ఫేక్‌ ప్రచారంలో టీడీపీ ‘స్కిల్‌’

17 Sep, 2023 03:55 IST|Sakshi

చంద్రబాబు సత్య హరిశ్చంద్రుడంటూ పెయిడ్‌ ప్రమోషన్‌

సోషల్‌ మీడియాలో బాబు అనుకూల బ్యాచ్‌ బుకాయింపు

ప్రజలకు ఫోన్లు, ఐటీ ఉద్యోగుల పేరుతో ఆందోళనలు

ఇందులో బయటి వారే అధికంగా ఉన్నట్లు కథనాలు

స్విగ్గీ కూపన్లు ఇచ్చి తరలించినట్లు విస్తృతంగా వార్తలు

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం పార్టీ పెద్దఎత్తున అబద్ధపు ప్రచారానికి తెరలేపింది. ఆయన అవినీతి స్పష్టంగా కనబడుతుండడంతో ప్రజల్లో ఏమాత్రం మద్దతు లభించడంలేదు. దీంతో ఎల్లో మీడియా, ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న సోషల్‌ మీడియాతోపాటు టీడీపీ శ్రేణులు, రంగంలోకి దిగి చంద్రబాబు సత్యహరిశ్చంద్రుడంటూ ప్రజలను ఏమార్చేందుకు శతవిధాలుగా ప్రయ­త్నిస్తున్నారు.

ఒకవైపు చంద్రబాబు చేసిన అవినీతిపై సీఐడీ స్పష్టమైన ఆధారాలు చూపిస్తున్నా వాటిని పట్టించుకోకుండా.. ఆధారాల్లేవని, చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టారని, దార్శనికుడికి ఇలాంటి పరిస్థితి కల్పించారంటూ సానుభూతి వచ్చేలా బుకాయిస్తూ రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. ఆ పార్టీకి మొదటి నుంచి అలవాటైన పెయిడ్‌ ప్రమో­షన్‌కు తెరలేపారు.

ఇందులో భాగంగా రెండ్రో­జు­లుగా ప్రజలకు అదేపనిగా ఐవీఆర్‌ఎస్‌ ఫోన్‌­కాల్స్‌ వస్తున్నాయి. ‘మచ్చలేని రాజకీయాలకు మారు­పేరైన చంద్రబాబునాయుడు వంటి నిజాయితీ గల నాయకుడిని చేయని తప్పుకు జైల్లో పెట్టారు. ఆయ­నకు అందరూ అండగా నిలవాలి’.. అంటూ 50 సెకన్ల ఫోన్‌కాల్‌ రాష్ట్రంలోని అన్ని మొబైల్‌ యూ­జర్లకు వెళ్లేలా భారీ పెయిడ్‌ ప్రమోషన్‌ చేపట్టారు. 

ఐటీ ప్రొఫెషనల్స్‌ పేరుతో హడావుడి
ఎల్లో మీడియా అయితే అడ్డూఅదుపు లేకుండా చంద్ర­బాబును సమర్థించే పనిలో మునిగిపోయింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు గురించి రకరకాల వ్యక్తులతో మాట్లాడిస్తూ అది నిజంగా అమలు జరిగినట్లు భ్రమ కల్పించే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. ఈ విషయంలో రాష్ట్రంలోని జనం నుంచి స్పందన లేకపోవడంతో ఐటీ ఉద్యోగులను ఉప­యో­గిం­చుకుంటున్నారు. టీడీపీ ఐటీ, ఎన్‌ఆర్‌ఐ విభా­గాలు ప్లాన్‌చేసి హైదరాబాద్‌లో కొందరు ఐటీ ఉద్యోగులను సమీకరించి ఆందోళనలు చేయించారు. కానీ, ఇందులో ఐటీ ఉద్యోగుల కంటే బయటి వ్యక్తులే భారీగా ఉన్నట్లు తేలింది. వారిలో చాలా­మందికి స్విగ్గీ కూపన్లు ఇచ్చి తీసుకొచ్చినట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది.

బెంగళూరులోనూ ఇదే తరహాలో కొందరు ఐటీ ఉద్యోగులతో ఆందోళన చేయించారు. నిజానికి.. చంద్రబాబు అరెస్ట­యితే టీడీపీ శ్రేణులు, నాయకులే పెద్దగా బయటకు రాలేదు. దయచేసి బయటకు రావాలని అచ్చెన్నా­యుడు, యనమల వంటి నేతలు పార్టీ శ్రేణుల్ని టెలీ­­కాన్ఫ­రెన్స్‌లో బతిమాలు­కున్నా ప్రయోజనం లేకుం­డాపోయింది. దీంతో మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యో­గు­లతో టీడీపీ ముఖ్య నేతలు ఆందోళనలు చేయిస్తున్నట్లు తేలింది. దీనికి వారు తెరవెనుక వ్యూహ రచనచేసి అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు. 

పథకం ప్రకారం ఫేక్‌ ప్రచారం..
ఇక టీడీపీ ప్రొఫెషనల్స్‌ విభాగానికి చెందిన తేజశ్విని అనే యువతి చంద్రబాబుకు మద్ద­తుగా విడుదల చేసిన ఒక వీడియోను వైరల్‌ చేశారు. అమరావతి ఉద్యమంలో ఆమె చురు­గ్గా పాల్గొంది. చంద్రబాబు సీఎంగా ఉన్న­ప్పుడు పలు కార్యక్రమాల్లోనూ పాలుపంచు­కుంది. టీడీపీకి సంబంధించి ముఖ్యమైన ప్రతి కార్యక్రమంలో ఆమె పాల్గొంటుంది. ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా ఆమెను ఐటీ ప్రొఫెషనల్‌గా రంగంలోకి దింపి వీడియోలు చేయించి వైరల్‌ చేస్తున్నారు.

ఇలాంటి మరి­కొందరిని టీడీపీ ఒక వ్యూహం ప్రకారం పని­చేయిస్తూ చంద్రబాబు నిజాయితీ­పరుడని కలర్‌ ఇచ్చేందుకు యత్నిస్తున్నారు. ‘స్కిల్‌ డెవ­ల­ ప్‌­మెంట్‌’ను సమర్థించుకుంటూ శుక్రవారం ఆ పార్టీ ఏకంగా ఒక వెబ్‌సైట్‌ను రూపొందించడం విశేషం. వీటన్నింటినీ చూపిస్తూ ‘వీ స్టాండ్‌ విత్‌ చంద్రబాబు’.. పేరుతో సోషల్‌ మీడియాను హోరెత్తిస్తున్నారు. కానీ, సాధా­రణ ప్రజానీకంలో మాత్రం చంద్రబాబు అరె­స్టు వ్యవహారంపై పెద్దగా స్పందన కనిపించడంలేదు. వారి నుంచి ఎలాగైనా సానుభూతి పొందడానికి ఆ పార్టీ అన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలకు దిగింది.  
 

మరిన్ని వార్తలు