షేర్ల కోసం.. తుపాకీతో రామోజీ బెదిరింపు

17 Oct, 2023 04:06 IST|Sakshi
సోదరుడు మార్టిన్‌ రెడ్డి, తండ్రి జీజే రెడ్డితో యూరిరెడ్డి (గళ్లచొక్కా వ్యక్తి) (ఫైల్‌ ఫొటో)

సంతకం పెడతావా లేదా అంటూ బరితెగింపు

మార్గదర్శి సహ వ్యవస్థాపకుడు జీజే రెడ్డి వారసులపై దౌర్జన్యం

ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వాటాల బదలాయింపు

జీజే రెడ్డి షేర్లు శైలజా కిరణ్‌ పేరిట అక్రమంగా మార్పు

రూ.1,59,69,600 మూలధన విలువైన 288 షేర్ల బదిలీ 

సీఐడీకి జీజే రెడ్డి కుమారుడు యూరి రెడ్డి ఫిర్యాదు

ఏ–1గా రామోజీ, ఏ–2గా శైలజా కిరణ్‌లపై కేసు నమోదు

సాక్షి, అమరావతి: ‘మీ షేర్లను బదిలీ చేస్తున్నట్లు సంతకాలు పెడతారా లేదా!?’.. ఓ గదిలో తలకు తుపాకి గురిపెట్టి మరీ ఇలా బెదిరిస్తే ఎవరైనా ఏం చేస్తారు.. ప్రాణభయంతో సంతకాలు చేసేస్తారు కదా. ఈ ఉదంతంలోనూ బాధితులు అదే పనిచేశారు. కానీ, ఇక్కడ తలకు తుపాకి పెట్టి బెదిరించింది ఎవరో కాదు.. చెరుకూరి రామోజీరావు అలియాస్‌ ఈనాడు రామోజీరావు. ఆ బాధితులు మరెవరో కాదు.. 

రామోజీరావుతో కలిసి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ స్థాపించిన జీజే రెడ్డి కుమారులు మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డి. ఇలా.. తుపాకితో బెదిరించి మరీ మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లోని 288 షేర్లను తన కోడలు శైలజా కిరణ్‌ పేరిట అక్రమంగా బదిలీ చేశారు రామోజీ. ఆ ఒక్క సంతకమే కాకుండా మరికొన్ని ఫోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లతో తతంగం కానిచ్చేశారు. ఆ విధంగా 2016 నాటికి రూ.1,59,69,600 మూలధన విలువ ఉన్న 288 షేర్లను అక్రమంగా కైవసం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల గుర్తించిన బాధితుడు యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఈనెల 13న ఫిర్యాదు చేయడంతో రామోజీరావు అక్రమాల బండారం బట్టబయలైంది.

జీజే రెడ్డి పెద్ద కుమారుడు మార్టిన్‌రెడ్డి ప్రస్తుతం విదేశాల్లో ఉండగా.. భారత్‌లో నివసిస్తూ తన కుటుంబ ఆస్తి వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఆయన రెండో కుమారుడు యూరి రెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ప్రాథమిక ఆధారాలు ఉండటంతో రామోజీరావు, శైలజ కిరణ్‌లపై సీఐడీ కేసు నమోదు చేసింది. సెక్షన్లు 420, 467, 120–బి రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి ఏ–1గా రామోజీరావు, ఏ–2గా శైలజ కిరణ్‌లను నిందితులుగా చేర్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంచలనాత్మక కేసు వివరాలివీ..

ఆదరించిన చేయినే కాటేసిన రామోజీ..
కృష్ణాజిల్లా జొన్నలపాడుకు చెందిన జీజే రెడ్డి చెకోస్లేవేకియాలో ఉన్నత విద్య పూర్తిచేసిన అనంతరం ఢిల్లీలో నవభారత్‌ ఎంటర్‌ప్రైజెస్‌ అనే కంపెనీని ఏర్పాటుచేశారు. 1960లో కమ్యూనిస్ట్‌ పార్టీ నేత కొండపల్లి సీతారామయ్య సిఫార్సుతో తన జిల్లాలోని పెదపారుపూడికి చెందిన రామోజీరావుకు తన కంపెనీలో టైపిస్ట్‌గా ఉద్యోగం ఇచ్చారు. అనంతరం జీజే రెడ్డి ఆర్థిక సహకారంతో రామోజీరావు మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ను 1962లో నెలకొల్పారు. ఆ కంపెనీలో జీజే రెడ్డికి 288 షేర్లు ఉన్నాయి. జీజే రెడ్డి 1985లో చెకోస్లోవేకియాలో చనిపోయారు. ఆయన భార్య కూడా 1986లో మరణించారు. ఆ తర్వాత.. జీజే రెడ్డి ఇద్దరు కుమారులు మార్టిన్, యూరి రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో తమ తండ్రి వాటా షేర్ల కోసం రామోజీరావును చాలాసార్లు సంప్రదించినప్పటికీ ఆయనేమీ చెప్పలేదు.

పత్రికల ద్వారా తెలుసుకుని సంప్రదిస్తే..
మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో షేర్ల వివరాలను 2014లో పత్రికల్లో వచ్చిన వార్తల ద్వారా మార్టిన్‌రెడ్డి, యూరి రెడ్డి తెలుసుకున్నారు. అప్పటి నుంచి రెండేళ్లపాటు ప్రయత్నించిన తరువాత 2016, సెప్టెంబరు 29న రామోజీరావు తనను కలిసేందుకు ఆ సోదరులు ఇద్దరికీ అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. తమ షేర్లకు సంబంధించి షేర్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలని మార్టిన్‌రెడ్డి రామోజీని కోరారు. అప్పుడు 2007–08 వార్షిక సంవత్సరానికి సంబంధించి షేర్లపై డివిడెండ్‌ కింద రూ.39,74,400 విలువైన యూనియన్‌ బ్యాంక్‌ చెక్‌ (నంబరు 137991)ను ఆయన వారికిచ్చారు. మిగిలిన ఏళ్లకు సంబంధించిన డివిడెండ్‌ మొత్తాన్ని కూడా చెల్లించాలని యూరీ రెడ్డి కోరారు. అవన్నీ సెటిల్‌ చేస్తానని చెప్పి రామోజీరావు వెళ్లిపోయారు. 

తుపాకి పెట్టి బెదిరించి మరీ..
అనంతరం.. రామోజీరావు సిబ్బంది మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డిలను ఓ గదిలో కూర్చోమని చెప్పి వెళ్లారు. కాసేపటికి రామోజీ ఆ గదిలోకొచ్చి ఓ రూ.100 విలువైన స్టాంపు పేపర్‌పై రాసిన అఫిడవిట్‌ మీద మార్టిన్‌రెడ్డిని సంతకం చేయమన్నారు. తన వాటా షేర్లను తన సోదరుడు యూరి రెడ్డి పేరిట మార్చేందుకు ఎలాంటి అభ్యంతరంలేదని అందులో రాసి ఉంది. అదే సమయంలో 2016, అక్టోబరు 5వ తేదీతో ఉన్న రూ.2,88,000 పోస్ట్‌ డేటెడ్‌ చెక్‌ (నంబరు 296460)ను యూరి రెడ్డికి ఇచ్చి తేదీలేని ఫామ్‌ ఎస్‌హెచ్‌–4పై సంతకం చేయమని రామోజీరావు చెప్పారు. కానీ, దీనిపై సంతకం చేసేందుకు యూరి రెడ్డి నిరాకరించారు.

వెంటనే రామోజీరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ.. తుపాకీ తీసి అన్నదమ్ములు మార్టిన్‌ రెడ్డి, యూరి రెడ్డిల తలకు గురిపెట్టారు. ‘మిమ్మల్ని కాపాడటానికి ఇక్కడ ఎవరూ లేరు’ అని బెదిరించారు. దీంతో ప్రాణభయంతో ఆ ఫామ్‌పై యూరి రెడ్డి సంతకం చేశారు. తమ షేర్లను ఎవరి పేరిట బదిలీ చేస్తోందనిగానీ, తేదీగానీ ఆ ఫామ్‌పై లేవు. రామోజీరావు తుపాకితో బెదిరించడంతో కేవలం ప్రాణభయంతోనే ఆ ఫామ్‌పై సంతకాలు చేసి వారు బయటకొచ్చారు.

చెక్కు మార్చలేదు.. షేర్ల బదిలీకి అంగీకరించలేదు..
మరోవైపు.. ప్రాణభయంతో ఆ ఫామ్‌పై సంతకం చేసినప్పటికీ.. తమకు రామోజీరావు ఇచ్చిన చెక్కును మాత్రం వారు నగదుగా మార్చుకోలేదు. ఎందుకంటే షేర్లు బదిలీ చేయడం సమ్మతం కాదు కాబట్టి. నిజానికి.. షేర్లు బదిలీ చేయాలంటే ఒక్క పత్రంపై సంతకంచేస్తే సరిపోదు. అందుకు సంబంధించిన చాలా పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది.

చిట్‌ఫండ్స్‌ చట్టం, కంపెనీల చట్టం ప్రకారం నిర్దేశించిన అన్ని పత్రాలపై తాను సంతకాలు చేయలేదు కాబట్టి తాను షేర్లు బదిలీ చేసినట్లు కాదని యూరి రెడ్డి ధీమాగా ఉన్నారు. అలాగే, రామోజీరావు ఇచ్చిన చెక్కును నగదుగా మార్చుకోలేదు కాబట్టి తాను షేర్లు బదిలీకి అంగీకరించలేదనడానికి బలమైన సాక్ష్యంగా ఉందని ఆయన భావించారు. కానీ, ప్రాణభయంతో మరోసారి రామోజీని సంప్రదించేందుకు సాహసించలేదు. తమ షేర్లపై రావల్సిన డివిడెండ్‌ను కూడా అడగలేకపోయారు. దీంతో.. 2016 నాటికి ఒక్కోటి రూ.55,450 విలువ చేసే 288 షేర్లు అంటే రూ.1,59,69,600 మూలధన విలువైన షేర్లు ఆయన పేరిట ఉన్నాయి. 

ఫోర్జరీ సంతకాలతో అక్రమంగా బదిలీ..
మరోవైపు.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ అక్రమాలపై ఇటీవల ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో.. మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో వాటాదారు అయిన యూరి రెడ్డి తన షేర్ల గురించి తెలుసుకోవాలని భావించారు. రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ కార్యాలయంలో పరిశీలించగా ఆయన పేరిట ఒక్క షేర్‌ కూడా లేదని తెలుసుకుని ఆశ్చర్యపోయారు.

ఆయన పేరిట ఉన్న 288 షేర్లను 2016లోనే శైలజకిరణ్‌ పేరిట బదిలీ చేసినట్లు  గుర్తించారు. తాను సంతకాలు చేయకుండా ఎలా బదిలీ చేశారా అని పరిశీలిస్తే రామోజీరావు కుతంత్రం బయటపడింది. యూరి రెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసి మరీ ఆయన వాటా షేర్లను శైలజ కిరణ్‌ పేరిట అక్రమంగా బదిలీ చేసేశారన్నది వెల్లడైంది. షేర్ల బదిలీకి కంపెనీల చట్టంలో నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించకుండానే ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో కథ నడిపించేశారు. 

మూలధన నిధి సేకరించింది ఏపీలోనే కాబట్టి..
తన షేర్లను అక్రమంగా శైలజకిరణ్‌ పేరిట బదిలీ చేయడంపై యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు. కృష్ణా జిల్లాలోని తమ స్వగ్రామంలోని ఆస్తుల నుంచి సేకరించిన నిధులనే తన తండ్రి జీజే రెడ్డి మార్గదర్శి చిట్‌ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టారు. మరోవైపు.. ఆంధ్రప్రదేశ్‌లో 37 బ్రాంచి కార్యాలయాల ద్వారా మార్గదర్శి చిట్‌ఫండ్స్‌ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. కాబట్టి తన షేర్ల అక్రమ బదిలీపై  యూరి రెడ్డి ఏపీ సీఐడీకి ఫిర్యాదు చేశారు.

న్యాయ నిపుణులను సంప్రదించిన తరువాతే ఆయన నిబంధనల మేరకు ఫిర్యాదు చేశారు. యూరి రెడ్డి ఫిర్యాదును పరిశీలించి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని నిర్థారించుకున్న తరువాత సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. ఏ–1గా చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజ కిరణ్‌లను పేర్కొంటూ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది.

మరిన్ని వార్తలు