కలెక్టర్ సిక్తా పట్నాయక్
హన్మకొండ అర్బన్: కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో సీఎంఆర్ లక్ష్యాలు పూర్తి చేయడంపై రైస్ మిల్లుల యజమానులతో సమీక్ష నిర్వహించా రు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎఫ్సీఐ వద్ద ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎప్పటిలోగా పూర్తి చేస్తారనే వివరాల్ని అడిగి తెలుసుకున్నారు.
ఎన్నికల నిబంధనలు తెలపాలి
పోలింగ్ నిర్వహణకు సంబంధించిన అన్ని నిబంధనల్ని ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు క్షుణ్ణంగా తెలపాలని మాస్టర్ ట్రైనర్లకు కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. గురువారం కలెక్టరేట్లో ట్రైనర్లకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ ఇచ్చారు. మాస్టర్ ట్రైనర్లు భాస్కర్రెడ్డి, తదితరులు పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు శిక్షణ ఇచ్చారు.
నీటి సరఫరాలో సమస్యల్లేకుండా చర్యలు
వేసవి ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో ఆర్డబ్ల్యూఎస్, ఎంపీడీఓలు, మండల ప్రత్యేకాధికారులతో గ్రామీణ ప్రాంతాల్లో తాగు నీటి సరఫరాపై సమీక్ష నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్లు రాధికగుప్తా, వెంకట్రెడ్డి, డీఆర్ఓ వైవీ గణేశ్, డీఈఓ అబ్దుల్ హై, జెడ్పీ సీఈఓ విద్యాలత, డీపీఓ లక్ష్మి రమాకాంత్, డీఆర్డీఓ నాగ పద్మజ, మిషన్ భగీరథ ఎస్ఈ మల్లేశం, ఆర్డబ్ల్యూఎస్ డీఈలు సునీత, శ్వేత, డీఎస్ఓ వసంతలక్ష్మి, డీఎం మహేందర్, ఏసీఎస్ఓ కేవైఎల్ నరసింహారావు, పౌర సరఫరాల కార్పొరేషన్ జిల్లా మేనేజర్ మహేందర్, జిల్లా సహకార అధికారి నాగేశ్వరరావు, వ్యవసాయ శాఖ జేడీ రవీందర్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించండి
జిల్లాలో ఏప్రిల్ 1వ తేదీన మండలానికి ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని హనుమకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో.. యాసంగి 2023–24 ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులు, ధాన్యం కొనుగోళ్లను చేపట్టే మహిళా సమాఖ్య సంఘాల ప్రతినిధులు, ధాన్యం తరలించేందుకు సంబంధించిన లారీ ఓనర్ల సంఘం, రైస్ మిల్లర్లతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ సిక్తా మాట్లాడుతూ.. జిల్లాలో మొత్తం 146 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోళ్లు చేపట్టనున్నట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ వెంకట్రెడ్డి పాల్గొన్నారు.
బీఆర్ఎస్కు బిగ్ షాక్
పోటీ నుంచి తప్పుకున్న కడియం కావ్య
సాక్షి ప్రతినిధి వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో సంచలన పరిణామం చోటు చేసుకుంది. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ అభ్యర్థి కడియం కావ్య తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపై వస్తున్న అవినీతి ఆరోపణలు, భూకబ్జాలతో పాటు లిక్కర్ కుంభకోణంలో కవిత పాత్ర, ఫోన్ ట్యాపింగ్ తదితర వ్యవహారాల్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకుల, అధినేత పాత్రతో తాను ఆందోళన చెంది పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు తెలిపారు. తనకు వరంగల్ పార్లమెంట్ స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు. కాగా.. కావ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. కావ్య లేదా కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ కావ్య కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేస్తే శ్రీహరిని రాష్ట్ర ప్రభుత్వంలో కేబినెట్ లోకి తీసుకునే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ పరిణామం సంచలనంగా మారింది.