బోరుమంటున్న బార్లు, క్లబ్బులు

30 Sep, 2020 18:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్‌ కట్టడి చేయడం కోసం గత మార్చి నెలలో ఇంగ్లండ్‌ అంతటా విధించిన లాక్‌డౌన్‌ కారణంగా మూసుకుపోయిన రెస్టారెంట్లు, బార్, పబ్బులు, క్లబ్బుల్లో నాలుగోవంతు నేటికి తెరచుకోలేదు. 28,896 తెరచుకోక పోవడం వల్ల లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని ‘సీజీఏ అండ్‌ ఆలిక్స్‌ పార్టనర్స్‌’ సర్వేచేసి మరీ తేల్చారు. మరో విడత ఆంక్షల కింద రాత్రి పది గంటలకల్లా బార్లు, పబ్‌లు, క్లబ్బులను మూసివేయాలంటూ ఉత్తర్వులు అమల్లోకి తేవడం వల్ల తమ వ్యాపారానికి మళ్లీ గండి పడిందని ఇంగ్లండ్‌లో 27 వేల హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్బులను నడుపుతోన్న గ్రీన్‌ కింగ్‌ మీడియా ముందు వాపోయారు. చివిరి నిమిషంలో మద్యం కొనుగోళ్ల కోసం పబ్బులు, క్లబ్బులకు వచ్చిన కస్టమర్లు షాపులకు పరుగెత్తుతున్నారని ఆయన చెప్పారు. (కోవిడ్‌ వ్యాక్సిన్‌ వచ్చినా తీసుకోను)

రాత్రి పది గంటల నుంచి కర్ఫ్యూను అమలు చేయడం అర్థరహితమని దాదాపు 720 కమ్యూనిటీ పబ్బులను నడుపుతోన్న హాథార్న్‌ లీజర్‌ సంస్థ మార్క్‌ డెవీస్‌ తెలిపారు. ఇప్పటికే 50 శాతం వ్యాపారం పడిపోగా, కొత్తగా అమల్లోకి వచ్చిన ఆంక్షల వల్ల వ్యాపారం మరింత పడిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. లాక్‌డౌన్‌ సందర్భంగా గత మార్చి నెలలో మూతపడిన లంకాషైర్‌లోని ‘ప్రిన్స్‌ విలియం పబ్‌’ను జూలైలో తెరచినప్పటికీ వ్యాపారం పుంజుకోలేదు. ఫలితంగా దాన్ని ఇప్పుడు రాబిన్‌సన్‌ బేవరీ అమ్మకానికి పెట్టింది. క్లబ్బులు, పబ్బుల్లో పనిచేసే సిబ్బందే కాకుండా, వీటిని నమ్ముకుని బతికే డీజేలు, సింగర్లు, ఫ్యాషన్‌ మోడల్స్‌ కూడా రోడ్డున పడ్డారు. కరోనా బారిన పడిన పలు దేశాల్లో పబ్బులు, క్లబ్బుల పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. (క‌రోనా క‌ట్ట‌డిలో ఆంధ్రప్రదేశ్‌ ఆదర్శం)

>
మరిన్ని వార్తలు