బంగాళ దుంప పిండి, ఉప్పుతో అంగారకుడిపై ఇళ్లు కట్టుకోవచ్చు.. అసలు మ్యాటర్ ఇదే!

9 Apr, 2023 12:16 IST|Sakshi

భూమిపై రోజురోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతోంది. ఇలా ఇంకొన్ని రోజులు పోతే ఇక్కడి వనరులు కూడా సరిపోని పరిస్థితులు తలెత్తుతాయి. ఈ క్రమంలోనే ఇతర గ్రహాలపై మానవ నివాసం కోసం అన్వేషణ సాగుతోంది. అయితే భూమి కాకుండా మానవులు నివసించడానికి అనువుగా ఉండే మరో గ్రహం ఏదైనా ఉందా అంటే.. వెంటనే వచ్చే సమాధానం అంగారకుడు (Mars). మరి ఒకవేళ మార్స్‌పై నివాసాలు ఏర్పాటు చేసుకుంటే ఇంటి నిర్మాణం ఎలా చేపట్టాలి? ఇలా అనేక అనుమానాలు వ్యక్త మయ్యాయి.

ఇందుకోసం వ్యోమగాముల రక్తం, మూత్రాన్ని ఇందుకోసం వాడుకోవచ్చని సైంటిస్ట్‌ల పరిశోధనల్లో తేలింది. వ్యోమగాములందరూ రక్తాన్ని ఇవ్వటానికి అంగీకరించకపోవచ్చు కూడా. దీన్ని దృష్టిలో పెట్టుకునే  అదే అంతరిక్ష నిర్మాణాలకు ఉపయోగపడే దృఢమైన ఇటుకలను ఇటీవల మాంచెస్టర్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రూపొందించారు. వీటి తయారీకి వారు వాడిన పదార్థాలను తెలుసుకుంటే, ఎవరైనా ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టాల్సిందే! సాధారణ కాంక్రీట్‌ దారుఢ్యం గరిష్ఠంగా 70 ఎంపీఏ వరకు ఉంటే, మాంచెస్టర్‌ శాస్త్రవేత్తలు తయారు చేసిన ఈ ఇటుకల దారుఢ్యం 72 ఎంపీఏ వరకు ఉండటం విశేషం.

అంతరిక్ష ధూళి, బంగాళ దుంపలు, ఉప్పు సహా వివిధ పదార్థాల సమ్మేళనంతో తయారు చేసిన కాంక్రీట్‌ తరహా పదార్థాన్ని ఉపయోగించి ఈ ఇటుకలను తయారు చేశారు. ఇటుకల తయారీకి ఉపయోగించిన ఈ పదార్థానికి వారు ‘స్టార్‌క్రీట్‌’గా నామకరణం చేశారు. దీనిని ‘కాస్మిక్‌ కాంక్రీట్‌’గా కూడా అభివర్ణిస్తున్నారు.

అత్యంత దృఢమైన కాంక్రీట్‌ తయారీలో భాగంగా వీరు చంద్రుడి ధూళిని ఉపయోగించి తయారు చేసిన ఇటుకల దారుఢ్యమైతే ఏకంగా 91 ఎంపీఏ పైగానే ఉంది. తమ ప్రయోగాలు విజయవంతమైతే, ప్రపంచంలోనే అత్యంత దృఢమైన కాంక్రీట్‌ను రూపొందించగలమని మాంచెస్టర్‌ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు