తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో జియో ట్రూ5జీ సేవ‌లు  షురూ

9 Jan, 2023 20:28 IST|Sakshi

యూజ‌ర్ల‌కు ‘జియో వెల్కం ఆఫ‌ర్‌’  1 జీబీఎఎస్‌+ వేగంతో అప‌రిమిత 5జీ డేటా 

విజయవాడ: రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తిరుపతి, నెల్లూరు పట్టణాల్లో సోమవారం లాంఛనంగా ప్రారంభించింది. ఇప్పటికే తిరుమ‌ల‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరు పట్టణాల్లో రిల‌య‌న్స్ జియో త‌న ట్రూ 5జీ సేవ‌ల‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్‌లో నెట్వర్క్ కోసం జియో ఇప్ప‌టికే రూ. 26,000 కోట్లతోపాటు  అదనంగా 5జీనెట్ వర్క్ ను ఏర్పాటు చేయడానికి  మరో రూ. 6,500 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రతి పట్టణం, తాలూకా, మండలం, గ్రామాల్లో జియో ట్రూ 5జీ సేవలు అందుబాటులోకి వస్తాయి. 

జియో ట్రూ 5జీ సేవల ప్రారంభంతో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ టెలికమ్యూనికేషన్ నెట్ వర్క్ పొందడమే కాకుండా, ఇ-గవర్నెన్స్, విద్య, ఆరోగ్య సంరక్షణ, ఐటీ, ఎస్ఎమ్ఇ వ్యాపార రంగాలలో వృద్ధి అవకాశాలకు తలుపులు తెరుస్తుంది. జియో ట్రూ 5జీ పౌరులు, ప్రభుత్వం రియల్ టైమ్ ప్రాతిపదికన కనెక్ట్ అయ్యేందుకు వీలు కల్పిస్తుంది.  చిట్ట‌చివ‌రి అడుగు వ‌ర‌కు ప్రభుత్వ పథకాల అమలు సామర్థ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. 


ఆంధ్రప్రదేశ్‌లో జీయో ట్రూ 5జీని విస్తరించడం పట్ల సంతోషంగా ఉందని ఏపీ జియో సీఈఓ మందపల్లి మహేష్ కుమార్‌ తెలిపారు. జియో ట్రూ 5జీ నెట్ వర్క్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తుందనీ, జియో ఇంజనీర్లు ప్రతి భారతీయుడికి ట్రూ-5జీ ప్రయోజనాలను అందించడానికి 24 గంటలు పనిచేస్తున్నామన్నారు.  ఈ సందర్భంగా  ఆంధ్రప్రదేశ్ ను డిజిటలైజ్ చేసి ముందుకు తీసుకెళ్లడంలో సహకరించిన రాష్ట్ర  ప్రభుత్వానికి ఆయన  కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు