ప్రేమించుకున్నాం.. రక్షణ కల్పించండి..   

27 Apr, 2022 17:23 IST|Sakshi
తహసీల్దార్‌కు వినతి పత్రం ఇస్తున్న దృశ్యం

తాడిమర్రి(శ్రీసత్యసాయి జిల్లా): కులాంతర వివాహం చేసుకున్న ఓ ప్రేమజంట తమకు రక్షణ కల్పించాలంటూ తహసీల్దార్‌ను ఆశ్రయించారు. వివరాలు... తాడిమర్రి మండలం దాడితోటకు చెందిన ఎం.కుళ్లాయప్ప కుమారుడు రాజ్‌కుమార్‌ టైల్స్‌ పరిచే పనిచేస్తున్నాడు. చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కలకు చెందిన తలారి శ్రీనివాసులు కుమార్తె మౌనిక, రాజ్‌కుమార్‌ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు.

చదవండి👉: మేము చనిపోతున్నాం.. ఎవరూ వెతకొద్దు.. కాపాడొద్దు

ఈ క్రమంలో వైఎస్సార్‌ జిల్లా కడపలో టైల్స్‌ పరిచేందుకు వెళ్లిన రాజ్‌కుమార్‌ వద్దకు ఈ నెల 4న మౌనిక ఒంటరిగా వెళ్లింది. అదే రోజు కడపలోని దుర్గమ్మ గుడిలో వీరు వివాహం చేసుకున్నారు. అయితే మౌనిక కనిపించడం లేదంటూ తండ్రి శ్రీనివాసులు చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న ప్రేమ జంట ఈ నెల 24న తాడిమర్రి పోలీసు స్టేషన్‌లో హాజరై తాము వివాహం చేసుకున్న సంగతి తెలిపారు. అనంతరం మంగళవారం తహసీల్దార్‌ హరిప్రసాద్‌ను కలిసి అమ్మాయి తరఫు కుటుంబసభ్యుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, తగిన రక్షణ కల్పించాలంటూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు హరిప్రసాద్, సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు