Sakshi Excellence Awards 2023: ప్రతిభా పురస్కారాల సాక్షిగా..

17 Dec, 2023 06:51 IST|Sakshi
ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌కు స్వాగతం పలుకుతున్న వై.ఎస్‌. భారతీ రెడ్డి

'నిస్వార్థంగా సేవ చేసిన వారు కొందరైతే.. పూట గడవని స్థితి నుంచి పదిమంది ఆకలి తీర్చే స్థాయికి ఎదిగిన వారు మరికొందరు... అలాగే పిన్న వయస్సులోనే ప్రతిభ చూపేవారు... తమ ప్రతిభను సమాజ హితం కోసం... దేశానికి పతకాల పంటను అందించడం కోసం తోడ్పడేవారు... ఎంచుకున్న రంగంలో విశేష కృషి చేసిన వారు ఎందరో... ఇలాంటి వారిలో ప్రతి ఏటా తమ దృష్టికి వచ్చిన కొందరిని సాక్షి గుర్తించి అభినందిస్తోంది...  సత్కరించి గౌరవిస్తోంది.

ఇందులో భాగంగా 9వ ఎడిషన్‌కు సంబంధించిన ‘సాక్షి’ ప్రతిభా పురస్కార ప్రదానోత్సవం హైదరాబాద్‌లోని జెఆర్‌సీ కన్వెన్షన్‌ హాలులో నవంబర్‌ 16, గురువారం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ ఎస్‌. అబ్దుల్‌ నజీర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పెద్దలు, ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా జరిగిన ఈ కార్యక్రమంలో పురస్కారాలు అందుకున్న వారి వివరాలు, స్పందనలు.'

లాన్స్‌నాయక్‌ బొగ్గల సాయి
తేజస్పెషల్‌ జ్యూరీ పురస్కారం (మరణానంతరం)
చిత్తూరుజిల్లాలోని ఎగువ రేగడ పల్లి గ్రామానికి చెందిన యువతేజం బొగ్గల సాయితేజ బాల్యం నుంచే సైన్యంలో చేరాలని కలలు కన్నారు. 2013లో బెంగళూరు రెజిమెంట్‌లో ఆర్మీజవాన్ గా చేరి తన ఆశయాన్ని నెరవేర్చుకున్నారు. స్వల్పకాలంలోనే ఉన్నతాధికారుల మన్ననలు పొందారు సాయితేజ. అతని శక్తియుక్తులను గుర్తించిన త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌... ఆయనను తన వ్యక్తిగత భద్రతాసిబ్బందిలో ఒకరిగా నియమించుకున్నారు.

అయితే... అనూహ్యంగా 2021 డిసెంబర్‌లో తమిళనాడులో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తోపాటు సాయితేజ కూడా అమరుడయ్యారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు. సోదరుడు మహేష్‌ కూడా సైన్యంలో ఉన్నారు. విధి నిర్వహణలో అమరుడైన వీర జవాన్  లాన్ ్స నాయక్‌ సాయితేజకు సెల్యూట్‌ చేస్తూ సాక్షి ఎక్సలెన్ ్స – మరణానంతర పురస్కారాన్ని కుటుంబ సభ్యులకు అందజేసింది సాక్షి మీడియా గ్రూప్‌.

తల్లిదండ్రుల స్పందన:  మా సాయితేజ చిన్నప్పటి నుంచే దేశం గురించి ఆలోచించేవాడు. దేశసేవ గురించి ఎన్నో విషయాలు చెప్పేవాడు. తనే సొంతంగా వెళ్లి ఆర్మీలో సెలక్ట్‌ అయ్యాడు. అక్కడ దేశం కోసం అమరుడయ్యాడు. కొడుకు మీద మీద ప్రేమతో గుడికట్టి, మేమూ ఆ ప్రాంగణంలోనే ఉంటున్నాం. ఈ అవార్డు మాకు నిత్య స్మరణీయం.

పంతంగి భార్గవి
యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌  (ఎడ్యుకేషన్‌)
పంతంగి భార్గవి తండ్రి ఒక ప్రైవేట్‌ సంస్థలో సెక్యూరిటీ గార్డు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ చదువుల తల్లి తెలంగాణ సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్లో చదువుకుంది. అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించి గౌలిదొడ్డిలోని సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ కాలేజీలో సీటు సంపాదించుకుంది. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీ పట్టి చిక్కుప్రశ్నలు పరిష్కరించే మెళకువలను ఆకళింపు చేసుకుంది భార్గవి. కరోనా మహమ్మారి విరుచుకుపడినా మనోధైర్యం కోల్పోకుండా ఆన్ లైన్  క్లాసుల ద్వారా సాధన కొనసాగించింది. జేఈఈ అడ్వాన్ ్సడ్‌ ఎగ్జామ్‌లో ర్యాంక్‌ సాధించి బాంబే ఐఐటీలో ఇంజినీరింగ్‌లో చేరింది... సాధన చేస్తే సాధ్యం కానిదేమీ లేదని నిరూపించిన భార్గవిని యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – ఎడ్యుకేషన్‌ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.

భార్గవి సోదరి స్పందన: మా అమ్మానాన్న మమ్మల్ని చదివించడానికి ఎంత కష్టపడ్డారో మాటల్లో చెప్పలేను. నేను బీటెక్‌ చేసి టీసీఎస్‌లో ఉద్యోగం చేస్తున్నాను. తమ్ముడు చదువుకుంటున్నాడు. చెల్లికి ఇంత గొప్ప పురస్కారం లభించడం మాకెంతో సంతోషంగా ఉంది. మాటలు రావడం లేదు.

పార్టిసిపేటరి రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్షియేటివ్‌ సొసైటీ
ఎక్సలెన్స్‌ ఇన్‌ ఫార్మింగ్‌  (ప్రొ. ఎస్వీ రెడ్డి, ప్రెసిడెంట్‌ అండ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌)
రైతన్నకు వెన్నుదన్నుగా నిలిచి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తోంది పార్టిసిపేటరి రూర ల్‌ డెవలప్‌మెంట్‌ ఇన్షియేటివ్‌ సొసైటీ. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ సంస్థ వ్యవసాయం, పర్యావరణం, ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అధిక దిగుబడులు సాధించేలా రైతులకు మెళకువలు నేర్పిం చి, సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకునేలా శిక్షణ ఇస్తోంది. ఫలితంగా ఒక్కో రైతుకు ఎకరాకు పది వేల నుంచి 25 వేల వరకు అధికంగా ఆదాయం చేకూరుతోంది. గ్రామీణ ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్న ఈ సొసైటీ ని ఎక్సలెన్స్‌ ఇన్  ఫార్మింగ్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.

పురస్కార గ్రహీత స్పందన:  సరిగ్గా చేసుకుంటే వ్యవసాయం లాభదాయకమే. ఖర్చులు తగ్గించుకోవాలి, కొత్త వంగడాలతో శ్రద్ధగా సేద్యం చేయాలి. రైతులకు నేను చెప్పే మాట ఒక్కటే... ‘రసాయన ఎరువులకు బదులు గ్రీన్ లేబుల్‌ ఉన్న పెస్టిసైడ్స్‌ని వాడాలి’. తెలుగు నేలకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇచ్చిన ఈ అవార్డు అమ్మ ప్రశంసలా ఉంది.

కేడర్ల రంగయ్యఎక్సలెన్స్‌ ఇన్‌ ఎడ్యుకేషన్‌
కొమురంభీం జిల్లా కెరమెరి మండలం సావర్ఖేడ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న కేడర్ల రంగయ్య తాను పనిచేస్తున్న గ్రామంలోనే నివాసం ఉంటూ... తన ఇద్దరు పిల్లలను సర్కారు బడిలో చేర్పించారు. ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులకు నచ్చచెప్పి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. రంగయ్య కృషిఫలితంగా విద్యార్థుల సంఖ్య 50 నుంచి 280 కి పెరిగింది. ఇక్కడ చదువుకున్న పిల్లలు జిల్లాస్థాయిలో టాపర్స్‌గా నిలిచారు. సామాజిక రుగ్మతలైన బాల్యవివాహాలు, మద్యపానానికి వ్యతిరేకంగా పోరాడారు. బెల్ట్‌షాపులు తొలగింపు కోసం నిరాహార దీక్ష చేశారు. ఫలితంగా బాల్యవివాహాలకు అడ్డుకట్ట పడింది. మద్యపానంపై స్వచ్ఛంద నిషేధం అమలవుతోంది. విద్యార్థుల భవితకు పాటుపడుతున్న ఈ ఉత్తమ ఉపాధ్యాయుణ్ణి ఎక్సలెన్్స ఇన్‌ ఎడ్యుకేషన్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.

పురస్కార గ్రహీత స్పందన: పిల్లలను చైతన్యవంతం చేయడం ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయవచ్చన్నది నా ఆలోచన. నాకు భార్య çసహకారం ఉంది. సాక్షి పురస్కారం నా బాధ్యతను పెంచింది. మరింత ఉత్సాహంగా పని చేసి లక్ష్యాన్ని సాధిస్తా.

సునీల్‌ యల్లాప్రగడ
బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ (స్మాల్, మీడియమ్‌)
కాంపోజిట్‌ మెటీరియల్స్‌తో సరికొత్త ప్రొడక్ట్స్‌ తయారు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ట్రియోవిజన్ కాంపోజిట్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌. రైల్వేస్, ఆటోమోటివ్, విండ్, మెరైన్, డిఫెన్ ్స తదితర సంస్థలకు అవసరమైన డిజైన్, టూలింగ్, కాంపోజిట్‌ ప్రొడక్ట్స్‌ సరఫరా చేస్తోంది. ట్రియోవిజన్  ఉత్పత్తులు కఠినమైన వాతావరణ పరిస్థితులను కూడా తట్టుకుంటాయి. రసాయనాలు, మంటల నుంచి రక్షణ కల్పిస్తాయి. తుప్పుపట్టవు. దేశీయంగానే కాకుండా గ్రీస్, యుఏఈ, నైజీరియా తదితర దేశాలకూ తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది ట్రియోవిజన్ . కాంపోజిట్‌ మాన్యుఫాక్చరింగ్‌ రంగంలో వినూత్నమైన ప్రయోగాలు చేస్తూ దేశవిదేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ట్రియోవిజన్  కాంపోజిట్‌ టెక్నాలజీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అధినేత సునీల్‌ యల్లాప్రగడను సాక్షి స్మాల్‌ / మీడియం స్కేల్‌ – బిజినెస్‌ పర్సన్  ఆఫ్‌ ద ఇయర్‌ – అవార్డు వరించింది.

పురస్కార గ్రహీత స్పందన:  మేం తయారుచేస్తున్న ఉత్పత్తులను స్వదేశంలోనే కాదు విదేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నాం. మా కృషిని గుర్తించి బిజినెస్‌ పర్సన్  ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డుతో సాక్షి మీడియా సంస్థ సత్కరించడం చాలా గొప్ప అనుభూతిని ఇచ్చింది.

కొమెర అంకారావు (జాజి)
ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ (ఇండివిడ్యువల్‌)
పల్నాడు ప్రాంతానికి చెందిన కొమెర అంకారావుకు విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే రోజూ అడవికి వెళ్లి విత్తనాలు చల్లడం... మొక్కలు నాటడం అలవాటు. అడవిలో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ వ్యర్థాలను ఏరేయడం, వేసవిలో మొక్కలకు నీళ్లుపోసి సంరక్షించడం, వారంలో నాలుగు రోజులు అడవుల్లోనే సంచరించడం, రెండురోజులు పర్యావరణం పట్ల పిల్లల్లో అవగాహన కల్పించడం అభిరుచులు. తన పొలంలో సేంద్రియ పద్ధతిలో పంట పండించి పక్షులకు ఆహారంగా వదిలేస్తారు. అంకారావు నిస్వార్థ సేవకుగాను పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. వన్యప్రేమికుడైన అంకారావు ఉరఫ్‌ జాజిని ఎక్సలెన్ ్స ఇన్  ఎన్విరాన్ మెంట్‌ కన్జర్వేషన్‌ – ఇండివిడ్యువల్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి.

పురస్కార గ్రహీత స్పందన:  ఈ పని చేస్తే అవార్డులు వస్తాయని కూడా తెలియదు. సుచిర్‌ ఇండియా నుంచి సంకల్పతార, దయానంద సరస్వతి సంస్థ నుంచి వృక్షమిత్ర, చెన్నై ప్రైవేట్‌ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్‌æ పురస్కారాలందుకున్నాను. అవార్డులు వస్తాయని పనిచేయలేదు, అవార్డులు రాకపోయినా పని ఆపను.

డాక్టర్‌ చినబాబు సుంకవల్లి
(ఎక్సలెన్స్‌ ఇన్‌ హెల్త్‌కేర్‌)
క్యాన్సర్‌ సోకి ఖరీదైన వైద్యం చేయించుకోలేక ప్రాణాల మీద ఆశ వదిలేసుకున్నవారికి నేనున్నానని భరోసా కల్పిస్తున్నారు డాక్టర్‌ చినబాబు సుంకవల్లి. ముందస్తు రోగ నిర్ధారణ పరీక్షలతో క్యాన్సర్‌ ముప్పు తప్పించవచ్చనే ఆలోచనతో 2013లో గ్రేస్‌ క్యాన్సర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆర్థికస్తోమత లేని రోగులకు అవసరమైన వైద్యం అందించి వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. మురికివాడలు, పల్లెలు, పట్టణాలు, గిరిజన తండాల్లో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ క్యాంప్స్‌ నిర్వహిస్తూ వ్యాధిపై అవగాహన కల్పిస్తోంది ఈ ఫౌండేషన్‌. ఈ సంవత్సరం ఇప్పటివరకు  సుమారు లక్షమందికి వైద్య పరీక్షలు చేశారు. క్యాన్సర్‌ రోగులకు తనవంతు సేవ చేస్తున్న సర్జికల్‌ అంకాలజిస్ట్‌ డాక్టర్‌ చినబాబు సుంకవల్లిని సాక్షి ఎక్సలెన్ ్స ఇన్‌ హెల్త్‌ కేర్‌ అవార్డ్‌తో పురస్కరించింది.

పురస్కార గ్రహీత స్పందన:  వైద్యరంగంలో చికిత్స మాత్రమే కాదు, అంతకుమించిన సేవలు కూడా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్‌ రోగులకు ధైర్యం చెప్పి సాంత్వన కలిగించడం, క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ గురించి చైతన్యవంతం చేయడం వంటివి. మా సేవలను గుర్తించి సాక్షి ఇచ్చిన ఈ అవార్డు రెట్టించిన ఉత్సాహంతో పని చేయడానికి దోహదం చేస్తుంది.

నెలకుర్తి సిక్కిరెడ్డి
(యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌, స్పోర్ట్స్‌)
తన ఆటతీరుతో జాతీయ.. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతున్న నెలకుర్తి సిక్కిరెడ్డి తండ్రి కృష్ణారెడ్డి జాతీయ వాలీబాల్‌ క్రీడాకారుడు. తల్లి గృహిణి. బాల్యం నుంచి క్రీడలపై కూతురికి ఉన్న ఆసక్తిని గమనించి ప్రోత్సహించారు పేరెంట్స్‌. ఆమెకు బ్యాడ్మింటన్‌లో మెళకువలు నేర్పించేందుకు పుల్లెల గోపీచంద్‌ అకాడమీలో చేర్పించారు. అక్కడ ఆటలో కఠోరమైన శిక్షణ తీసుకున్న సిక్కిరెడ్డి స్వల్పకాలంలోనే ప్రపంచస్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. 2007లో కెరీర్‌లో తొలి అంతర్జాతీయ జూనియర్‌ ప్రపంచ కప్‌ పోటీలో పాల్గొంది. బ్యాడ్మింటన్ లో విశేష ప్రతిభ చూపిన సిక్కిరెడ్డిని కేంద్రప్రభుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. తనకిష్టమైన క్రీడల్లో సత్తా చాటుతూ ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్న సిక్కిరెడ్డిని సాక్షి ఎక్సలెన్ ్స యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ – స్పోర్ట్స్‌ అవార్డు వరించింది.

పురస్కార గ్రహీత స్పందన:  చెప్పలేనంత ఆనందంగా ఉంది. నేను కెరీర్‌ మొదలు పెట్టిన తొలిరోజుల్లో ప్రారంభమైన సాక్షి, మొదటి నుంచి నాకు ప్రోత్సాహాన్నిస్తోంది. ప్రతి అవార్డూ దేనికదే ప్రత్యేకం. దేని గొప్పతనం దానిదే. సాక్షి పురస్కారం అర్జున అవార్డు మరోసారి అందుకున్నంత ఆనందాన్నిస్తోంది.

జాస్పర్‌ పాల్‌
యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌  (సోషల్‌ సర్వీస్‌)
హైదరాబాద్‌కు చెందిన 27 ఏళ్ల జాస్పర్‌పాల్‌.... 2014లో ఒక ఘోర రోడ్డుప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. అది దేవుడు తనకు ఇచ్చిన పునర్జన్మగా భావించిన జాస్పర్‌ ఆ క్షణమే ఒక గట్టి సంకల్పం తీసుకున్నారు. నిలువ నీడ లేని వృద్ధులను చేరదీసి ఆశ్రయం కల్పించేందుకు 2017లో సెకండ్‌ ఛాన్ ్స ఫౌండేషన్‌ స్థాపించారు. పుట్‌పాత్‌లపై నిస్సహాయంగా పడి ఉన్న వృద్ధులను చేరదీసి.. జీవిత చరమాంకంలో వారికి ఊరట కల్పిస్తున్నారు. ఇప్పటివరకు 2000 మందికి ఆశ్రయం కల్పించారు. 300 మందిని తిరిగి వారి కుటుంబసభ్యుల వద్దకు చేర్చారు. హైదరాబాద్‌లో జాస్పర్‌ నిర్వహిస్తున్న షెల్టర్‌హోమ్స్‌లో సుమారు 200 మంది ఆశ్రయం పొందుతున్నారు. అంతేకాదు...ఫ్రీ హాస్పిటల్‌ ఫర్‌ ది హోమ్‌లెస్‌ పేరుతో నిలువ నీడలేని వారికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్న జాస్పర్‌ పాల్‌ని సాక్షి యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ – సోషల్‌ సర్వీస్‌ అవార్డు వరించింది.

పురస్కార గ్రహీత స్పందన:  తొమ్మిదేళ్లుగా సామాజిక సేవలో ఉన్నాను. రకరకాల కారణాలతో వృద్ధులను వారి పిల్లలు వదిలేయడం గమనించాను. ఒంటరి వృద్ధులను చూసినప్పుడు బాధగా అనిపించేది. దీనికో పరిష్కారం కనుక్కోవాలని ఓల్డేజీ హోమ్‌ ఏర్పాటు ద్వారా ఎందరో వృద్ధులను కాపాడగలిగాను. దీన్ని సాక్షి గుర్తించి అవార్డు ఇవ్వడం... పెద్దల ఆశీస్సులు లభించినంత ఆనందంగా ఉంది.

డాక్టర్‌ పద్మావతి పొట్టబత్తిని
ఎక్సలెన్స్‌ ఇన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌
వైకల్యం ఆమె అభిరుచిని అడ్డుకోలేకపోయింది. సంకల్పం ఆమెకు కొత్తదారి చూపింది. ఆవిడే పద్మావతి పొట్టబత్తిని. పసితనంలో పోలియో బారినపడ్డా, చెక్కుచెదరని మనోబలంతో  తనను తాను తీర్చిదిద్దుకున్నారు. సంగీత పాఠాలు నేర్చుకున్నారు. తనలోని కళాభిరుచికి రెక్కలు తొడిగి రంగస్థల నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దివ్యాంగుల కోసం ఒక సంస్థను ఏర్పాటుచేసి వారికి కంప్యూటర్స్, నృత్యం, సంగీతం, టైలరింగ్‌ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పిస్తున్న పద్మావతిని పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించడంతోపాటు రాష్ట్రప్రభుత్వం గౌరవ డాక్టరేట్‌తో సత్కరించింది. కళలు, సామాజిక సేవారంగంలో ప్రతిభ చూపుతూ ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తున్న పద్మావతిని ఎక్సలెన్ ్స ఇన్‌ సోషల్‌ డెవలప్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.

పురస్కార గ్రహీత స్పందన:  చిన్ననాటి నుంచి ఆర్టిస్టుగా ఉండటం వల్ల నాలాగా కళాకారులు అవ్వాలనుకునే దివ్యాంగులకు సాయం చేయాలనుకున్నాను. నేను ఎదుర్కొన్న సమస్యలు మిగతావారు ఫేస్‌ చేయకూడదని వారికి మెరుగైన అవకాశాల కోసం  ప్రయత్నిస్తున్నాను. నా కృషిని గుర్తించి, ఈ అవార్డును ఇవ్వడం ఆనందంగా ఉంది.

డా. బి. పార్థసారథి రెడ్డి, ఛైర్మన్‌   
(హెటిరో డ్రగ్స్‌) – బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ద ఇయర్‌ లార్జ్‌ స్కేల్‌ (సుధాకర్‌ రెడ్డి, హెటిరో గ్రూప్‌ డైరెక్టర్‌)
హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న హెటిరో ఫార్మాస్యూటికల్స్‌ తమ విభిన్నమైన ఉత్పత్తులతో  పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్‌ పరంగా దేశవిదేశాల్లో విశేషమైన గుర్తింపు పొందింది. ప్రపంచంలోనే అత్యధికంగా యాంటీ రెట్రోవైరల్‌ డ్రగ్‌ ఉత్పత్తి చేస్తున్న ఈ ఫార్మా కంపెనీ హెచ్‌ఐవీ చికిత్సలో వినియోగించే డ్రగ్స్‌ను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తోంది. స్వైన్ ఫ్లూ, కోవిడ్‌ చికిత్సలో వినియోగించిన ఔషధాలను పెద్దమొత్తంలో ఉత్పత్తిచేసి రికార్డు సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే ఔషధాల ఉత్పత్తికి అంకితమై, విశేష కృషి చేస్తున్న హెటెరో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ చైర్మన్  డా. బి.పార్థసారథి రెడ్డిని బిజినెస్‌ పర్సన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ లార్జ్‌స్కేల్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి.

స్పందన:  (సుధాకర్‌ రెడ్డి, డైరెక్టర్, అవార్డు అందుకున్నారు) మా వంతు సామాజిక బాధ్యతగా ప్రజలకు అవసరమైన ఔషధాల తయారీలో ముందుంటున్నాం. అదే నిబద్ధతతో ప్రయోగాలను కొనసాగిస్తూ మందులను తక్కువ ధరకు అందించడానికి ప్రయత్నిస్తాం.

నెక్ట్స్‌ఎరా ఎనర్జీ రీసోర్సెస్‌     
ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ (కార్పొరేట్‌) (ఎమ్‌.వెంకట నారాయణ రెడ్డి, సీఈవో)
వ్యర్థాల నుంచి ఎనర్జీని ఉత్పత్తి చేయడం, బయో ఇంధనం, సౌరశక్తి ఆధారిత పునరుత్పాదక ఎనర్జీ ప్రాజెక్టులను నిర్వహించడం నెక్ట్స్‌ ఎరా ఎనర్జీ రీసోర్సెస్‌ సంస్థ ప్రధాన ఉద్దేశం. వాతావరణ మార్పులను నియంత్రిస్తూ... క్లీన్‌ఎనర్జీతో ఈ సంస్థ పలు వినూత్న కార్యక్రమాలు చేపట్టింది. పునరుత్పాదక ఇంధన పరిజ్ఞానానికి సంబంధించి  శిక్షణాకోర్సుల నిర్వహణతోపాటు ఆపరేటర్లు, టెక్నీషియన్లకు అవసరమైన శిక్షణ అందిస్తోంది. వ్యర్థాల నుంచి ఇంధన ఉత్పత్తి, సోలార్‌ ఆఫ్‌– గ్రిడ్‌ ప్రాజెక్టులు ఏర్పాటు చేసింది ఈ సంస్థ. ప్రకృతి వనరుల సద్వినియోగంతో సామాజిక, ఆర్థిక, వ్యవసాయ అభివృద్ధితోపాటు పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటునందిస్తున్న నెక్స్‌ట్‌ ఎరా ఎనర్జీ రీసోర్సెస్‌ ప్రతినిధి ఎస్‌. వెంకట నారాయణరెడ్డిని ఎక్సలెన్ ్స ఇన్‌ ఎన్విరాన్ మెంట్‌ – కార్పొరేట్‌ అవార్డ్‌తో సత్కరించింది సాక్షి.

పురస్కార గ్రహీత స్పందన:  సాక్షి సంస్థ మా సర్వీస్‌ను గుర్తించి అవార్డు ఇవ్వడం ఊహించని సంతోషం. సేవ చేసే వారిని గుర్తించి గౌరవించడం పెద్ద బాధ్యత. సాక్షి అంత పెద్ద బాధ్యతను నిరంతరాయంగా నిర్వహించడం అభినందనీయం.

రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మోయినాబాద్‌    
ఎక్సలెన్స్‌ ఇన్‌ ఎన్విరాన్‌మెంట్‌ కన్జర్వేషన్‌ (ఎన్జీఓ) (ఉదయ్‌ పిలాని, ప్రాజెక్ట్‌ కో–ఆర్డినేటర్‌)
పర్యావరణ పరిరక్షణకు నడుం బిగించింది రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మోయినాబాద్‌. హానికారకమైన ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించడం, వాటిని రీ సైక్లింగ్‌ చేయడం అనే బృహత్కార్యాన్ని తన భుజాన వేసుకుంది ఈ క్లబ్‌. గత పదేళ్లుగా విశాఖలోని బీచ్, అపార్ట్‌మెంట్స్, మార్కెట్‌ ప్రాంతాల్లో ఇండియా యూత్‌ ఫర్‌ సొసైటీతో కలిసి జీవీఎం సహకారంతో ఒక ప్రాసెసింగ్‌ ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తోంది. వీరు నిర్వహిస్తున్న అవేర్‌నెస్‌ ప్రోగ్రామ్స్, సెమినార్స్, వర్క్‌షాప్స్‌ ఫలితంగా ప్రజల్లో ఆశాజనకమైన మార్పు అంకురిస్తోంది. పుడమితల్లిని కాపాడుకునేందుకు తోడ్పాటునందిస్తున్న రోటరీ క్లబ్‌ ఆఫ్‌ లేక్‌ డిస్ట్రిక్ట్‌ మొయినాబాద్‌ తరపున ఉదయ్‌ పిలానిని ఎక్సలెన్ ్స ఇన్‌ ఎన్విరాన్ మెంట్‌ కన్సర్‌వేషన్‌ – ఎన్జీవో అవార్డ్‌తో సత్కరించింది సాక్షి.

పురస్కార గ్రహీత స్పందన: పర్యావరణంపై చూపే ప్రేమ ఈ రోజు ఇంతమంది ముందుకు తీసుకువచ్చింది. సాక్షి ఎక్సెలెన్స్‌  అవార్డు సత్కారం మా రోటరీ క్లబ్‌కు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ప్లాస్టిక్‌ రహిత సమాజ నిర్మాణానికి ఈ అవార్డు ఒక మైల్‌స్టోన్‌ లాంటిది.

కృష్ణ కుమ్మరి
యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌
ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరి తన కల నెరవేర్చుకున్నాడు యువశాస్త్రవేత్త కృష్ణ కుమ్మరి. స్వగ్రామం జోగులాంబ గద్వాల జిల్లాలోని ఉండవల్లి. తల్లిదండ్రులు లక్ష్మీదేవి, మద్దిలేటి. కూలిపనే వారి జీవనాధారం. ఒకవైపు పేదరికం...దానికితోడు చిన్నతనంలో సోకిన పోలియో. టెన్త్‌ వరకు ప్రభుత్వ పాఠశాలలోనే చదివిన కృష్ణ... తిరుపతిలో డిప్లొమో, హైదరాబాద్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించారు. ఇక చాలు అనుకోలేదు... 2018లో ఇస్రోలో సైంటిస్ట్‌గా చేరారు. చంద్రయాన్  – 3 ప్రాజెక్టులో పనిచేసే అవకాశం లభించింది. గ్రౌండ్‌ డేటా ప్రాసెసింగ్‌ విభాగంలో పనిచేసి ప్రాజెక్ట్‌ విజయవంతం కావడానికి దోహదపడ్డాడు కృష్ణ. చంద్రయాన్  3 ప్రయోగంతో దేశప్రతిష్టను ఇనుమడింపచేసిన శాస్త్రవేత్తల బృందంలో ఒకరైన కృష్ణని యంగ్‌ అచీవర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుతో సత్కరించింది సాక్షి మీడియా గ్రూప్‌.

పురస్కార గ్రహీత స్పందన:  ఒక కుగ్రామంలో పుట్టి పెరిగిన నేను, ఎన్నో అడ్డంకులను ఎదుర్కొంటూ ఇస్రో వరకు  వెళ్లాను. కానీ, అవార్డులు నన్ను వరిస్తాయని ఊహించలేదు. ఇంత గొప్ప వేదికపైన సాక్షి ఎక్స్‌లెన్స్‌ అవార్డు అందుకోవడం ఎంతో సంతోషంగా ఉంది.

స్వర్గీయ సి.ఆర్‌. రావు   
తెలుగు ఎన్నారై ఆఫ్‌ ద ఇయర్‌
పద్మ విభూషణ్‌ డాక్టర్‌ కల్యంపూడి రాధాకృష్ణ రావ్‌...  కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగళిలో జన్మించారు. యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతాలో ఎం.ఎ. స్టాటిస్టిక్స్‌ చదివి... కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేశారు. ఇండియన్  స్టాటిస్టికల్‌ ఇన్ స్టిట్యూట్‌లో డైరెక్టర్‌గానూ, అనంతరం అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ బఫెలోలో రీసెర్చ్‌ ప్రొఫెసర్‌గానూ సేవలందించారు. 477 పరిశోధన పత్రాలను సమర్పించి 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్నారు. అమెరికా అత్యున్నత నేషనల్‌ మెడల్‌ ఆఫ్‌ సైన్ ్స పురస్కారాన్ని అందుకున్నారు. భట్నాగర్‌ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. గణాంక శాస్త్రంలో విప్లవాత్మకమైన ఆలోచనలకు బీజం వేసినందుకు ఆ రంగంలో నోబెల్‌ బహుమతికి సమానమైన ఇంటర్నేషనల్‌ ప్రైజ్‌ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌–2023 అవార్డును అందుకున్నారు సీఆర్‌ రావు. 102 ఏళ్ల వయసులో ఇటీవలే తుదిశ్వాస విడిచారు. గణాంక శాస్త్రంలో ఆయన అందించిన విశేషమైన సేవలను స్మరించుకుంటూ ఎక్సలెన్ ్స ఇన్  ఎన్ ఆర్‌ఐ అవార్డ్‌తో గౌరవించింది సాక్షి మీడియా గ్రూప్‌. డాక్టర్‌ సిఆర్‌ రావు మేనల్లుడు డాక్టర్‌ యు.యుగంధర్‌ (చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ –ఏఐఎమ్‌ఎస్‌సిఎస్, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ క్యాంపస్‌) అవార్డును స్వీకరించారు.

>
మరిన్ని వార్తలు