చైనాలో కరోనా కొత్త వేరియంట్‌ కలకలం..ఏకంగా 6.5 కోట్ల మందికిపైగా..

26 May, 2023 11:13 IST|Sakshi

కరోనా పుట్టినిల్లు అయిన చైనాలో మళ్లీ కరోనా విజృంభిస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎక్స్‌బీబీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. జూన్‌లో అదికాస్త గరిష్ట​ స్థాయికి చేరుకుంటుందని, చివరి వారం కల్లా దాదాపు 6.5 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనాను నిరోధించే వ్యాక్సిన్‌ల నిల్వను పెంచే దిశగా చర్యలు ప్రారంభించింది. అలాగే ఈ కొత్త వేరియంట్‌ని ఎదుర్కొనేలా వ్యాక్సిన్‌లను యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నట్లు ప్రముఖ చైనీస్‌ ఎపిడెమియాలజిస్ట్‌ ఝాంగ్‌ నాన్షాన్‌ తెలిపారు.

అలాగే వృద్ధులు జనాభాలో మరణాల పెరుగుదలను నివారించడానికి శక్తిమంతమైన టీకా బూస్టర్‌ తోపాటు యాంటీ వైరల్‌ మందులను సిద్ధం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఇక బీజింగ్‌ సెంట్రల్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ ప్రకారం..గత నెలలో కరోనా కేసులు భారీగా నమోదయ్యాయి. ఏప్రిల్‌ చివరి వారంకల్లా మరింత ప్రబలంగా కేసులు నమోదవ్వడం ప్రారంభమైంది.

ఇదిలా ఉండగా, గత ఏడాదిలో శీతకాలంలో జీరో కోవిడ్‌ విధానాన్ని ఎత్తివేసినప్పటి నుంచి అనూహ్యంగా కేసులు నమోదవ్వడమే గాక దేశంలో దాదాపు 85% మంది అనారోగ్యం బారినపడిన సంగతి తెలిసిందే. కాగా యూనివర్సిటీ హాంకాంగ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌‌ హెల్త్‌ ఎపిడెమియాలజిస్ట్‌ మాత్రం ప్రస్తుత వేవ్‌లో కేసుల సంఖ్య తక్కువగా ఉండటమే గాక మరణాలు కూడా తక్కువగానే నమోదవ్వుతాయని చెబుతున్నారు. ఇది తేలికపాటి వేవ్‌గానే పరిగణిస్తున్నాం, కానీ ఈ మహమ్మారీ ఇప్పటికీ ‍ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపించడం బాధకరమని ఎపిడెమియాలజిస్ట్‌ అన్నారు. 

(చదవండి: ఏం చేయాలో మా బలగాలకు తెలుసు! ఉక్రెయిన్‌ వ్యాఖ్యలకు రష్యా కౌంటర్‌)

మరిన్ని వార్తలు