ఐదు రోజుల్లో రూ.20 వేలకోట్ల సంపాదన..!

12 Dec, 2023 16:41 IST|Sakshi

గడచిన వారంలో స్టాక్‌మార్కెట్ల ర్యాలీతో పాటు అదానీ గ్రూప్ లిస్టెడ్ కంపెనీలు భారీగా పెరిగాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు లాభాలను ఆర్జించారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో కుప్పకూలిన స్టాక్‌లు తిరిగి మార్కెట్‌ జీవితకాల గరిష్ఠాలను తాకింది. దాంతో అదానీ స్టాక్‌ల్లో సైతం మంచి ర్యాలీ కనిపించింది.

కేవలం ఐదు రోజుల్లోనే అదానీ స్టాక్స్ దాదాపు 65 శాతం పెరగడంతో అటు గ్రూప్‌ కంపెనీలకు, ఇటు మదుపరులకు కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. అదానీ గ్రూప్ కంపెనీల పెరుగుదల కారణంగా.. అందులో పెద్ద ఇన్వెస్టర్లుగా ఉన్న ఎల్ఐసీ, జీక్యూజీ పార్ట్‌నర్స్ రూ.19,500 కోట్లకు పైగా లాభాన్ని సంపాదించారు. సెప్టెంబర్ త్రైమాసికం డేటా ప్రకారం జీక్యూజీ పార్ట్‌నర్స్ అదానీ గ్రూప్‌లోని ఆరు కంపెనీల్లో వాటాలను కలిగి ఉన్నారు.

జీక్యూజీ పెట్టుబడుల విలువ 28 శాతం అంటే రూ.7,287 కోట్లు పెరిగి రూ.32,887 కోట్లకు చేరింది. అదానీ గ్రూప్‌లోని ఏడు షేర్లలో ఎల్‌ఐసీ వాటాల విలువ రూ.12,234 పెరిగి రూ.58,017 కోట్లకు ఎగబాకింది. హిండెన్ బర్గ్ ఆరోపణల వల్ల ఏర్పడిన సంక్షోభం సమయంలో జీక్యూజీ అదానీకి చెందిన నాలుగు కంపెనీల్లో రూ.15,446 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వీటిలో అదానీ పోర్ట్స్, అదానీ గ్రీన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, అదానీ ట్రాన్స్‌మిషన్ కంపెనీలు ఉన్నాయి. దీని తర్వాత అదానీ పవర్, అంబుజా సిమెంట్స్ కంపెనీల్లో కూడా వాటాల కొనుగోలు చేసింది.

ఇదీ చదవండి: దిగ్గజ టెక్‌ కంపెనీ సీఎఫ్‌ఓ రాజీనామా.. ఎందుకంటే..

ఇక బీమా దిగ్గజం ఎల్ఐసీ ఏసీసీ మినహా అన్ని అదానీ కంపెనీల్లో వాటాలు కలిగి ఉంది. గతవారం అమెరికా హిండెన్ బర్గ్ ఆరోపణలను తోసిపుచ్చుతూ.. అదానీకి క్లీన్ చిట్ ఇవ్వటంతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. అదానీకి చెందిన పది లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.3.14 లక్షల కోట్లు పెరిగి మెుత్తంగా రూ.14.36 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అదానీ టోటల్ గ్యాస్ షేర్లు అత్యధికంగా 65 శాతం పెరుగుదలను నమోదు చేశాయి.

>
మరిన్ని వార్తలు