ఉగ్రవాదుల దాడిలో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి

15 Oct, 2022 12:23 IST|Sakshi

ఇస్లామాబాద్‌: ఉగ్రవాదుల దాడిలో పాక్‌ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతి చెందారు. ఈ ఘటన బలూచిస్తాన్‌లో ఖరన్‌ ప్రాంతంలోని మసీదు వెలుపల చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం....కొంతమంది దుండగులు మసీదు వెలుపల ఉన్న మహ్మద్‌ నూర్‌ మొస్కాంజాయ్‌పై బహిరంగంగా కాల్పులు జరిపినట్లు ఖరన్‌ పోలీస్‌ సూపరింటెండెంట్‌ హలీమ్‌ తెలిపారు. తాము హుటాహుటినా మాజీ ప్రధాన న్యాయమూర్తిని ఆస్పత్రికి తరలించినప్పటికీ... ఆయన తీవ్రగాయాలపాలై మృతి చెందినట్లు వెల్లడించారు.

ఈ మేరకు బలూచిస్తాన్‌ ముఖ్యమంత్రి అబ్దుల్ ఖుదూస్ బిజెంజో మాజీ ప్రధాన న్యాయమూర్తి మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అలాంటి ధైర్య సాహసాల గల న్యాయమూర్తి సేవలను మరిచిపోలేమని అన్నారు. ఇలాంటి ఉగ్ర దాడులతో దేశాన్ని భయపెట్టలేరని, ఇవి పిరికిపందలు చేసే దుశ్చలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో క్వెట్టా బార్‌ అసోసీయేషన్(క్యూబీఏ) ప్రెసిడెంట్‌ అజ్మల్‌ ఖాన్‌ కాకర్‌ కూడా న్యాయమూర్తి మొస్కాంజాయ్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.

ప్రతి పాకిస్తానీ పౌరుడు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారని అన్నారు. ఈ ఘటనకు బాధ్యులను తక్షణమే అదుపులోకి తీసుకుని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటన దేశంలో అధ్వాన్నంగా ఉన్న భద్రతా పరిస్థితిని తేటతెల్లం చేస్తోందన్నారు. అదీగాక గత కొద్ది నెలలుగా పాక్‌లో ఉగ్ర దాడులు ఎక్కువవుతున్నాయని పాక్‌ న్యాయశాఖ మంత్రి షాహదత్ హుస్సేన్ అన్నారు. అంతేగాదు ఈ ఏడాదిలో ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే అత్యధికంగా ఉగ్రదాడుల జరిగాయని ఇస్లామాబాద్‌కి చెందిన థింక్‌ ట్యాంక్‌ పేర్కొంది. పైగా ఈ హింసాత్మక దాడులు ఫటా, ఖైబర్ పఖ్తుంఖ్వాలలోనే దాదాపు 106 శాతం పెరిగిందని వెల్లడించింది. 

(చదవండి: 'నాటో యుద్ధానికి దిగితే ప్రపంచ విపత్తు తప్పదు': పుతిన్‌ స్ట్రాంగ్‌ వార్నింగ్‌)

మరిన్ని వార్తలు