ఆహా సీఈవోగా రవికాంత్‌ సబ్నవీస్‌

28 Mar, 2023 06:25 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఓటీటీ ప్లాట్‌ఫాం ‘ఆహా’ సీఈవోగా రవికాంత్‌ సబ్నవీస్‌ నియమితులయ్యారు. ఇప్పటిదాకా ఆ స్థానంలో ఉన్న అజిత్‌ ఠాకూర్‌ .. బోర్డ్‌ డైరెక్టరుగా పదోన్నతి పొందారు. సబ్నవీస్‌ నియామకం తక్షణం అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. ఆయన అపార అనుభవం ఆహా వృద్ధికి తోడ్పడగలదని సంస్థ ప్రమోటర్‌ రాము రావు జూపల్లి తెలిపారు.

కంపెనీకి ప్రత్యేక గుర్తింపు తేవడంలో అజిత్‌ కీలక పాత్ర పోషించారని, ఇకపైనా ఆహా స్టూడియో మొదలైన అంశాల్లో ఆయన మార్గదర్శకత్వం వహిస్తారని ఆహా ప్రమోటర్‌ అల్లు అరవింద్‌ పేర్కొన్నారు. విశిష్టమైన ప్రోగ్రామ్‌లతో వీక్షకులకు ఆహాను మరింత చేరువ చేసేందుకు ఆహా బృందం కృషి చేస్తుందని సబ్నవీస్‌ చెప్పారు. స్టార్‌ టీవీ, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్, హెయిన్జ్‌ ఇండియా వంటి పలు రంగాల సంస్థల్లో వివిధ హోదాల్లో సబ్నవీస్‌కు 30 ఏళ్ల పైగా అనుభవం ఉంది.

మరిన్ని వార్తలు