒబెరాయ్‌ గ్రూప్‌. ఏపీలో విశాఖపట్నం, తిరుపతి, గండికోట, పిచ్చుకలంక, హర్సిలీహిల్స్ లో హోటల్స్‌ ఏర్పాటుచేసేందుకు ఆసక్తి చూపించిన ఒబెరాయ్‌ గ్రూప్,.. పాడేరు పరిసర ప్రాంతాల్లో టూరిజం సెంటర్‌ నిర్వహించేందుకు కూడా తాము ఆసక్తిగా ఉన్నామని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు