కొడుకు కళ్లెదుటే తండ్రి ఉరేసుకుని

15 Mar, 2024 03:27 IST|Sakshi

ఆర్థిక ఇబ్బందులు భరించలేక.. మెదక్‌ జిల్లాలో దారుణం

కౌడిపల్లి (నర్సాపూర్‌): ఆర్థిక ఇబ్బందులు భరించలేక నాలుగేళ్ల కన్నకొడుకు కళ్ల ముందే తండ్రి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన మెదక్‌ జిల్లా కౌడిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్‌ఐ రంజిత్‌కుమార్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నవీన్‌(34), అతని తల్లి లలిత వ్యవసాయం, కూలీ పనులు చేసుకొని జీవనం సాగిస్తున్నారు.  నవీన్‌ భార్య.. కుమారుడు లోకేష్‌ పుట్టిన తర్వాత వీరికి దూరంగా వెళ్లిపోయింది.

కాగా, ఇటీవల లలిత కాలుకు గాయమై తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తొలుత మెదక్‌లో వైద్యం చేయించారు. అక్కడ తగ్గకపోవడంతో వైద్యులు.. గాంధీ ఆసుపత్రికి రెఫర్‌ చేశారు. కొన్ని రోజులుగా చికిత్స పొందుతోంది. కాలుకు ఇన్‌ఫెక్షన్‌ అయిందని, తొలగించాల్సి వస్తుందని వైద్యులు చెప్పారు. ఆసుపత్రి ఖర్చులు, కుటుంబ అవసరాలకు డబ్బులు లేకపోవడంతో నవీన్‌ అప్పులు చేశాడు. దీంతో రోజురోజుకూ ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి.

ఈ క్రమంలో ఉదయం నవీన్‌ తన కొడుకు లోకేష్‌తో కలిసి చింతకాయలు తెంపుకొద్దామని తీసుకెళ్లాడు. గ్రామ సమీపంలో కొడుకు చూస్తుండగానే.. చింతచెట్టు ఎక్కి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బాలుడు ఏడుస్తుండటంతో అటుగా వెళుతున్న గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.

Election 2024

మరిన్ని వార్తలు