అమెరికా స్పోర్ట్స్‌ పరేడ్‌లో కాల్పులు.. ఒకరు మృతి, 22 మందికి గాయాలు

15 Feb, 2024 08:17 IST|Sakshi

కేన్సాస్‌ సిటీ: అమెరికాలో మరోమారు కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మిస్సోరి రాష్ట్రం(స్టేట్‌) కేన్సాస్‌ సిటీలో స్పోర్ట్స్‌ పరేడ్‌పై దుండగులు తుపాకులతో విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, 22 మంది దాకా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఎక్కువగా చిన్నారులే ఉన్నారని.. వాళ్ల పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య పెరిగేలా కనిపిస్తోంది.

కేన్సాస్‌ సిటీ చీఫ్స్‌ ‘సూపర్‌ బౌల్‌’ విజేతగా నిలవడంతో.. పరేడ్‌ నిర్వహించారు. ఆ సమయంలోనే కాల్పులు చోటుచేసుకున్నాయి.  ఈ పరేడ్‌లో వేలాది మంది పాల్గొనగా.. ఎటునుంచి కాల్పులు జరుగుతున్నాయో తెలియక అక్కడికి వచ్చిన వారు పరుగులు పెట్టారు. క్షతగాత్రులను పోలీసులు సమీప ఆసుపత్రులకు తరలించారు.  కాల్పులు జరిపిన ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు కేన్సాస్‌ సిటీ పోలీస్‌ చీఫ్‌ స్టేసీ గ్రేవ్స్‌ తెలిపారు. కాల్పులకు గల కారణాలపై దర్యాప్తు దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు.

సూపర్‌ బౌల్‌ ఛాంపియన్‌షిప్‌ అనేది అమెరికా నేషనల్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌లో భాగం. ఏటా సూపర్‌ బౌల్‌ ఛాంపియన్‌ షిప్‌ జరుగుతుంది.   గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో కేన్సాస్‌ జట్టు శాన్‌ఫ్రాన్సిస్కోపై నెగ్గింది. దీంతో ఆ జట్టు విజయోత్సవ ర్యాలీ నిర్వహించగా.. వేల మంది ఫ్యాన్స్‌ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిగాయి.

అమెరికాలో గన్‌ కల్చర్‌లో మాస్‌ షూటింగ్‌(సామూహిక కాల్పుల) ఘటనలూ తరచూ చోటుచేసుకుంటున్నాయి. కిందటి ఏడాది.. ఎన్‌బీఏ ఛాంపియన్‌షిప్‌ విజయం నేపథ్యంలో డెన్వర్‌(కొలరాడో)లో నిర్వహించిన ఫ్యాన్స్‌ సంబురాల్లోనూ కాల్పులు జరిగాయి. అప్పుడు పది మంది గాయపడ్డారు. అంతకు ముందు.. 2019లో టోరంటోలో జరిగిన కాల్పుల్లో నలుగురు గాయపడ్డారు.

whatsapp channel

మరిన్ని వార్తలు