ఢిల్లీ జేఎన్‌యూలో విద్యార్థి సంఘాల ఘర్షణ

11 Apr, 2022 06:13 IST|Sakshi

మాంసాహారం, శ్రీరామనవమి పూజపై రగడ

రాళ్ల దాడి.. పలువురికి గాయాలు

న్యూఢిల్లీ: రాజధానిలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య ఆదివారం తీవ్ర ఘర్షణ చెలరేగింది. దాంతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాల రాళ్ల దాడిలో పలువురు గాయపడ్డారు. క్యాంపస్‌లోని కావేరీ హాస్టల్‌ మెస్‌లో మాంసాహారం వడ్డించకుండా ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారని జేఎన్‌యూ స్టూడెంట్స్‌ యూనియన్‌ (జేఎన్‌యూఎస్‌యూ) కార్యకర్తలు ఆరోపించారు. క్యాంపస్‌లో రామనవమి పూజకు జేఎన్‌యూఎస్‌యూ నేతలు ఆటంకాలు సృష్టించారని ఏబీవీపీ కార్యకర్తలు పేర్కొన్నారు. దాంతో రగడ మొదలయ్యింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారని పోలీసులు చెప్పారు. కానీ, దాదాపు 60 మందికి గాయాలయ్యాయని జేఎన్‌యూఎస్‌యూ నేతలు పేర్కొన్నారు. తమ కార్యకర్తలు 10 మంది గాయపడ్డారని ఏబీవీపీ నాయకులు తెలిపారు.

మరిన్ని వార్తలు