AP: ఉదారంగా వరద సాయం

29 Jul, 2023 04:01 IST|Sakshi

అత్యంత సమర్థంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు కావాలి: సీఎం జగన్‌

అధికార యంత్రాంగం మానవీయ కోణంలో వ్యవహరించాలి

ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితులకు అండగా ఉండాలి

శిబిరాల నుంచి తిరిగి వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు.. వ్యక్తులైతే రూ.1,000 సాయం

కచ్చా ఇళ్లు దెబ్బ తిన్న బాధితులకు రూ.10వేలు అందించాలి.. ఎలాంటి వర్గీకరణ వద్దు

ముంపు ప్రాంతాల్లో 25 కేజీల బియ్యం, కిలో చొప్పున ఉల్లిపాయలు, ఆలూ, కందిపప్పుతోపాటు పామాయిల్‌  

శిబిరాల్లో మంచి సదుపాయాలు.. అధికారులే ఉంటే ఎలా కోరుకుంటారో అలాంటివే కల్పించాలి

సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి

ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి

నిత్యావసరాలు సహా జనరేట్లర్లు లాంటివి సిద్ధంగా ఉంచాలి.. తాగునీటి కొరత లేకుండా జాగ్రత్తలు

ముమ్మరంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు.. ఆరోగ్య శిబిరాలు

విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీల్లో సరిపడా మందులను అందుబాటులో ఉంచాలి

వరద తగ్గగానే పంట నష్టం వివరాలను పారదర్శకంగా నమోదు చేయాలి

వరదలు, సహాయ, పునరావాస చర్యలపై కలెక్టర్లతో సమీక్షలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆదేశాలు 

సాక్షి, అమరావతి: వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలను అత్యంత సమర్థంగా అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదే­శించారు. వరద బాధితులకు మానవీయ కోణంలో సహాయం అందించాలని స్పష్టం చేశారు. ఇలాంటి విపత్తు పరిస్థితుల్లో ఉండాల్సిన దాని కన్నా ఎక్కు­వగా మానవత్వంతో పని చేయాలనే విషయాన్ని అంతా దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. ఒక రూపాయి అదనంగా ఖర్చు అయినా సరే బాధితు­లకు అండగా ఉండాలన్నారు.

కలెక్టర్లు మాకు మంచి చేశారనే మాటే వినిపించాలని,  మన వల్ల జిల్లాకు మంచి జరిగిందని, మంచి కలెక్టర్‌ అనిపించుకునేలా పని చేయాలని సూచించారు. ప్రధానంగా ఐదు జిల్లాల్లో కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలన్నారు. సహాయ శిబి రాల నుంచి బాధితులు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2 వేలు చొప్పున ఇవ్వాలని, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున అందచేయాలని ఆదేశించారు.

కచ్చా ఇళ్లను నష్టపోయిన బాధితులకు రూ.10 వేల చొప్పున సాయం అందించి ఆదుకోవాలని నిర్దేశించారు. శిబిరాల్లో తలదాచుకునే బాధితులకు మంచి సదుపాయాలను కల్పించడంతోపాటు ముంపు ప్రాంతాల్లో బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్‌ పంపిణీ చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, నదుల్లో వరద ప్రవాహం, సహాయ, పునరావాస కార్యక్రమాలపై ముఖ్యమంత్రి జగన్‌ శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే... 

ఐదు జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి
అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం భద్రాచలం వద్ద నీటిమట్టం 49.60 అడుగులు ఉంది. శనివారం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ ప్లో 13 లక్షల క్యూసెక్కులు ఉంది. ఇది రేపటికి (శనివారం) సుమారు 16 లక్షలకు చేరుకుని ఆ తర్వాత క్రమేపీ తగ్గుముఖం పట్టే అవకాశాలున్నట్లు అంచనా. ప్రవాహం 17 లక్షల క్యూసెక్కులు ఉంటే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ప్రస్తుతం రెండు, మూడు ప్రమాద హెచ్చరికల మధ్యలో అంటే 13 – 17 లక్షల క్యూసెక్కుల లోపే ప్రవాహం ఉంటుంది. గతేడాది గోదావరిలో 26 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని చూశాం. 

శిబిరాల్లో మంచి సదుపాయాలు
లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇప్పటికే కొన్ని చోట్ల ఖాళీ చేశారు. 16 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ మేరకు అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరం అనుకుంటే పరిస్థితిని అంచనా వేసి మిగిలిన వారిని కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. బాధితులకు సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలి. శిబిరాల్లో స్వయంగా అధికారులే ఉంటే ఎలాంటి సదుపాయాలను కోరుకుంటారో అలాంటి సదుపాయాలన్నీ కల్పించాలి. ఆ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.

కచ్చా ఇళ్లపై వర్గీకరణే వద్దు..
మరో ముఖ్యమైన అంశం.. కచ్చా ఇళ్ల విషయంలో కలెక్టర్లు మానవీయ ధృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలి. కచ్చా ఇళ్ల బాధితులను సహాయ శిబిరాల నుంచి తిరిగి పంపించేటప్పుడు రూ.10 వేల చొప్పున సాయంగా అందించాలి. అది వారికి తిరిగి కచ్చా ఇంటిని నిర్మించుకునేందుకు, మరమ్మతులు చేసుకునేందుకు  ఉపయోగపడుతుంది. లేదంటే వారు ఎక్కడికి వెళ్లాలో తెలియక అవస్థలు ఎదుర్కొంటారు.

కచ్చా ఇంటి విషయంలో పాక్షికంగా దెబ్బతిందా? లేక పూర్తిగా దెబ్బతిందా? అనే వర్గీకరణే వద్దు. వారు ఉండేదే కచ్చా ఇళ్లు అయినప్పుడు ఇక వర్గీకరణ అనవసరం. అలాంటి వారి జీవితాలపై మరింత భారం పడేలా వ్యవహరించకూడదు. అందుకే మానవీయ దృక్పథంతో ఉండాలని కలెక్టర్లను కోరుతున్నా. ఇలాంటి సమయాల్లో వారికి బాసటగా నిలిచామనే మాట రావాలి. 

బియ్యం, ఉల్లిపాయలు, కందిపప్పు, బంగాళా దుంపలు, పామాయిల్‌.. 
ముంపునకు గురైన ఇళ్లు, వరదనీరు ప్రవహించిన ప్రాంతాల్లో నిత్యావసర సరుకులను ఉచితంగా పంపిణీ చేయాలి. ఉదారంగా నిత్యావసరాలను అందించాలి. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలి. మొత్తంగా బాధితుల పట్ల మరింత ఉదారంగా, మానవతా దృక్ఫథంతో వ్యవహరించాలి. 

సచివాలయాల స్థాయిలో కంట్రోల్‌ రూమ్స్‌
రాష్ట్రంలో నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఇలాంటి పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొంటున్నాం. ఇప్పడు కూడా అప్రమత్తంగా ఉండాలి. కంట్రోల్‌ రూమ్స్‌కు సంబంధించి జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఏర్పాటు చేయాలి. సచివాలయాల స్థాయిలో కూడా కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటు చేయండి. సచివాలయాల సిబ్బందితో పాటు వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలి.

ముంపు గ్రామాలు, లంకలపై ప్రత్యేక దృష్టి
ముంపు బాధిత గ్రామాలు, లంకలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఆయా ప్రాంతాల్లో నిత్యావసర వస్తువులు సరిపడా నిల్వ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిపై మరోసారి సమీక్షించి సిద్ధంగా ఉండాలి. లంక గ్రామాలలో జనరేటర్లు లాంటి వాటిని కూడా సిద్ధం చేసుకోండి.

తాగునీటి కొరత లేకుండా..
తాగునీటి కొరత లేకుండా, సరఫరా వ్యవస్థలకు ఆటంకాలు కలగకుండా తగిన చర్యలు చేపట్టాలి. తాగునీటి ప్యాకెట్లను సిద్ధం చేసుకోండి. గ్రామాల్లో పారిశుద్ధ్య కార్యక్రమాలను   ముమ్మరంగా చేపట్టండి. బ్లీచింగ్, ఫినాయిల్‌ లాంటివి సిద్ధంగా ఉంచాలి.

ఆరోగ్య శిబిరాల ఏర్పాటుపై కూడా ప్రత్యేక ధ్యాస పెట్టాలి. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలలో సరిపడా మందులను ఉంచాలి. వీటిపై అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించుకోవాలి. వరదల కారణంగా పాము కాట్లు లాంటి ఘటనలు జరిగితే అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలి.

వరద తగ్గాక పంట నష్టం నమోదు
వరద నీరు తగ్గాక పంట నష్టం వివరాలను నమోదు చేసుకుని రైతులకు బాసటగా నిలవాలి. అత్యంత పారదర్శక పద్ధతిలో ఎన్యుమరేషన్‌ జరగాలి. వరద ప్రభావిత ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వైద్యం, మంచి సదుపాయాలు ఉన్నచోటకు ముందే తరలించాలి. ప్రతి విషయంలోనూ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉందన్న సందేశాన్ని అందించాలి. 

సమావేశంలో హోం, విపత్తు నిర్వహణ శాఖల మంత్రి తానేటి వనిత, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి. సాయిప్రసాద్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ వై.శ్రీలక్ష్మి, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ గోపాలకృష్ణ ద్వివేది, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, పౌరసరఫరాలశాఖ కమిషనర్‌ హెచ్‌.అరుణ్‌కుమార్, ఆర్‌ అండ్‌ బీ కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌ పి.కోటేశ్వరరావు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ ఏ.సూర్యకుమారి, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జి.లక్ష్మీషా, ఏపీ విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు