ఆఫీస్‌ స్థలాల లీజ్‌కు కంపెనీల ఒప్పందాలు

25 Mar, 2024 14:54 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఆఫీస్‌ స్థలాలకు డిమాండ్‌ పెరుగుతోంది. కొవిడ్‌ భయాలు తొలగి క్రమంగా దాదాపు చాలా కంపెనీలు వర్క్‌ఫ్రంహోం కల్చర్‌కు స్వస్తి పలుకుతాన్నాయి. ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయాలని కోరుతున్నాయి. దాంతో దేశీయ, అంతర్జాతీయ కార్పొరేట్‌ సంస్థలు కొత్తగా కార్యాలయాలను ఏర్పాటు చేస్తుండటంతో ఆఫీస్‌ స్థలాలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. 

ఈ జనవరి-మార్చి మధ్యకాలంలో ఆరు మెట్రో నగరాల్లో ఆఫీస్‌ స్థలాల లీజులో 35 శాతం వృద్ధి నమోదైందని రియల్‌ ఎస్టేట్‌ కన్సల్టెంట్‌ కొల్లియర్స్‌ ఇండియా తాజాగా వెల్లడించింది. దేశవ్యాప్తంగా టాప్‌-6 నగరాలైన బెంగళూరు, దిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, హైదరాబాద్‌, పుణెలో సమీప భవిష్యత్తులో 13.6 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఆఫీస్‌ స్థలాన్ని లీజుకు తీసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. ఏడాది క్రితం ఇదే త్రైమాసికంలో ఇది 10.1 మిలియన్‌ చదరపు అడుగులుగా ఉండడం గమనార్హం.

హైదరాబాద్‌తోపాటు ముంబై, బెంగళూరు, దిల్లీ-ఎన్‌సీఆర్‌లలో ఆఫీస్‌ స్థలాల లీజు పెరగగా, చెన్నైలో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 2.9 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకున్నారని నివేదిక వెల్లడించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు వెల్లడించింది. వచ్చే త్రైమాసికానికిగాను ఇప్పటికే కార్పొరేట్‌ సంస్థలు తమ లీజుకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకున్నాయని తెలిపింది. 

నివేదికలోని కొన్ని ప్రధానాంశాలు

ముంబైలో ఆఫీస్‌ స్థలం డిమాండ్‌ 90 శాతం ఎగబాకి 1 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 1.9 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకోనుంది. బెంగళూరులో కార్యాలయాల స్థలం 25 శాతం పెరిగి 4 మిలియన్‌ చదరపు అడుగులకు చేరుకోనుంది. గతేడాది ఇది 3.2 మిలియన్‌ చదరపు అడుగులుగా నమోదైంది. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో 2.5 మిలియన్‌ చదరపు అడుగుల స్థలం లీజుకు తీసుకునే అవకాశం ఉంది. క్రితం ఏడాది కంటే ఇది 14 శాతం అధికం. చెన్నైలో ఆఫీస్‌ స్పేస్‌ డిమాండ్‌ 6 శాతం తగ్గి 1.6 మిలియన్‌ చదరపు అడుగుల నుంచి 1.5 మిలియన్‌ చదరపు అడుగులకు తగ్గింది.

ఇదీ చదవండి: భారత్‌లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు

Election 2024

మరిన్ని వార్తలు