ఇన్ఫోసిస్‌కి భారీ షాక్‌! రూ.12 వేల కోట్ల డీల్‌ క్యాన్సిల్‌

23 Dec, 2023 19:37 IST|Sakshi

దేశీయ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్‌కి భారీ షాక్‌ తగిలింది. గ్లోబల్‌ కంపెనీతో చేసుకున్న సుమారు రూ.12 వేల కోట్ల డీల్‌ క్యాన్సిల్‌ అయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ కోసం కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (MOU) సదరు కంపెనీ రద్దు చేసు​కుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. 

ఈ భారీ ఒప్పందం ఈఏడాది సెప్టెంబర్‌లో ఖరారైంది. 15 సంవత్సరాల కాలానికి చేసుకున్న ఈ డీల్‌ ప్రారంభంలోనే ముగిసిపోవడం ఐటీ సేవల రంగంలో క్లయింట్‌ల డిమాండ్, సాంకేతిక బడ్జెట్‌లలో పెరుగుతున్న అనిశ్చితిని తెలియజేస్తోంది.

ఇదీ చదవండి: ...అలా విజయం సాధించినట్లు చరిత్రలో లేదు

“గ్లోబల్ కంపెనీతో ఎంఓయూకి సంబంధించి 'కంపెనీ అప్‌డేట్' పేరుతో 2023 సెప్టెంబర్ 14 నాటి ఇన్ఫోసిస్ ప్రకటనకు ఇది కొనసాగింపు. గ్లోబల్ కంపెనీ ఇప్పుడు ఎంవోయూను రద్దు చేయడానికి నిర్ణయించింది. దీంతో ఇరు పక్షాలు మాస్టర్ అగ్రిమెంట్‌ను అనుసరించడం లేదు” అని కంపెనీ డిసెంబర్‌ 23న ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

సీఎఫ్‌వో రాజీనామా చేసిన రెండు వారాల్లోనే..
కంపెనీ సీఎఫ్‌వో నీలాంజన్ రాయ్ ఆకస్మికంగా వైదొలిగిన రెండు వారాల లోపే ఈ భారీ డీల్‌ క్యాన్సిల్‌ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్‌ మెరుగైన డిజిటల్‌ సేవలు, ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అందించడానికి గ్లోబల్‌ కంపెనీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు సెప్టెంబర్ 14న ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు