‘మీలో స్కిల్స్‌ ఉన్నాయా’.. కొత్త ఏడాది దిగ్గజ సంస్థల్లో నియామకాల జోరు!

12 Dec, 2023 16:27 IST|Sakshi

చదువు పూర్తి చేసుకుని కొత్తగా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నారా? లేదంటే ఇప్పటికే ఉద్యోగం చేస్తూ మరో సంస్థలో జాబ్‌ కోసం ప్రయత్నిస్తున్నారా? అయితే, మీకో శుభవార్త!. మార్కెట్‌లో పెరిగిపోతున్న డిమాండ్‌కు అనుగుణంగా భారత్‌కు చెందిన టెక్నాలజీ,మార్కెటింగ్‌తో పాటు ఇతర విభాగాలకు చెందిన కంపెనీలు ఉద్యోగుల్ని భారీ ఎత్తున నియమించుకోనున్నట్లు తెలుస్తోంది. 

ఇటీవల, రిక్రూట్‌మెంట్‌ కంపెనీ ‘మ్యాన్‌పవర్‌ గ్రూప్‌’ ఎంప్లాయిమెంట్‌ అవుట్‌ లుక్‌ సర్వేని విడుదల చేసింది. ఆ సర్వేలో సుమారు 3,100కి పైగా రకరకాల వ్యాపారాలు నిర్వహిస్తున్న కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. 

37శాతం నియామకాలు
జనవరి - మార్చి 2024 సమయానికి ఆయా కంపెనీలు ఎంత మంది ఉద్యోగుల్ని తొలగించనున్నాయి. ఎంతమందిని నియమించుకోనున్నాయనే విషయంపై ఆరా తీసింది. ఈ సర్వేలో 37 శాతం మేర కంపెనీలో ఉద్యోగుల్ని హైయర్‌ చేసుకోనున్నాయి. గత ఏడాది పోలిస్తే నియమాకం 5 శాతం ఎక్కువగా ఉంది. 

సర్వే ప్రకారం... 37 శాతంతో భారత్‌, నెదర్లాండ్‌లు కొత్త ఉద్యోగ అవకాశాలు కల్పించే దేశాల జాబితాలో ప్రథమ స్థానంలో నిలిచాయి. ఆ తర్వాతి స్థానాల్లో 35 శాతంతో కోస్టారికా- అమెరికా, 34 శాతంతో మెక్సికో 3వ స్థానంలో నిలిచాయి. ప్రపంచ వ్యాప్తంగా సగటున 26 శాతం మంది మాత్రమే ఉపాధి పొందనున్నారు. 

ఈ రంగాల్లో నియామకాల జోరు
ఫైనాన్షియల్‌, రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో నియామకాల జోరు కొనసాగుతుంది. ఆ తర్వాతి స్థానాల్లో టెక్నాలజీ, కన్జ్యూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ విభాగాలున్నాయి. ఐటీ కంపెనీలు 44 శాతం, ఫైనాన్షియల్‌ అండ్‌ రియల్‌ ఎస్టేట్‌ రంగాల్లో 45 శాతం హైయర్‌ చేసుకోనుండగా కన్జ్యూమర్‌ గూడ్స్‌ అండ్‌ సర్వీస్‌ రంగంలో 42 శాతం, ఎనర్జీ, యుటిలిటీస్‌లో 28 శాతం జరగనున్నట్లు సర్వే తేల్చి చెప్పింది.   

టాలెంట్‌ గుర్తించ లేక
జపాన్‌లో 85 శాతం కంపెనీలు ఆయా విభాగాల్లో పనిచేసేందుకు అవసరమయ్యే నిపుణుల్ని గుర్తించడంలో విఫలమైనట్లు మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ సర్వే హైలెట్‌ చేసింది. ఆ తర్వాత జర్మనీ, గ్రీస్‌, ఇజ్రాయెల్‌ 82 శాతం, భారత్‌ 81 శాతంతో కొనసాగుతున్నాయి. 

ఈ రంగాల్లోని ఉద్యోగాలకు భారీ డిమాండ్‌
ముఖ్యంగా ట్రాన్స్‌పోర్ట్‌, లాజిస్టిక్‌, ఆటోమొటీవ్‌ విభాగాలు ఉండగా.. వాటి తర్వాతి స్థానంలో ఐటీ విభాగం ఉంది. సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు ఉన్న అభ్యర్ధుల్ని గుర్తించి వారిని ఆకట్టుకునేలా జీతాలు పెంచుతూ వారితో పనిచేయించుకుంటున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటి అండ్‌ డేటా, సేల్స్ అండ్‌ మార్కెటింగ్, ఇంజినీరింగ్, ఆపరేషన్స్ అండ్‌ లాజిస్టిక్స్,హెచ్‌ఆర్‌లలో ఉద్యోగులకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఆ రంగాల్లో స్కిల్ ఉంటే జాబ్‌ త్వరగా సంపాదించవచ్చని మార్కెట్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు