మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: బర్డ్ ఫ్లూ నేపథ్యంలో రాష్ట్రంలో పౌల్ట్రీ ఉత్పత్తుల అమ్మకాలపై ఇప్పటి వరకు ఎలాంటి ఆంక్షలు విధించలేదని రాష్ట్ర మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. ఉడికించిన కోడిగుడ్లు, మాంసం తినడం వలన బర్డ్ ఫ్లూ రాదని అందువలన ప్రజలు ఎలాంటి అపోహలకు గురికాకుండా నిరభ్యంతరంగా తినవచ్చునన్నారు. మన రాష్ట్రంలో బర్డ్ ఫ్లూతో ఒక్క పక్షి కూడా మరణించిన దాఖలాలు లేవన్నారు.
వలస పక్షులు, నీటి పక్షులద్వారా ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో వలస పక్షులు, నీటి పక్షులు ఎక్కువగా వచ్చే ప్రాంతాలను మ్యాపింగ్ చేస్తున్నట్టు చెప్పారు. పశువైద్యులు తమ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాలను సందర్శించి అక్కడ ఉన్న కోళ్ల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుండాలని సూచించారు. ఉత్సాహపూరిత వాతావరణంలో కనుమ పండుగను జరుపుకోవాలని మంత్రి అప్పలరాజు మంగళవారం ఓ ప్రకటనలో ప్రజలకు పిలుపునిచ్చారు.