కిరణ్‌ మజుందార్‌ షాకి కరోనా పాజిటివ్‌

18 Aug, 2020 08:15 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: బయోకాన్‌ వ్యవస్థపాపకురాలు, ఎండీ కిరణ్ మజుందార్ షాకి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. ‘కరోనా కేసుల్లో నేను కూడా చేరాను. కానీ నాకు లక్షణాలు తక్కువగానే ఉన్నాయి... త్వరలోనే కరోనా నన్ను వదిలేస్తుందనే ఆశతో ఉన్నాను’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. మజుందార్‌ షాకు కరోనా అని తెలిసి చాలా మంది ఆమె త్వరగా కోలుకోవాలని ట్విట్‌ చేశారు. వీరిలో కాంగ్రెస్‌ ఎంపీ శశి థరూర్‌ కూడా ఉన్నారు. ‘ఇలాంటి వార్త విన్నందుకు చాలా బాధగా ఉంది. మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ శశి థరూర్‌ ట్విట్‌ చేశారు. (ప్యాసింజర్‌ రైళ్లను ఇప్పట్లో నడపలేం)
 

కిరణ్ మజుందార్ షాకు చెందిన బెంగళూరు బయోఫార్మాస్యూటికల్ కంపెనీ బయోకాన్, కోవిడ్-19 చికిత్స కోసం సోరియాసిస్‌కు వాడే ఇటోలిజుమాబ్ అనే ఔషధాన్ని తిరిగి తయారు చేయడానికి కృషి చేస్తోంది. గత నెలలో డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఐ) అత్యవసర పరిస్థితుల్లో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి గాను చర్మ వ్యాధి సోరియాసిస్‌ను నయం చేయడానికి ఉపయోగించే ఇటోలిజుమాబ్‌కు అనుమతి ఇచ్చింది. అయితే దీనిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. కేవలం నాలుగు కోవిడ్‌ కేంద్రాలలో.. 30 మంది రోగులపై మాత్రమే క్లినికల్ ట్రయల్స్ జరిపి.. దాని ఆధారంగా కోవిడ్-19 చికిత్సకు ఇటోలిజుమాబ్‌కు అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. కానీ కోవిడ్-19 పై నేషనల్ టాస్క్ ఫోర్స్ డీజీసీఐ అనుమతితో సంబంధం లేకుండా క్లినికల్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్స్‌లో ఇటోలిజుమాబ్ ఔషధాన్ని చేర్చాలని నిర్ణయించింది.

మరిన్ని వార్తలు