మహిళలను లోకేష్‌ హింసిస్తున్నాడు

2 Jun, 2022 06:10 IST|Sakshi
మార్ఫింగ్‌ చేసిన పోస్టింగ్‌ను చూపుతున్న పాలేటి కృష్ణవేణి

సోషల్‌మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టించి కించపరుస్తున్నాడు

పోలీసులకు టీడీపీ మాజీ మహిళా నేత పాలేటి కృష్ణవేణి ఫిర్యాదు

మంగళగిరి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ తన ఐటీ టీమ్‌ ద్వారా సోషల్‌ మీడియాలో మహిళలపై అసభ్యకర పోస్టులు పెట్టించి హింసిస్తున్నాడని టీడీపీ మాజీ మహిళా నేత పాలేటి కృష్ణవేణి ఆవేదన వ్యక్తం చేశారు.

బుధవారం ఆమె లోకేష్‌తో పాటు ఆయన ఐటీ టీమ్‌పై మంగళగిరి రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్‌ ఒక పథకం ప్రకారం మహిళలను కించపరుస్తూ పోస్టులు పెట్టిస్తున్నారని విమర్శించారు.

తన పేరుతో ట్విట్టర్‌ పోస్టును మార్ఫింగ్‌ చేసి.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయారు. మహిళలు టీడీపీలో ఉన్నంతకాలం లోకేష్‌కు దేవతల్లా కనిపిస్తారని.. అక్కడి నుంచి బయటకు రాగానే బజారు మనుషుల్లా కనిపిస్తారన్నారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడే మహిళల విషయంలో ఇంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే.. ఇక అధికారంలోకి వస్తే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఏ పార్టీ కోసం, ఏ నాయకుడి కోసమైతే పని చేశానో అదే నాయకుడు నేడు తనపై దుష్ప్రచారం చేయిస్తున్నారన్నారు. లోకేష్‌కు  దమ్ముంటే మంగళగిరి నియోజకవర్గం ఒక్కచోటే నామినేషన్‌ వేసి గెలవాలని సవాల్‌ విసిరారు.  

మరిన్ని వార్తలు