సంక్రాంతి మాధుర్యం మన వంటింట్లోనే..

5 Jan, 2024 13:23 IST|Sakshi
పూతరేకులు

'కాలం మారింది.. అరిశె కోసం జనవరి వరకు ఎదురు చూడక్కర్లేదు. స్వగృహ ఫుడ్స్‌ ఏడాదంతా అందిస్తున్నాయి. అయినా సరే.. సంక్రాంతి వస్తోందంటే ఇంట్లో బెల్లం కాగాల్సిందే. పాకం వాసనకు పక్కింటి వాళ్ల నోరూరించాల్సిందే. కాలం ఎంత మారినా సరే.. అసలైన అరిశె రుచి అంటే.. మన వంటింటి అరిశె రుచే. మరి అవేంటో చూద్దాం!'

పూతరేకులు..
కావలసినవి: బెల్లం పొడి – కేజీ; సగ్గుబియ్యం– ముప్పావు కేజీ; జీడిపప్పు, పిస్తా – పావుకేజీ (చిన్న పలుకులు చేయాలి); ఏలకుల పొడి– 5గ్రా.; నెయ్యి– 100 గ్రా.

తయారి..

  • సగ్గుబియ్యాన్ని ఉడికించి చిక్కటి గంజి చేసుకోవాలి. పూత రేకు చేయడానికి మంద పాటి నూలు వ్రస్తాన్ని నలుచదరంగా కత్తిరించి సిద్ధం చేసుకోవాలి. కుండను మంట మీద బోర్లించి వేడెక్కిన తరువాత వ్రస్తాన్ని సగ్గుబియ్యం గంజిలో ముంచి కుండ మీద అతికించినట్లు పరిచి వ్రస్తాన్ని తీసేయాలి.
  • గంజి కుండకు అంటుకుని వేడికి పలుచని పొరలాగా వస్తుంది. ఆ పొర చిరిగిపోకుండా అట్లకాడతో జాగ్రత్తగా తీయాలి.
  • ఇలా ఎన్ని రేకులు కావాలంటే అన్నింటికీ ఇదే పద్ధతి. రేకు ఏ సైజులో కావాలంటే క్లాత్‌ను ఆ సైజులో కట్‌ చేసుకోవాలి.
  • ఒకపాత్రలో బెల్లం పొడి, జీడిపప్పు, పిస్తా పలుకులు, ఏలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు రేకులను రెండు పొరలు తీసుకుని వాటికి నెయ్యి రాయాలి.
  • ఆ తర్వాత బెల్లం పొడి, జీడిపప్పు పలుకులు, ఏలకుల పొడి మిశ్రమాన్ని పలుచగా వేసి పైన మరొక పొర రేకును వేసి మడత వేయాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి.

బెల్లపు అరిశెలు
కావలసినవి: బియ్యం – ఒకటింపావు కిలో; బెల్లం – కిలో; నువ్వులు, గసగసాలు– కొద్దిగా; నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత

తయారి..

  • బియ్యాన్ని ముందు రోజు రాత్రి శుభ్రంగా కడిగి, మునిగేటట్లు నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి. జల్లించేటప్పుడు పిండి ఆరి΄ోకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒక పాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి. పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి.
  • పెద్దపాత్రలో ఒక గ్లాసు నీటిని, బెల్లం ముక్కలను వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం.
  • ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి. పాకంపిండిని పూరీకి, చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి. ఆ పిండిని పాలిథిన్‌ పేపర్‌ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది, కాగిన నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి. అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి. వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు.

గమనిక: అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్‌ వాడవచ్చు.

  • అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపిగా, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ముదరు పాకం పట్టాలి.
  • ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్‌ చేయాలి. జారిపోకుండా రౌండ్‌ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు.
  • ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్‌ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి.
  • ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్‌ ఉంటే తినే ముందు ఒక మోస్తరుగా వేడి చేసుకుంటే అప్పుడే చేసిన అరిశెల్లాగా తాజాగా ఉంటాయి. చక్కెర అరిశెలు చేయాలంటే బెల్లం బదులు చక్కెరతో పాకం పట్టాలి.  

కొబ్బరి బూరెలు

కావలసినవి:  బియ్యప్పిండి– అరకేజీ; బెల్లం – 300గ్రా.; పచ్చికొబ్బరి– ఒక చిప్ప; ఏలకులపొడి – ఒక టీ స్పూను; నెయ్యి– టేబుల్‌ స్పూన్‌; నూనె – కాలడానికి సరిపడినంత.

తయారి..

  • బియ్యాన్ని శుభ్రంగా కడిగి అరిసెలకు చేసుకున్నట్లే తడిబియ్యాన్ని దంచుకోవాలి. జల్లించి పిండి ఆరిపోకుండా మూతపెట్టి పక్కన ఉంచాలి.
  • పచ్చికొబ్బరిని తురిమి సిద్ధంగా ఉంచాలి. బెల్లాన్ని పాకం పట్టాలి. బూరెలకు పాకం ముదరకూడదు. లేతపాకం సరిపోతుంది.
  • పాకం వచ్చిన వెంటనే కొబ్బరి తురుము వేసి కలపాలి. కొబ్బరి కలిసిన తరువాత మూడు – నాలుగు గుప్పెళ్ల బియ్యప్పిండి వేసి మంట మీద నుంచి దించేయాలి.
  • ఇప్పుడు ఏలకుల పొడి, మిగిలిన బియ్యప్పిండిని వేసి ఉండలు కట్టకుండా సమంగా కలిసే వరకు కలిపి పైన నెయ్యి వేసి అద్ది మూత పెట్టాలి. కొబ్బరి బూరెల పిండి సిద్ధం అన్నమాట.
  • బాణలిలో నూనె పోసి కాగనివ్వాలి. ఈ లోపుగా బూరెల పిండి చిన్న గోళీ అంత తీసుకుని అరచేతిలో కాని పాలిథిన్‌ పేపరు మీద కాని అరిసెలాగా వేళ్లతో ఒత్తి కాగిన నూనెలో వేయాలి.
  • రెండు వైపులా దోరగా వేగిన తరువాత తీయాలి. తీసిన పదినిమిషాలకు వేడి తగ్గి బూరె రుచి ఇనుమడిస్తుంది.

    ఇవి చదవండి: మన ఫుడ్‌ అంతా కార్బోహైడ్రేట్స్‌ మయమా? అదే సుగర్‌కి కారణమా?

>
మరిన్ని వార్తలు