మాల్దీవులకు టికెట్‌ బుకింగ్స్‌ నిలిపేసిన ప్రముఖ సంస్థ

8 Jan, 2024 10:23 IST|Sakshi

భారత్‌పై తీవ్రంగా స్పందించిన మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో దేశీయ ప్రయాణ సంస్థ ఈజ్‌మైట్రిప్‌ ఎక్స్‌ వేదికగా కీలక నిర్ణయం ప్రకటించింది. ఆ దేశానికి ఫ్లైట్ బుకింగ్స్‌ నిలిపివేయాలని సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన నిషాంత్ పిట్టి ఎక్స్‌లో పోస్టు చేశారు. ఈజ్‌మైట్రిప్ సంస్థ దిల్లీ కేంద్రంగా సేవలు అందిస్తోంది. ఇది ఆన్‌లైన్‌ టికెట్‌ బుకింగ్‌ సేవలందిస్తోంది. నిషాంత్‌ పిట్టి, రికాంత్‌ పిట్టి, ప్రశాంత్‌ పిట్టి ఈ సంస్థను 2008లో ప్రారంభించారు.

భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇటీవల లక్ష్యదీప్‌ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆయన పోస్ట్‌ చేసిన వీడియోపై మాల్దీవులు మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆ దేశ ప్రభుత్వం వారిపై వేటు వేసింది. ముగ్గురు మంత్రులను సస్పెండ్‌ చేసింది. 

లక్ష్యదీప్ బీచ్‌లో మోదీ నడుస్తున్న ఓ వీడియోపై మాల్దీవులు మంత్రి మంతత్రి మరియం షియునా సోషల్‌ మీడియా వేదికగా స్పందిస్తూ.. ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ దేశపు తోలు బొమ్మ అని అనుచిత  కామెంట్‌ చేశారు. ఆమె వ్యాఖ్యలకు మంత్రులు మల్షా షరీఫ్‌, అబ్దుల్లా మజూం మాజిద్‌ మద్దతు పలికారు. దీంతో ఒక్కసారిగా ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె వ్యాఖ్యలను భారత్‌లోని పలువురు తీవ్రంగా ఖండించారు. 

ఇదీ చదవండి: బీఐఎస్​ గుర్తింపు​ తప్పనిసరి.. ఏ ఉత్పత్తులకంటే..

పర్యాటక రంగంలో మాల్దీవులతో పోలిస్తే లక్షద్వీప్‌ ఎన్నో సమస్యలను ఎదుర్కొంటోందని మంత్రులు విమర్శించారు. ‘పర్యాటకంలో మాతో పోటీ పడాలన్న ఆలోచన భ్రమే (ప్రధాని మోదీ పర్యటన వీడియోను ట్యాగ్‌ చేస్తూ). మా దేశం అందించే సేవలను ఎలా అందించగలరు? పరిశుభ్రంగా ఎలా ఉంచగలరు? అక్కడి గదుల్లో వచ్చే వాసన అతి పెద్ద సమస్య’ అని మంత్రి మాజిద్‌ ట్వీట్‌ చేశారు. ఆయన ట్వీట్‌పై భారత నెటిజన్లు మండిపడ్డారు. పర్యాటకంగా ఆ దేశాన్ని బహిష్కరించాలని డిమాండు చేశారు.

>
మరిన్ని వార్తలు