సీఎఫ్‌వో జతిన్ దలాల్‌: విప్రోలో రాజీనామా.. కాగ్నిజెంట్‌లో ప్రత్యక్షం!

28 Sep, 2023 21:34 IST|Sakshi

విప్రో (Wipro) మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జతిన్ దలాల్‌ (Jatin Dalal)ను తమ సీఎఫ్‌వోగా నియమించుకుంది ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ (Cognizant). ఆయన ఇటీవలే విప్రో సంస్థలో సీఎఫ్‌వోగా రాజీనామా చేశారు.

(లెనోవో ఆఫీసుల్లో ఐటీ సోదాలు.. ఉద్యోగుల ల్యాప్‌టాప్‌లూ తనిఖీ)

ఇన్ఫోసిస్ మాజీ ప్రెసిడెంట్ రవి కుమార్ ఎస్‌ కాగ్నిజెంట్‌ సీఈవోగా గత జనవరిలో బాధ్యతలు చేపట్టిన నుంచి ఆ కంపెనీలో జతిన్‌ దలాల్ రెండవ హై ప్రొఫైల్ నియామకం. 2024 ప్రారంభంలో పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎఫ్‌వో జాన్ సీగ్మండ్ నుంచి జతిన్‌ దలాల్ బాధ్యతలు స్వీకరిస్తారని కాగ్నిజెంట్‌  ఒక ప్రకటనలో తెలిపింది.

కంపెనీలు మారుతున్న టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లు
ప్రముఖ భారతీయ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ సీఈఓ రాజేష్ గోపీనాథన్ గత మార్చిలో వైదొలిగారు. ఆయన స్థానంలో టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్‌లలో పనిచేసిన మోహిత్ జోషిని సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్‌గా నియమించింది టీసీఎస్‌. వచ్చే డిసెంబర్‌లో ఆయన విధుల్లో చేరన్నారు.

(ఐటీ పరిశ్రమకు చల్లని కబురు.. మాంద్యం భయంపై సీఈవో ఊరట)

ఇక జతిన్‌ దలాల్ విప్రోలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు. ట్రెజరీ కార్యకలాపాలలో మేనేజర్‌గా చేరిన ఆయన ప్రెసిడెంట్, సీఎఫ్‌వో వరకూ ఎదిగారు. ఆయన నిష్క్రమించిన మరుసటి రోజే విప్రో షేర్లు దాదాపు 3 శాతం పడిపోయాయి.

2015లో విప్రో సీఎఫ్‌వో అయిన జతిన్‌ దలాల్.. కంపెనీ సీఈవో థియరీ డెలాపోర్టేతో కలిసి కోవిడ్‌ సమయంలో కంపెనీని విజయవంతంగా నడిపించారు. డిజిటల్‌ సేవలకు డిమాండ్‌ పెరగడంతో 2020, 2021 సంవత్సరాల్లో కంపెనీ షేర్లు వరుసగా 57 శాతం, 85 శాతం పెరిగాయి. అదే కాలంలో భారత నిఫ్టీ IT ఇండెక్స్‌లో 55 శాతం, 60 శాతం వృద్ధిని సాధించింది.

మరిన్ని వార్తలు