'గొడవలు పెట్టుకోవద్దు.. పరువు పోతుందంటూ..' చివరికి బీటెక్‌ విద్యార్థి?

22 Oct, 2023 08:49 IST|Sakshi
అభిలాష్‌ (ఫైల్‌)

అత్తాకోడళ్ల గొడవతో మనస్తాపం చెందిన బీటెక్‌ విద్యార్థి!

పెద్దపల్లి జిల్లా నారాయణపూర్‌ గ్రామంలో ఈ ఘటన..

సాక్షి, కరీంనగర్: అత్తాకోడళ్ల గొడవతో మనస్తాపం చెందిన బీటెక్‌ విద్యార్థి పడాల అభిలాష్‌(20) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం నారాయణపూర్‌ గ్రామంలో శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై విజేందర్‌, కుటుంబసభ్యుల కథనం ప్రకారం.. గ్రామానికి పడాల రమేశ్‌–రేణుక దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇందులో పెద్దకుమారుడు అభిలాష్‌ కరీంనగర్‌లోని ఓ కాలేజీలో బీటెక్‌ చదువుతున్నాడు. ఇతడి తల్లి, నానమ్మ ఇంట్లో తరచూ గొడవపడుతున్నారు.

ఈ క్రమంలో శుక్రవారం కూడా గొడవపడ్డారు. ఇంట్లో గొడవలు జరిగితే తమ పరువు పోతుందని ఇద్దరికీ చెప్పాడు. గొడవలు పెట్టుకోవద్దని సూచించాడు. అయినా, అత్తాకోడళ్లు ఇదేమీ పట్టించుకోలేదు. తీవ్రమనస్తాపం చెందిన అభిలాష్‌ తన ఇంటి సమీపంలో పత్తి చేనులోకి వెళ్లాడు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబసభ్యులు తొలుత పెద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించడంతో కరీంనగర్‌లోని మరో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Follow the Sakshi TV channel on WhatsApp:

మరిన్ని వార్తలు