Budget 2024: ఆమె పద్దు ఆరోసారి..

26 Jan, 2024 19:29 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రికార్డ్‌ సృష్టించబోతున్నారు. ఈ ఫిబ్రవరి 1వ తేదీన ఆమె వరుసగా ఆరో బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. వీటిలో ఐదు వార్షిక బడ్జెట్‌లు కాగా ఇప్పుడు ప్రవేశపెట్టేది మధ్యంతర బడ్జెట్‌. ఇప్పటివరకు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు.

నిర్మలమ్మ ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా వరుసగా ఐదు బడ్జెట్‌లను సమర్పించిన మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, పి. చిదంబరం, యశ్వంత్ సిన్హా వంటి మాజీ ఆర్థిక మంత్రుల రికార్డులను అధిగమించనున్నారు. 

ఆయన పదిసార్లు 
అత్యధిక సార్లు బడ్జెట్‌లను ప్రవేపెట్టిన రికార్డ్‌ మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్‌కి ఉంది. మొత్తంగా ఆయన పది బడ్జెట్‌లను సమర్పించారు. ఆర్థిక మంత్రిగా మొరార్జీ దేశాయ్ 1959-1964 మధ్య ఐదు వార్షిక బడ్జెట్‌లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను సమర్పించారు. ఏ ఆర్థిక మంత్రికి అయినా గరిష్టంగా ఒక మధ్యంతర బడ్జెట్‌ సహా వరుసగా ఆరు బడ్జెట్‌లను ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వంలోనూ మరో పర్యాయం ఆర్థిక మంత్రిగా కొనసాగితే మరిన్ని బడ్జెట్లు సమర్పించే వీలుంటుంది.

ఫిబ్రవరి 1న నిర్మలా  సీతారామన్ సమర్పించనున్న 2024-25 మధ్యంతర బడ్జెట్ సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిర్దిష్ట మొత్తాలను ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఓట్-ఆన్-అకౌంట్‌గా ఉంటుంది. పార్లమెంటరీ ఎన్నికలు జరగనున్నందున ఈ మధ్యంతర బడ్జెట్‌లో పెద్ద విధానపరమైన మార్పులు ఉండకపోవచ్చు. ఇదే విషయాన్ని గత నెలలో జరిగిన ఒక పరిశ్రమ ఈవెంట్‌లో నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మధ్యంతర బడ్జెట్‌లో ఎటువంటి "అద్భుతమైన ప్రకటన" ఉండదని, ఇది సాధారణ ఎన్నికలకు ముందు ఓటు-ఆన్-అకౌంట్ మాత్రమే అని అన్నారు.

whatsapp channel

మరిన్ని వార్తలు