రూ.5.79 కోట్ల నగదు  16.6 కేజీల పసిడి

17 Oct, 2023 04:00 IST|Sakshi
సీజ్‌ చేసిన నగదు వివరాలు వెల్లడిస్తున్న కరీంనగర్‌ సీపీ సుబ్బారాయుడు   

వాహనాల తనిఖీల్లో భారీగా పట్టుబడుతున్న సొమ్ము  

మియాపూర్‌/బన్సీలాల్‌ పేట్‌/కరీంనగర్‌ క్రైం/మహబూబ్‌నగర్‌ క్రైం: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు జరుపుతున్న వాహనాల తనిఖీల్లో భారీగా బంగారం, నగదు పట్టుబడుతోంది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా జరిపిన సోదాల్లో సుమారు రూ.5.79 కోట్ల నగదు, 16.646 కేజీల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మంజీరా రోడ్డులో ఉన్న మై హోమ్‌ జ్యువెల్‌ ఎదురుగా అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఆపి పోలీసులు తనిఖీచేశారు.

ఆ వాహనంలో బషీర్‌బాగ్‌కు చెందిన కిలుముళ్ల అనిరుధ్‌ (23), బాలిరాం అక్కే మారుతి, మూసాపేట్‌కు చెందిన శంకర్‌దుబే ఆరు బాక్సుల్లో బంగారం, వెండి ఆభరణాలను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. వారి వద్ద సంబంధిత పత్రాలు లేకపోవడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని వాహనంలో ఉన్న 16.64 కేజీల బంగారు ఆభరణాలు, 23.58 కేజీల వెండి ఆభరణాలను స్వా«దీనం చేసుకున్నట్లు మియాపూర్‌ సీఐ ప్రేమ్‌కుమార్‌ తెలిపారు. మరో ఘటనలో మియాపూర్‌లోని ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు వద్ద బాచుపల్లికి చెందిన రాజుకుమార్‌ ద్విచక్రవాహనాన్ని తనిఖీచేయగా అతని వద్ద రూ.14,93,100 నగదు ఉన్నట్లు గుర్తించారు. సరైన పత్రాలు అతని వద్ద లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు.  
 

కవాడిగూడ, కరీంనగర్‌లో.. 
కవాడిగూడలో గాం«దీనగర్, టాస్‌్కఫోర్స్‌ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో 2.09 కోట్ల నగదు పట్టుబడింది. గాంధీనగర్‌ పోలీ సు స్టేషన్‌ పరిధిలోని కవాడిగూడ ఎన్‌టీపీసీ వద్ద కియా సెల్టోస్‌ కారు, సుజుకీ యాక్సెస్‌ ద్విచక్రవాహనంలో అక్రమంగా తరలిస్తున్న ఈ నగదును సీజ్‌ చేసినట్లు టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు, గాంధీనగర్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎన్‌.రవి చెప్పారు. కరీంనగర్‌ టూ టౌన్‌ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు చేస్తుండగా రైటర్‌ సేఫ్‌ గార్డ్‌ కంపెనీకి చెందిన వాహనంలో రూ.2,36, 48,494 అక్రమ నగదును జప్తు చేసినట్లు కరీంనగర్‌ సీపీ ఎల్‌.సుబ్బారాయుడు తెలిపారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిపిన తనిఖీల్లో పోలీ సులు రూ.1.19 కోట్ల నగదును సీజ్‌ చేశారు.

వారంలో రూ.109 కోట్లు స్వాదీనం: సీఈఓ వికాస్‌రాజ్‌  
సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చి న నాటి నుంచి వారం రోజుల్లో జప్తు చేసుకున్న మొత్తం నగదు, ఇతర వస్తువుల విలువ రూ.100 కోట్లకు మించిపోయింది. ఇప్పటివరకు జప్తు చేసి న నగదు రూ.58.96 కోట్లకు చేరింది. సోమ వారం రూ.17.16 కోట్లు విలువ చేసే బంగారం, ఇతర ఖరీదైన ఆభరణాలను సీజ్‌ చేయగా, ఇప్పటివరకు జప్తు చేసిన ఇతర ఖరీదైన లోహాల విలువ రూ.33.62 కోట్లకు చేరింది. సోమవారం రూ.29.67 లక్షలు విలువ చేసే ల్యాప్‌టాప్‌లు, కు క్కర్లు, వాహనాలను జప్తు చేయగా, ఇప్పటివరకు సీజ్‌ చేసిన ఇలాంటి వస్తువుల మొత్తం విలువ రూ.6.89 కోట్లకు చేరింది.

దీంతో జప్తు చేసిన మొత్తం నగదు, ఆభరణాలు, ఇతర వస్తువుల విలువ రూ.109.11 కోట్లకు చేరినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం రూ.77 లక్షలు విలువ చేసే 6,974 లీటర్ల మద్యం, 625 కేజీల బెల్లం పట్టుకున్నారు. దీంతో ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తం మద్యం విలువ రూ.6.64 కోట్లకు చేరింది. సోమవారం రూ.29.51 లక్షలు విలువ చేసే 110 కేజీల గంజాయిని పట్టుకోగా, ఇప్పటి వరకు సీజ్‌ చేసిన మొత్తం గంజాయి విలువ రూ.2.97 కోట్లకు చేరింది.

మరిన్ని వార్తలు